Home News ‘హిందూ ఉగ్రవాదం’ కట్టుకథ బట్టబయలు !

‘హిందూ ఉగ్రవాదం’ కట్టుకథ బట్టబయలు !

0
SHARE

మక్కామసీదు పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మొత్తం 11 మంది ముద్దాయిలనూ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైదరాబాద్‌ న్యాయస్థానం ఏప్రిల్‌ 16న తీర్పు ఇవ్వటంతో పదకొండేళ్ళ కాంగ్రెసు కుటిల నాటకానికి తెరపడింది. హిందూ సంస్థల మీద, హిందూ ప్రముఖుల మీద పెసరంత సాక్ష్యం లేకుండా యు.పి.ఎ. బానిస ప్రభుత్వం వేసిన ‘హిందూ ఉగ్రవాదం’ ముద్ర ఎటువంటి పాపిష్టి పన్నాగమో లోకానికి అసందిగ్ధంగా వెల్లడైంది.

గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి.

మన మతిమరపు మీద మనల్ని విడవకుండా వెంటాడుతున్న రాజకీయ రాక్షస శక్తులకు గొప్ప నమ్మకం. ప్రజల జ్ఞాపక శక్తి ఎంత తక్కువైనా, మరీ పదిపన్నేండేళ్ళ కిందట జాతి వ్యతిరేకులైన మన సోకాల్డ్‌ జాతీయ నాయకులు చేసిన నేరాలను, మహా పాపాలను కూడా జనాలు మరిచిపోతారా?’

ఉదాహరణకు ‘హిందూ ఉగ్రవాదం’ బూచినే తీసుకోండి.

రాజ్యమేలేవారికి ద్వేషాలు, రోషాలు ఎన్నయినా ఉండవచ్చు. గిట్టని రాజకీయ పార్టీలను, కంటగింపయిన జాతీయ శక్తులను దెబ్బతీసి, దీర్ఘకాలం తామే అధికారం చలాయించగలిగేందుకు శాయశక్తులా ప్రయత్నించటంలోనూ తప్పు లేదు. కాని దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. రాజకీయ స్వార్థాలు, పార్టీ అవసరాలు, ఎన్నికల కక్కుర్తులు ఎన్ని ఉన్నా.. జాతి భద్రత, దేశహితం, ప్రజారక్షణ, జాతి శత్రువుల అణచివేతల వంటి అతి ముఖ్య విషయాల్లో సంకుచిత రాజకీయాలను పక్కనపెట్టి, దృఢంగా, ధర్మబద్ధంగా వ్యవహరించటం పాలకుల కనీస ధర్మం.

ఆ ఇంగిత జ్ఞానమే నాలుగేళ్ళ కిందటిదాకా ఈ దేశాన్ని పిశాచంలా పట్టి వేగించిన ఇటలీ దొరసానమ్మగారి బానిస ప్రభుత్వానికి కొరవడింది.

పన్నెండేళ్ళ కిందటి మాట.

పాకిస్తానీ ముష్కరులు కరాచీ నుంచి పడవల్లో వచ్చి ఏకంగా ముంబయి మహానగరాన్ని ముట్టడించి, 164 మంది ప్రాణాలను రాక్షసంగా హరించిన 2008 ఘోరకలికి రెండు సంవత్సరాల ముందు నుంచే ఇస్లామిక్‌ టెర్రరిజం హిందుస్తాన్‌ మీద పలుమార్లు పంజా విసిరింది. 2006లో మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని మాలేగావ్‌లో వరసబెట్టి బాంబులు పేలాయి. శుక్రవారం ప్రార్థనలతో కిక్కిరిసిన మసీదు సమీపాన సెప్టెంబర్‌ 8న పేలిన బాంబులు 37 మంది ముస్లిం భక్తుల ప్రాణాలు తీశాయి.

