Home News గ్రామంలో పాలు ఉచితంగా ఇస్తారు తప్ప విక్రయించరు

గ్రామంలో పాలు ఉచితంగా ఇస్తారు తప్ప విక్రయించరు

0
SHARE

మాట ఇచ్చిన వాళ్లు చనిపోయి ఉండొచ్చు కానీ… ఇచ్చిన మాట బతికే ఉంటుంది కదా అస్లాంఖాన్‌జీ’ బాహుబలి చిత్రంలో వాగ్దానం గురించి కట్టప్ప మాటలు ఇవి. తరాలు మారినా ఇలా మాట నిలుపుకొనే మనుషులు మన చుట్టూ ఉన్నారు. నమ్మశక్యంగా లేదా… కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లి, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామాల వారు పూర్వీకులు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. తాతముత్తాతలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తూ నేటికి ఈ రెండు ఊర్లు పాలు అమ్మని పల్లెలుగా కొనసాగుతున్నాయి. ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తారు తప్ప విక్రయించరు. మనకు మనంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే కొద్ది రోజుల తరువాత ఎంతో కష్టంగా మారుతుంది. వరస కరవులు… సాగు సాగని ప్రతికూల పరిస్థితులున్న ఈ ప్రాంతంలో చుట్టు పక్క గ్రామాల్లో రైతులు పాడినే ప్రధాన జీవనాధారంగా మార్చుకున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ వెరవకుండా వారు మాత్రం పెద్దలు చెప్పిన మాట మరవకుండా సాగుతున్నారు.

మాట మీరకుండా : గంజహళ్లిలో కొన్ని శతాబ్దాల క్రితం మహాత్మ బడే  సాహెబ్‌ తాత అనే ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. ఓ రోజు తాత తన కుమారుడికి పాలు తీసుకురావాలని సూచించారు. గ్రామంలోకి వెళ్లిన కుమారుడు పశువులు వ్యాధుల బారినపడి మృతిచెందాయని, కరవుతో రైతులు పోషించలేక అమ్ముకున్నారని… ఎక్కడా పాలు దొరకలేదని తిరిగి వస్తారు. బడేసాహెబ్‌ గ్రామంలో ఓ రైతు పేరు చెప్పి ఆయన ఇంట్లో గోవు ఉంది అక్కడ నుంచి తీసుకురమ్మని సూచిస్తారు. కుమారుడు ఆ గోవు దగ్గరకు వెళ్లేసరికి అదీ ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న గోవు నుంచే పాలు పితికి తీసుకెళ్తారు. అప్పడే బడేసాహెబ్‌ స్వామి గ్రామంలో గోవధ వద్దని, పాలు అమ్మకూడదని ప్రజలకు చెబుతారు. ఆయన మాట మీరకుండా నాటి నుంచి నేటి వరకు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవరూ పాలు అమ్మరు, పాడి ఉన్న వారు పిల్లల కోసం ఎవరైనా అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారని గ్రామస్థులు చెబుతారు.

తరాలుగా తప్పని మాట : కడిమెట్లలో పాలు విక్రయించవద్దని పూర్వీకుల చెప్పిన మాటను తరతరాలుగా పాటిస్తున్నారు. నాలుగువేల జనాభా ఉన్న గ్రామంలో 300కు పైగా కుటుంబాలు పశుపెంపకంలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధానాధారమైన వీరందరిళ్లలో పాడికి కొదవలేదు. అయితే ఏ ఒక్కరూ పాలను అమ్మరు. గ్రామంలో ఎవరైనా చిన్నారుల కోసం, వివాహాలు, పండగల సమయంలో అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు. రోజూ ఉదయం గ్రామస్థులకు చిక్కటి మజ్జిగ పంపిణీ చేస్తారు. గ్రామం మొత్తానికి పాలు పోసే వీరు మాత్రం ఆదివారం రోజు రాత్రి వేళ ఒక్కసారే వాటిని తాగుతారు. అదీ ప్రతి శనివారం గ్రామంలోని చెన్నకేశవస్వామికి తెల్లవారుజామునే దీపారాధన చేసిన తరువాతే. మజ్జిగ తయారీతో వచ్చే నెయ్యి ప్రతి ఆదివారం ఉదయం విక్రయిస్తారు. ఈ ఆచారం వెనుక నేపథ్యం ఏంటనే విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పూర్వీకులు మా తాతముత్తాతలకు చెప్పారు వారు అనుసరించారు…వారు చెప్పిన మాటను మేం పాటిస్తున్నామని యాదవులు చెబుతున్నారు. గ్రామంలోని ఇతర సామాజిక వర్గాలు, రైతుల్లో పశుపోషణ చేసేవారు చాలా తక్కువ. అలా చేసే వారూ ఇంటి అవసరాలకు వాడుకోవడం, ఇరుగుపొరుగు అడిగితే పాలను పోస్తారు తప్ప విక్రయించకపోవడం గమనార్హం.

– బాదిని ఉపేందర్‌, ఈనాడు, కర్నూలు