Home News సమరసతే దేశ సమైక్యతకు మార్గం – శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామీజీ

సమరసతే దేశ సమైక్యతకు మార్గం – శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామీజీ

0
SHARE

కులాలు, వర్గాలకతీతంగా  సమాజం ఒక్కటైనప్పుడే సామాజికంగా, ఆర్థికంగా,సాంస్కృతికంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు. కులం అంటే శాస్త్రం అనీ, కులం అంటే కళ యని, కులం అంటే వృత్తి అని శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి జి తెలిపారు.

జనవరి 7 ఆదివారంనాడు వాసవి గార్డెన్స్ లో జరిగిన సమరసత సమ్మేళనం లో స్వామి జి పాల్గొన్నారు. ఇందులో మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల ప్రజలు సుమారు 400 మందికి పైగా పాల్గొన్నారు. 20 గ్రామాలనుండి అన్ని వర్గాల ప్రజలు రాగా, అందులో 150 మంది ఎస్ సి బంధువులు మిగతా 250 మంది అన్ని కులాల వారు హాజరయ్యారు. 100 మహిళలు వచ్చారు.

స్వామి జి మాట్లాడుతూ కోమట్లు దేశ విదేశాలలో లభించిన ఏ వస్తువునైనా గ్రామాల వరకు అందించే సివిల్ సప్లై వ్యవస్థ చేతబూని నడిపించారు. దేవాలయ వ్యవస్థ లో భేరీలు, ఢక్కాలు, శబ్దం చేసే పరికరాలు, మంచినీటి సరఫరా చేయడానికి కావలసిన తోలు తిత్తులు మొదలైనవి, అలాగే తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు దర్శించే చెప్పులు ఇవన్నీ  మాదిగలు తయారు చేెసిచ్చినవే. మాతంగ ఆశ్రమం లో (మాదిగ కన్యగా) జన్మించి, తప:సంపన్నుడైన వశిష్ఠుడికి అనుకూలవతి భార్యగా పతివ్రతగా పేరుపొందిన అరుంధతి లభిస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ నలుగురికి 7సంవత్సరాలు అన్నంపెట్టి పెంచిన మహా సాధ్వి అరుంధతి.ఆమె జననము  మాతంగి మహర్షి ఆశ్రమంలోనే జరిగింది‌. ఆమె నక్షత్రమై ఆకాశములో వుంటే, వివాహ వేళలొ, నూతన దంపతులకు ఆ నక్షత్రమే చూపించి, దండం పెట్టిస్తారు.

ముదిరాజ్ లు దేశంలో పండించిన పండ్లను ప్రజలకు అందించిన వారు. ఉప్పెరలు, వడ్డరలు కాకతీయుల కాలం నుండి చెరువులు, బావులు త్రవ్విన, రోడ్లు వేసిన  నిపుణులు. అలాగే ఎవరింట్లో వివాహం జరిగినా, వధూవరులు మొదట బట్టలు కొన్నప్పుడు ‘ తల్లి చీర’ పేరుతో ఇంటికి సేవ చేసే చాకలికి ఆ చీర కొని అందించే అలవాటు ఉంది. కమ్మరి, కుమ్మరి, ఔసలి, వడ్రంగి, శిల్పాలు చెక్కే వారందరికీ విశ్వకర్మ ఇలవేలుపుగా చేసికుని, విశ్వబ్రాహ్మణులు అయ్యారు. ఆదిలాబాదులో రంజనులు తయారు చేసే కుమ్మరి ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రంజన్ లు తయారు చేస్తే , రాష్ట్రం అంతా కొనుక్కోవడానికి వచ్చేవారు. దేవుని పూజకు కావలసిన బుక్కాగులాలు (రంగులు) చేసేవారికి పుష్కలంగా డిమాండ్ వుంది. మంగలి ఫిజియోథెరపీలో ప్రావీణ్యం కలిగినవారు. ప్లాస్టిక్ సర్జరీలో అత్యంత నిపుణులు. అద్భుతమైన చేనేత కళా నైపుణ్యానికి ఉదాహరణ పద్మశాలి కులస్థులు. వీరి నేసిన బట్టలు ముంబాయి నుండి నారాయణపేటకు వచ్చి వస్త్రాలు కొనుక్కుని వెళ్లేవారు. బ్రాహ్మణులు గర్భగుడిలో యజుర్వేద మంత్రాలు చదువుతూ ఉంటే, నాయీ బ్రాహ్మణులు తమ నాద స్వరాలతో సామవేద గానం వినిపించారు. బ్రాహ్మణులు వ్యవసాయ రంగంలో కూడా అనుభవం గలవారు. అటు వ్యవసాయం, ఇటు పౌరోహిత్యం కూడా చేస్తూ వచ్చారు. మాలలు అన్నిపనులను చేయడం లో నిష్ణాతులు. పెరిక కులస్థులు విత్తన అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. వృక్ష శాస్త్రం గురించి అవగాహన కలిగినవారు. గౌడ కులస్తులు శ్రమ జీవుల కోసం ఈత కల్లు, తాటి కల్లు ( ఇప్పుడు క్లోరోఫామ్, డైజో ఫామ్ వంటివి కలపటం తొ ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి) తో ప్రజల అనారోగ్యం నివారణ జరిగేది. యాదవులు పాల ఉత్పత్తి లో అందెవేసిన చెయ్యి. అలాగే జంతుశాస్త్రంలో ప్రతిభావంతులు.