అది జరిగి ఆరునెలలు తిరక్కుండా ఢిల్లీ, బిహార్‌ల మధ్య వారానికి రెండుసార్లు నడిచే సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి పానిపట్టు వద్ద రెండు బోగీల్లో పేలిన బాంబులు నిద్రిస్తున్న 68 మంది ప్రయాణీకుల ఉసురు తీశాయి. మళ్లీ మూణ్నెల్లకు హైదరాబాదు లోని మక్కామసీదులో 2007 మే 18 మధ్యాహ్నం శుక్రవారం ప్రార్థనల సమయాన బాంబు పేలుడు మూలంగా 16 మంది మరణించారు.

ఇంకో ఐదు నెలలకు అదే సంవత్సరంలో మూడో బాంబు పేలుడు. ఈసారి అజ్మీర్‌లోని మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాలో. 2007 అక్టోబర్‌ 11న రంజాన్‌ మాసంలో సాయంత్రం ప్రార్థనలు అయ్యీ కాగానే టిఫిన్‌ క్యారియర్‌లో దాచిన బాంబు పేలి ముగ్గురిని చంపింది.

సంవత్సరం వ్యవధిలో నాలుగుచోట్ల జరిగిన ఈ ఘాతుకాలలో ఒక సమానాంశం ఉంది. నాలుగు పేలుళ్ళలోనూ వాడింది ఆర్‌.డి.ఎక్స్‌. అది ప్రధానంగా ఇస్లామిక్‌ టెర్రరిస్టు సంస్థల దగ్గరే ఉంటుంది. మాలేగావ్‌ పేలుడుకు ఉపయోగించిన ఆర్‌డిఎక్స్‌, అమ్మోనియం నైట్రేట్‌ మిశ్రమాన్ని సరిగ్గా అదే పాళ్ళలో అందుకు మూడు నెలల ముందు (2006 జూలై 11న) ముంబాయిలో ట్రెయిన్‌ బాంబుల్లోనూ వాడారు. ఆ ట్రెయిన్‌ బాంబింగు ‘వీరులే’ మాలేగావ్‌ మసీదు దగ్గరా ప్రతాపం చూపారని మెడమీద తలకాయ ఉన్న ఎవడికైనా అర్థమవుతుంది. అందుకే ఇస్లామిక్‌ టెర్రరిస్టు ముఠాలు లష్కరే తోయిబా, జైష్‌-ఎ-మొహమ్మద్‌, సిమిలతోబాటు బజరంగ్‌దళ్‌నూ అనుమానితుల లెక్కలో మొదట చేర్చిన మహారాష్ట్ర పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడు (ఎ.టి.ఎస్‌.) హిందూ సంస్థల దగ్గర అంతటి విధ్వంసక వనరులు లేవన్న కారణంతో బజరంగదళ్‌ పేరు తీసేసింది.

మిగతాచోట్ల ఇదే కథ. నాలుగు పేలుళ్ళూ జరిగినవి వేరు వేరు రాష్ట్రాల్లో. అక్కడ ఆ సమయాన రాజ్యమేలుతున్నది కాంగ్రెసు లేక దానికి అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలే. నాలుగుచోట్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. ఎక్కడి పోలీసులు అక్కడి సాక్ష్యాధారాలనుబట్టి ప్రొఫెషనల్‌గా దర్యాప్తు చేస్తూపోతే చివరికి అందరికీ దోషులుగా కనపడ్డది పాకిస్తాన్‌ ప్రేరిత ఇస్లామిక్‌ టెర్రరిస్టు ముఠాలే. ఆ ప్రకారమే కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. చిల్లులమయమైన మన న్యాయ విధానాలను తెలివిగా వాడుకుని దోషులు తప్పించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, పోలీసు విభాగాలూ తమ వంతు కృషిని దీక్షగా కొనసాగించడమే తరువాయి అని అందరూ భావించారు.

