Home News వ్యవసాయిక రసాయనాల వినియోగం పై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి : భారతీయ కిసాన్...

వ్యవసాయిక రసాయనాల వినియోగం పై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి : భారతీయ కిసాన్ సంఘ్

0
SHARE

భారతీయ కిసాన్ సంఘ్ వారి అఖిల భారతీయ ప్రతినిధి సభలు ఈ సంవత్సరం 1-3 డిసెంబర్ వరకు పర్భణీ నగరం, మహారాష్ట్ర లో నిర్వహించబడినవి.

ఈ సమావేశాలలో ప్రస్తావించిన తీర్మానాలు:

వ్యవసాయిక రసాయనాల వినియోగం పై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి

—-

కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లాలో రైతులు క్రిమి సంహారక రసాయన పదార్థాలు వాడినపుడు, వాటి దుష్ప్రభావం వలన 27 మంది రైతులు మృత్యువాత పడ్డారు మరియు వందలాది రైతులు ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఇంతకు ముందు కూడా ఇటువంటి దుష్ప్రభావమునకు తెలంగాణ,ఒడిషా, విదర్భ మొదలగు ప్రాంతాల రైతులు మృత్యువాత పడ్డారు. పంజాబ్,ఢిల్లీ ప్రాంతాలలో క్యాన్సర్ వ్యాధి ప్రభలి అనేకులు వ్యాధిగ్రస్తులైనారు.

నేడు వ్యవసాయిక రసాయనాలు ఉపయోగించడానికిగల “నియంత్రణ చట్టాలు” నిక్కచ్చిగా లేవు. ప్రస్తుతం రైతులకు లభించే రసాయనాలలో పరిమాణము, నాణ్యతలపై అధికారిక పర్యవేక్షణ కూడా లేదు. దీనికి సంబంధించిన పరశోధనా వ్యవస్థ కూడా లోపించిందనే భావించాలి. తత్ఫలితంగా నిషిద్ధ రసాయనాలు విచ్ఛలవిడిగా అత్యధిక పరిమాణంలో మార్కెట్ లో అమ్మబడుతున్నాయి.

దీని వలన నేడు రసాయన విక్రేతలు దేశ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారనేది అత్యంత ప్రధాన శోచనీయ వాస్తవ సమస్య.

ఈ పరిస్థితులలో రసాయనాలు వినియోగించి మరణించిన రైతుల జీవితాలకు ఒకటీ – రెండు లక్షల రూపాయల విలువ కడుతూ, వారి కుటుంబాలను మృత్యులోయలోనికి నెట్టివేస్తున్న కంపనీ యాజమానులు-విక్రేతలు మాత్రం నిర్భయంగా, సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారు.

ఈ పరిస్థితులను ఆమూలాగ్రంగా సమీక్షించి “కిసాన్ సంఘ్ ప్రతినిధి సభ”లో రైతుల యోగ- క్షేమాలే ధ్యేయంగా ఈ దిగువ తీర్మాణాలు చేయబడినవి.

1) అన్ని రకాల వ్యవసాయిక రసాయనాల పైన ఆయా ప్రాంతాల వాతావరణానికి అనుగుణంగా రసాయన పరిమాణం, ప్రామాణికత, నాణ్యతలు శాస్త్రజ్ఞుల ద్వారా నిర్ణయింప జేయాలి.

2) మన దేశంలో క్రిమి సంహారక రసాయనాలు మరియు వ్యవసాయిక రసాయనాల వినియోగం పై ప్రభుత్వ పరంగా “మేనేజ్ మెంట్ బిల్లు” తప్పక రూపొందించాలి.

3) ఏ కంపెనీయైనా రసాయన పరిమాణం, ప్రమాణం, నాణ్యతలు ఉల్లంఘించి ఉత్పాదనలు జరిపినట్లైతే ఆ కంపెనీలను నిషేధించి పెద్ద మొత్తం జరిమానా విధించి, తత్సంబంధిత వ్యక్తులకు కఠిన శిక్ష విధించాలి.

4) ప్రాణ ఘాతుక వ్యాధులకు కారణమయ్యే గ్లెఫోసిట్ మరియు ఇతర రసాయనాలను, వాటిని వాడే ఉత్పత్తులను సంపూర్ణంగా నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేయాలి.

5) డీలర్లు మరియు విక్రేతల లైసెన్సు కలిగియున్నవారిపై కనీస శిక్షా ప్రమాణాలు నిర్ణయించి, వినియోగదరులకు తప్పుడు సరుకు, సమాచారాలు, సలహాలు ఇచ్చిన వారికి కఠినంగా శిక్ష విధించాలి.

6) అన్ని రకాల వ్యావసాయిక రసాయనాలు ఉపయోగించే పద్ధతుల అవగాహన, అందుకు తగిన శిక్షణ మరియు సంకట సమయంలో స్వీయ రక్షణ సామగ్రి అందించే బాధ్యత ఉత్పాదక కంపెనీలే వహించాలి.

7) తమ ఉత్పాదక రసాయనాలు వాడిన రైతులకు ఆశించిన ఫలితం దక్కనప్పుడు ఉత్పాదక కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాలి.

8) ఈ రసాయనాల వినియోగ ప్రభావంతో రైతులు వ్యాధిగ్రస్తులైనా, మరణించినా వారి శేష జీవితకాల ప్రమాణం అనుసరించి వారి కుటుంబీకులకు రసాయన ఉత్పాదక కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాలి.

9) కంపెనీలు ఇచ్చే ప్రతి వివరణ సమాచారం మరియు ప్రచార విషయాలు ప్రాంతీయ భాషలలోనే అందించే బాధ్యత కంపెనీలే వహించాలి.

10) వ్యవసాయిక రసాయనాల ప్యాకింగులన్నింటి పైన “ఇది ఆరోగ్యానికి హానికరమైనది”-అనే హెచ్చరికలు మరియు అందులో గల “రసాయనాల ప్రామాణికత-ప్రభావ సామర్థ్యము’-విధిగా సూచించే బాధ్యత కంపెనీలే వహించాలి.

11) కలుపు మొక్కల నివారణ/నిర్మూలన కోసం సేంద్రియ పదార్థాలే వాడాలి, ప్రాణాంతక రసాయనాలు నిషేధించాలి