Home Ayodhya అయోధ్య మధ్యవర్తిత్వం విఫలం: ఆగస్టు 6 నుండి సుప్రీంకోర్టు రోజువారీ విచారణ

అయోధ్య మధ్యవర్తిత్వం విఫలం: ఆగస్టు 6 నుండి సుప్రీంకోర్టు రోజువారీ విచారణ

0
SHARE

అయోధ్య వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా.. ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపలేకపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఈ కేసును ఆగస్టు 6 నుంచి తామే రోజువారీ విచారణ చేపడతామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడం కోసం సుప్రీమ్ కోర్టు ఈ ఏడాది మార్చి 8న ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి చోటుచేసుకోవడం లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై జులై 11న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పురోగతిని తెలియజేస్తూ జులై 18లోగా తమకు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. పురోగతి నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. జులై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించి ఆగస్టు 1న మరోసారి నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలోని కమిటీ గురువారం నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. అయోధ్య అంశంలో సామరస్యానికి మధ్యవర్తిత్వ కమిటీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అభిప్రాయపడింది. దీంతో ఈ నెల 6 నుంచి తామే రోజువారీ విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.