అదిగో.. ఆ సమయాన దేశాన్నేలే కాంగ్రెసు దుష్ట గ్రహాలకు నీచమైన దుర్బుద్ధి పుట్టింది. మాలెగావ్‌, సమ్‌ఝౌతా, మక్కామసీదు, అజ్మీరు షరీఫ్‌ పేలుళ్ళు నాలుగింటిలోనూ మృతులు దాదాపుగా అందరూ మహమ్మదీయులు. వీటిలో మూడు పేలుళ్ళు ముస్లింలకు పవిత్ర ప్రార్థనా స్థలాల వద్ద సంభవించాయి. అది కూడా ముస్లింలు కిక్కిరిసి ఉన్న సమయాన!

పి చిదంబరం

ముస్లింలమీద గురిపెట్టినవి కాబట్టి వీటిని హిందువుల ఖాతాలో వేస్తే పోలా? దానివల్ల ఆర్‌.ఎస్‌.ఎస్‌., దాని అనుబంధ సంస్థల మీద కక్ష తీర్చుకున్నట్లూ అవుతుంది. హిందూ ప్రముఖుల్లో ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించి ఏళ్ళతరబడి తిప్పలు పెట్టటానికీ వీలవుతుంది. హిందూ టెరర్రిజం బూచిని చూపిస్తూ తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, పక్కలో బల్లెమూ అయిన భారతీయ జనతాపార్టీని ఆ వంకన అప్రతిష్టపాలు చేయటమూ తేలిక అవుతుంది.

ఇదీ కాంగ్రెస్‌ ‘మాతేటా’లకు, వారి చేతుల్లోని కేంద్ర సర్కారులో కీలకస్థానాల్లోని వారి నౌకర్లకు కలిగిన దురాలోచన. నాలుగు పేలుళ్ళు ముస్లింలపై గురిపెట్టినప్పటికీ, వాటికి పాల్పడింది లష్కరేతోయిబా, హుజి, సిమి, జైషే మొహమ్మద్‌ వంటి ఇస్లామిక్‌ ఉగ్రవాద ముఠాలేనన్న సత్యాన్ని యావత్ప్రపంచం నిర్ద్వంద్వంగా గ్రహిస్తేనేమి ? దావూద్‌ ఇబ్రహీం డబ్బిచ్చి పోషిస్తున్న కస్మానీ ఆరిఫ్‌ అనే లష్కరే కమాండరు ఆల్‌ఖైదా వెన్నుదన్నుతో సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబింగుకు పాల్పడినట్టు సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి చెందిన కమిటీ 2009 జూన్‌ 6న అధికారికంగా తీర్మానం చేస్తేనేమి? సమ్‌ఝౌతా పేలుడులో ఇస్లామిక్‌ టెర్రరిస్టుల ఏజెంట్‌ హెడ్లీకి ప్రమేయం ఉన్నట్టు అమెరికన్‌ భద్రతా సంస్థలకు కచ్చితమైన సమాచారం లభిస్తేనేమి? సోనియమ్మ దొరతనానికి కావలసింది సత్యం కాదు; సాక్ష్యం కాదు; అడ్డగోలుగా అయినాసరే హిందూ ప్రజానీకం మీద, హిందూ సంస్థల మీద, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మీద టన్నుల కొద్దీ దుష్ప్రచారపు బురదను కుమ్మరించటం !?

సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌

ఇంకేం? ఉచ్చనీచాలు గాలికొదిలి, విద్యుక్త బాధ్యతను తుంగలో తొక్కి బరితెగించారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వ ట్రెజరీ డిపార్టుమెంటు, ఇంకా ఇతర అంతర్జాతీయ ఏజన్సీల నుంచి కస్మాన్‌ ముఠా ఇన్వాల్వ్‌మెంటు గురించి లభించిన నిర్దిష్ట ఆధారాలను కొనగోట కొట్టిపారేసి, ‘హిందూ టెర్రర్‌’ను ముగ్గులోకి దింపటం ఎలాగన్న దానిమీద తప్పుడు తెలివితేటలన్నీ ప్రయోగించారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ల చేతులు కట్టేసి, నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ), సిబిఐ లాంటి కేంద్ర సంస్థలను స్పెషల్‌ డ్యూటీమీద రంగంలో దించి, మొత్తం దర్యాప్తును నానా కంగాళీ చేశారు. కళ్ళెదుట కొట్టొచ్చినట్టు కానవస్తున్న ఇస్లామిక్‌ టెర్రరిస్టు ముష్కరులను వదిలేసి లెఫ్టినెంట్‌ కర్నల్‌ పురోహిత్‌, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌, స్వామి అసీమానంద, దేవేంద్ర గుప్తా తదితర నిర్దోషులను పాపిష్టి పథకం ప్రకారం కేసులో ఇరికించి యమయాతనలు పెట్టారు.

అదీ ఎంత దుర్మార్గంగా? ఆర్మీ అధికారి కర్నల్‌ పురోహిత్‌ మిలిటరీ ఇంటలిజెన్స్‌ అధికారిగా తన విధి నిర్వహణలో భాగంగా ‘అభినవ్‌ భారత్‌’ అనే హిందూ తీవ్రవాద సంస్థ గురించి సుధాకర్‌ చతుర్వేది అనే వాడి ద్వారా లోగుట్టును రాబట్టి ఆయా సమాచారాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు రిపోర్టు చేస్తూ వచ్చాడు. ఆ సంగతి తెలిసీ, హిందూ టెర్రరిజాన్ని సృష్టించాలని పాపిష్టి ఆలోచన వచ్చాక, ఆ సైన్యాధికారే ‘అభినవ్‌ భారత్‌’ అన్న టెర్రరిస్టు సంస్థను నడిపిస్తున్నట్టు, సుధాకర్‌ చతుర్వేది అనేవాడు అతడికి తోడుదొంగ అయినట్టూ తప్పుడు కేసులు బనాయించారు. మాలెగావ్‌ పేలుళ్ళకు సూత్రధారీ ఆ సైన్యాధికారే; సమ్‌ఝౌతా పేలుడుకు ఆర్డీఎక్స్‌ను సప్లయి చేసిందీ అతడే అంటూ కట్టుకథ అల్లి,

ఆర్మీ అధికారి కర్నల్‌ పురోహిత్‌

దారుణమైన శీలహననం చేసి 8 సంవత్సరాల పది నెలలపాటు నిష్కారణంగా జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు. అలాగే సన్యాసం స్వీకరించటానికి ముందు ఎవరికో ఎప్పుడో అమ్మివేసిన స్కూటరు మాలెగావ్‌ బాంబు పేలుడుకు వాడుకోబడిందన్న సాకుతో సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను 2008లో మాలెగావ్‌లో జరిగిన వరస పేలుళ్ళ కేసులో ఇరికించి తొమ్మిదేళ్ళపాటు జైళ్ళలో పెట్టి అమానుషమైన హింసకు, దారుణ అవమానాలకు గురిచేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను కనీస వైద్య సహాయాన్ని కూడా పొందనివ్వకుండా, కన్న తండ్రి మరణించినా కడపటి చూపుకు నోచుకోనివ్వకుండా పిశాచాల్లా పీడించారు. వనవాసీ కల్యాణ్‌ ఆశ్రమ్‌ బాధ్యతలు నిర్వహించిన స్వామి అసీమానందను నిష్కారణంగా పట్టుకుని, చిత్రహింసలు పెట్టి మక్కామసీదు, సమ్‌ఝౌతా, అజ్మీర్‌ దర్గా పేలుళ్ళన్నీ మా పనే, ఫలానా ఫలానా వాళ్ళు వాటి వెనుక ఉన్నారు, ఇదంతా ఆరెస్సెస్‌ కుట్రలో భాగమే; (అప్పటి సర్‌కార్యవాహ) మోహన్‌భాగవత్‌ చెయ్యమంటేనే ఇవన్నీ చేశాం అంటూ- బలవంతంగా స్టేట్‌మెంట్‌ రాబట్టి దానిని మీడియాకు పొక్కించి, నానాయాగీ చేశారు. అసీనామానంద నుంచి బలవంతంగా లాక్కున్న (తరువాత అతడే తిరస్కరించిన) తలా తోకాలేని వాఙ్మూలం ఆధారంగా బూటకపు కేసులు పెట్టించి, పైశాచిక ఆనందం పొందారు.

