Home News అటవీ స్థలంలో నిర్మాణంలో ఉన్న అక్రమ మసీదు కూల్చివేత

అటవీ స్థలంలో నిర్మాణంలో ఉన్న అక్రమ మసీదు కూల్చివేత

0
SHARE

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు అడ్డరోడ్డు వద్ద అటవీ స్థలంలో నిర్మాణంలో ఉన్న అక్రమ మసీదును అటవీ శాఖ అధికారులు తొలగించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జేసీబీ సాయంతో దీన్ని కూల్చేశారు.

ముందస్తు జాగ్రత్తగా  ఏర్పాటు చేసిన పోలీసు బలగాల సహాయంతో మణుగూరు ఇన్‌ఛార్జి అటవీ శాఖ డివిజనల్‌ అధికారి దామోదర్‌రెడ్డి, అశ్వాపురం రేంజి అధికారి జి.ప్రసాదరావు, ఏడూళ్ల బయ్యారం రేంజి అధికారి కోటేశ్వరరావు నేతృత్వంలో ఈ అక్రమ నిర్మాణ తొలగింపు జరిగింది. ఈ సందర్భంగా పాల్వంచ, అశ్వారావుపేట, అశ్వాపురం డివిజన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది రక్షణ కల్పించారు. ఈ సమయంలో అటవీ శాఖ, పోలీసు సిబ్బంది కలిసి సుమారు 250 మంది వరకు ఉంటారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
అక్రమ నిర్మాణం తొలగింపు విషయం తెలుసుకున్న కొందరు ముస్లింలు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించుకుంటున్న తమ ప్రార్ధన స్థలాన్ని అన్యాయంగా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.