ఈ విధంగా మనిషి ఒక సంఘజీవిగా ఒక గ్రామంలో పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే వ్యవహారాల తో గ్రామాలు విలసిల్లినవి. కాలక్రమేణా ఆంగ్లేయుల కాలంలో  రైతులపై అధిక పన్నులు విధించి, చేనేతకార్మికుల చేతివ్రేల్లు నరికి, అన్ని రకాల చేతివృత్తుల వారిని  ఆంగ్లేయులు దెబ్బతీసారు. గ్రామీణ వ్యవస్థ ను నాశనం చేశారు.

సన్మానం:

ఎస్ సి లని కూడగట్టుకుని కుస్తాపూర్ గ్రామంలో శివాలయం నిర్మాణానికి ముందు నిలిచిన గంగమ్మ ను, గోధూరు గ్రామంలో రామాలయం మాల పూజారి సత్తయ్య, వెల్లుల్ల గ్రామంలోని అక్కగొండ నరసింహ స్వామి ఆలయం మాదిగ పూజారి గంగయ్య , కోరుట్ల ప్రక్కన కట్లకుంట గ్రామంలో ప్రతి ఉదయం 8 గంటలకు జనగణమన జాతీయ గీతం నిర్వహణ ద్వారా ప్రజలలో దేశ సమైక్యత కు కృషి చేస్తున్న అహ్మద్, రాజేందర్, పంచాంగం అలాగే గీతాపారాయణ ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక భావనలు నిర్మిస్తున్న మాదిగ వంశస్థులు లక్ష్మీ నారాయణ,94 సంవత్సరాల వయస్సులో యోగ నేర్పుతున్న బాలయ్య మొదలైన వారికి స్వామీజీ శాలువా తో సత్కరించారు.

మెట్లచిట్టాపూర్ సర్పంచ్, సమరసత వేదిక జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి నిర్వహణ లో కార్యకర్తలు పనిచేసి సమ్మేళనం విజయవంతం చేశారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు వెంకటరమణారెడ్డి , కార్యదర్శి గంగాధర్, బండ లింగాపూర్ అంబేద్కర్ సంఘం నాయకులు తుకారాం పాల్గొన్నారు. నిరంజన్ సభా కార్యక్రమం నిర్వహించారు. మెట్‌పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి కూడా ప్రసంగించారు. నేరెళ్ల గ్రామ ఎమ్ పిటిసి ఇంద్రాల మల్లేశం, మెట్‌పల్లి మండల అధ్యక్షుడు గోపి మాట్లాడారు.