చివరికి ఏమి సాధించారు? ఎన్ని అభాండాలు వేసినా 2014 ఎన్నికల్లో భాజపా జైత్రయాత్రను నిలువరించలేక హిందుత్వ రథ చక్రాల కింద నలిగి ఇటాలియన్‌ మాతా సుతుల ప్రాభవం నజ్జునజ్జు అయింది. ‘కాషాయ ఉగ్రవాదం’ పై ఒంటికాలిమీద లేచి విషం కక్కిన షిండేలూ, చిదంబరాలు చెత్తకుండీలో పడ్డారు. అబద్ధాల అల్లికతో పెట్టిన తప్పుడు కేసులు న్యాయ పరీక్షకు నిలబడలేక ఒకటొకటిగా వీగిపోయాయి. మక్కామసీదు పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మొత్తం 11 మంది ముద్దాయిలనూ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైదరాబాద్‌ న్యాయస్థానం ఏప్రిల్‌ 16న తీర్పు ఇవ్వటంతో పదకొండేళ్ళ కాంగ్రెసు కుటిల నాటకానికి తెరపడింది. హిందూ సంస్థల మీద, హిందూ ప్రముఖుల మీద పెసరంత సాక్ష్యం లేకుండా యు.పి.ఎ. బానిస ప్రభుత్వం వేసిన ‘హిందూ ఉగ్రవాదం’ ముద్ర ఎటువంటి పాపిష్టి పన్నాగమో లోకానికి అసందిగ్ధంగా వెల్లడైంది.

దేవేంద్ర గుప్తా

వెనుకటి పాలక వర్గానికి లజ్జ, అభిమానం వంటివి ఏ కోశాన ఉన్నా హిందూ టెర్రర్‌ కపట నాటకం బండారం బయటపడినందుకు సిగ్గుతో చితికిపోవాలి. హిందూ సంస్థల మీద నిరాధారంగా నీలాపనింద వేసినందుకు బహిరంగ క్షమాపణ కోరాలి. మళ్ళీ ఇలాంటి వెధవ పనులు చేయం అని ప్రజల ముందు లెంపలేసుకోవాలి.

కాని, అబద్ధం ముందు పుట్టి కాంగ్రెసు నాయకులు తరువాత పుట్టారు. అమాయకులను, నిరపరాధులను, గౌరవనీయ వ్యక్తులను, సంస్థలను మానసిక క్షోభకు, దుర్భర వేదనకు గురిచేసిన ఘోర తప్పిదానికి పశ్చాత్తాప పడకపోగా వాళ్లు మళ్ళీ అడ్డం తిరిగి ‘హిందూ ఉగ్రవాదం’ గురించి మేమెప్పుడు మాట్లాడాం? అలాంటిదొకటి ఉన్నదన్న సంగతే మాకు తెలీదు. అయినా ఉగ్రవాదానికి మతమేమిటి మీ పిచ్చిగానీ’ అంటూ అడ్డం తిరిగి కొత్త బొంకులను లంకించుకున్నారు.

