Home Telugu అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, ఏడుగురి మృతి

అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, ఏడుగురి మృతి

0
SHARE

జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ప్రభుత్వం భయపడినంతా జరిగింది.. పవిత్ర అమర్‌నాథ్‌యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పోలీసులు సహా మరో 11 మంది గాయపడ్డారు.

అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై సోమవారం రాత్రి 8.20 గంటలకు ముష్కరులు దాడి చేశారు. పోలీసులు ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయిన ముష్కరులు ఉన్మాదంతో కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే పైకి అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు వచ్చింది. ఉగ్రవాదుల తూటాలు తగలడంలో యాత్రికులు బలయ్యారు. వీరంతా అమర్‌నాథ్‌ గుహలోని మంచు శివలింగాన్ని సందర్శించుకొని తిరుగుప్రయాణంలో ఉన్నారు. ఈ బస్సు సోన్‌మార్గ్‌ నుంచి బయలుదేరింది. బస్సు డ్రైవర్‌ యాత్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీద తిరగకూడదని చెప్పారు. అయితే ఉగ్రవాదుల లక్ష్యం భద్రతా దళాలేనని, యాత్రికులు కాదని తెలిపారు. ఈ బస్సు గుజరాత్‌కు చెందిందని అధికారులు చెప్పారు. సీఆర్పీఎఫ్‌ భద్రత కలిగిన ప్రధాన యాత్రలో ఇది భాగం కాదని పేర్కొన్నారు. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. కశ్మీర్‌ చరిత్రలో చీకటి రోజని రాష్ట్ర మంత్రి నయీం అఖ్తర్‌ తెలిపారు. యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారని చెప్పారు.

1.2 లక్షలమంది పేర్లు నమోదు

మిలిటెంట్లు దాడిచేయవచ్చనే నిఘావర్గాల సమాచారం మేరకు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత నడుమ వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్ర కోసం 1.2 లక్షలమంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పహల్గామ్‌, బాల్టాల్‌ మార్గాల్లో ఇది సాగుతుంది. బాల్తాల్‌.

బేస్‌క్యాంప్‌ మార్గంలో 6,000 మంది, పహల్గామ్‌ మార్గంలో 5,000 మంది బయలుదేరారు. యాత్ర భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం వేల మంది పారామిలటరీ దళాలను మోహరించింది. 45 రోజలు పాటు సాగే ఈ యాత్ర కోసం ఉపగ్రహ ఆధారిత గమన పరిశీలన వ్యవస్థ, డ్రోన్లు, సంచార బంకర్‌ వాహనాలు, రహదారులపై తనిఖీ చేసే బృందాలు వంటి వాటిని రంగంలోకి దించింది. ఈ ఏడాది 100 మంది పోలీసులను, 100-150 మంది అమర్‌నాథ్‌ యాత్రికులను ఉగ్రవాదుల లక్ష్యంగా చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.

ఇది పిరికిపందల దాడి: ప్రధాని మోదీ

దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద దాడులకు, విద్వేష పూరిత వ్యూహాలకు లొంగేదిలేదని స్పష్టం చేశారు. ఆయన జమ్ము-కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

తీవ్రమైన నేరం: జైట్లీ

ఉగ్రవాదుల దాడి తీవ్రమైన నేరమని రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న సంకల్పం మరింత బలపడాలని చెప్పారు.

మానవత్వంపై జరిగిన దాడి: సోనియా

శివభక్తులపై జరిగిన దాడి మానవత్వంపై చేసిన నేరపూరిత చర్య అని అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఉన్న లోపాలపై దర్యాప్తు చేయించాలని సూచించారు.

శాంతియుతంగా వెళ్తున్న అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన క్రూరమైన దాడి మాటలకు అందనిది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నా ఆలోచనలన్నీ తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వారి చుట్టూ తిరుగుతున్నాయి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా

– ట్విట్టర్‌లో ప్రధాని మోదీ

(ఈనాడు సౌజన్యం తో)