‘బిజెపి, ఆరెస్సెస్సులు టెర్రరిజాన్ని వ్యాప్తి చెయ్యటానికి టెర్రర్‌ ట్రెయినింగ్‌ క్యాంపులు నడుపుతున్నాయి. సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌, మక్కామసీదు, మాలెగావ్‌ పేలుళ్ళు ‘కాషాయ టెర్రరిజమే’ అని జైపూర్‌ ఎఐసిసి వేదికపై కేంద్ర హోంమంత్రి హోదాలో సుశీల్‌కుమార్‌ షిండే చేసిన బహిరంగ ప్రకటన ఇవాళ కాంగ్రెసు అబద్ధాల కోర్లు కాదు పొమ్మనగానే చరిత్ర నుంచి చెరిగిపోతుందా? షిండేకి ముందు కేంద్ర హోంమంత్రిగిరీని వెలగబెట్టిన చిదంబరం 2010 ఆగష్టులో రాష్ట్రాల పోలీసు శాఖాధిపతుల భేటీలో ‘కాషాయ టెర్రరిజం’ గురించి హెచ్చరిక చెయ్యలేదా? ఇస్లామిక్‌ టెర్రరిజం కంటే హిందూ టెర్రరిజమే ఎక్కువ ప్రమాదకారి అని కాంగ్రెసు కులదీపకుడు రాహుల్‌గాంధి 2010 డిసెంబరులో అమెరికా రాయబారితో అన్నట్టు వికీలీక్స్‌ బయటపెట్టలేదా ? 2008 నవంబర్‌ 26న జరిగిన ముంబాయి పేలుళ్ళు కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రేనా? అని ప్రశ్నించిన పుస్తకాన్ని కాంగ్రెసు మల్లుడు దిగ్విజయ్‌సింగ్‌ చేతులారా ఆవిష్కరించలేదా?

రికార్డుల్లో ఇన్ని రుజువులు ఉన్నప్పటికీ ‘కాషాయ టెర్రరిజం’ పదం మేమెప్పుడు వాడామని రాహుల్‌గాంధీ, అతడి భజంత్రీలు అడ్డంగా వాదిస్తున్నారంటే వారిది నాలుకా? తాటిమట్టా? ‘పబ్లిక్‌ మెమరీ’ ఎంత ‘షార్టు’ అయినా ఏడెనిమిదేళ్ళ కింద వీళ్ళు కూసిన కారు కూతలు కూడా జనానికి గుర్తుండవా ?

స్వామి అసీమానంద

కాంగ్రెసుకు బిజెపి రాజకీయ శత్రువు కావచ్చు. ఆ శత్రువుకు పెద్ద అండగా ఉన్నందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ మీద కాంగీయులకు ఎంత అక్కసయినా ఉండవచ్చు. వాటిని దెబ్బతీయాలన్న దుగ్ధతో నిష్కారణంగా, నిరాధారంగా ఆ జాతీయ సంస్థల మీద టెర్రరిస్టు పచ్చబొట్టు పొడిస్తే దానివల్ల జాతికి ఎంత అనర్థమో అమ్మా కొడుకులు, వారి బంట్లు ఆలోచించారా? ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని, దాన్ని ఎగదోయటంలో పాకిస్తాన్‌ లాంటి దేశాల పాపాల గురించి ప్రపంచమంతా చీదరిస్తున్న సమయంలో టెర్రరిస్టు దురాగతాల్లో హిందువులు, హిందూసంస్థలూ తీసిపోలేదని భారత ప్రభుత్వాన్ని నడిపించేవారే గోలపెడితే, పాకిస్తాన్‌కి పండుగే కదా? అప్పటికీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడిపిస్తున్న బిజెపి, దేశవ్యాప్తంగా విస్తరించిన ఆరెస్సెస్‌లు కూడా టెర్రరిస్టు క్యాంపులు నడుపుతూ బాంబులను పేల్పించి, అమాయకుల ప్రాణాలను బలిగొంటూంటే ఇండియా కూడా టెర్రరిస్టు రాజ్యం అయినట్టే కదా ? ఇంక పాకిస్తాన్‌ని టెర్రరిస్టు రాజ్యం అనే నైతిక హక్కు మనకు ఎక్కడుంటుంది? ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటు కూడా బుర్రకెక్కని పాపాత్ములు పదేళ్ళపాటు మన దేశాన్ని ఏలారు!

మాలెగావ్‌ మసీదువద్ద మొదటి బాంబు పేలినప్పుడే వాటి పాలకుల మేలుకుని, దిక్కుమాలిన రాజకీయం చెయ్యకుండా పోలీసులను తిన్నగా పనిచేయనిచ్చి ఉంటే ఎల్‌.ఇ.టి., సిమి లాంటి ఏజెన్సీల ఘాతుకాన్ని బోనులో నిలబెట్టి పాకిస్తాన్‌ భరతం పట్టటం వీలయ్యేది. నాటి నుంచి మాలెగావ్‌లో మలివిడత పేలుళ్ళ దాకా దేశంలో వరసగా జరిగిన బాంబింగులో పాకిస్తాన్‌, దాని తైనాతీల ప్రమేయాన్ని తిరుగులేని సాక్ష్యాలతో ఇంటర్‌ పోల్‌ సహకారంతో దర్యాప్తులో బట్టబయలు చేయనిచ్చి ఉంటే ఇస్లామాబాద్‌ కొంతలో కొంత దూకుడు తగ్గించేది. అసలైన జాతి శత్రువులను వదిలేసి, ప్రజాభద్రతను మంటగలిపి, ‘హిందూ టెర్రరిజం’ అనే బూచితో దోబూచులాడే పనికి మాలిన పనికి ఎన్‌.ఐ.ఎ., సి.బి.ఐ., ఐ.బి. వంటి కేంద్ర పత్తేదారులను నిమగ్నం చేసి, వాటి విలువైన శక్తినీ, వనరులనూ దుర్వినియోగం చేయటంతో విదేశీ విరోధులకు, దేశద్రోహులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కరాచీ నుంచి పడవల్లో కసబ్‌ ముఠా దర్జాగా ముంబాయి వచ్చి రోజుల తరబడి ఆ మహానగరాన్ని చెరబట్టి, వందల ప్రాణాలు తీస్తూంటే సకాలంలో అడ్డగించలేని నిర్లిప్తత, నిస్సహాయత మన భద్రతా యంత్రాంగాన్ని ఆవహించింది.

ఆ రకంగా నీచ, నికృష్ట రాజకీయ స్వార్థం కోసం జాతి భద్రతను గాలికొదిలి, భద్రతా వ్యవస్థను చచ్చుపడవేసిన మహాపాపంలో రెండో ముద్దాయి, ముద్దాయిలు నాటి యు.పి.ఎ. దొరతనం! మొదటి ముద్దాయి దాన్ని కీలుబొమ్మలా ఆడించిన కాంగ్రెసు మాతాపుత్రుల ధూర్త నాయకత్వం!! చేయని నేరానికి ఏళ్ళతరబడి చెరసాలపాలై, శారీరకంగా, మానసికంగా చిత్రహింస అనుభవించి ఆరోగ్యం పాడై, నిష్కారణంగా అప్రతిష్ట పాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌, కర్నల్‌ పురోహిత్‌, స్వామి అసీమానంద, దేవేంద్ర గుప్తా వంటి వారెందరో అనుభవించిన భయానక నరకయాతనకు వీరిదే జవాబుదారీ! ప్రజలను రక్షించటం, నేరగాళ్ళను శిక్షించటం, ధర్మాన్ని నిలబెట్టటం అనే ప్రాథమిక బాధ్యతలో ఘోరంగా విఫలమై, కుట్రలూ కుతంత్రాలలోకి దేశాన్ని వినాశపుటంచులకు తీసుకొని వెళ్ళిన ఈ దురాత్ముల నీచ నిర్వాకాలను జాతి మరవటం, క్షమించటం కలలో మాట!

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)