Home Telugu Articles “ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, కాపాడడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి” – ప్రియవ్రత పాటిల్

“ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, కాపాడడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి” – ప్రియవ్రత పాటిల్

0
SHARE

ఆధునిక విద్యకే ప్రాధాన్యత, అవకాశం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వేద విద్యను అభ్యసించడానికి ఎంతో పట్టుదల, విశ్వాసం ఉండాలి. అటువంటి పట్టుదలనే చూపాడు గోవాకు చెందిన ప్రియవ్రత పాటిల్. 16 ఏళ్ల చిన్న వయస్సులోనే తెనాలి మహాపరీక్షలో ఉత్తీర్ణుడై ప్రధానమంత్రితో సహా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కనీసం 5,6 సంవత్సరాలు పట్టే ఈ పరీక్షను కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

భారతీయ సంస్కృతి బహుముఖమైనది. కాలానుసారంగా ప్రభావవంతమైన వ్యక్తులు వస్తూవుంటారు. మౌలిక, ప్రాధమిక గ్రంధాలైన మన వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా వందలాదిమంది పండితులు ఈరోజుకూ ఆ సంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచుతున్నారు. మన సంప్రదాయ జ్ఞానానికి నిలయాలైన గురుకులాలు, గురుశిష్య పరంపర క్షీణిస్తున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ మన ప్రాచీన జ్ఞానాన్ని నేటికీ సజీవంగా ఉంచే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో ఒకడు గోవాకు చెందిన ఈ 16 ఏళ్ళ యువకుడు ‘ప్రియవ్రత పాటిల్’.

చాలా మంది కౌమారంలో  వినోదంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు కానీ ప్రియవ్రత ఎన్నో రాత్రులు కష్టపడి అత్యంత కఠినమైన శాస్త్రాలపై ‘తెనాలి పరీక్ష’ లో చాలా చిన్న వయస్సులో ఉత్తీర్ణుడైనాడు.

తెనాలి పరీక్షకి మహాపరీక్ష అని కూడా పేరు. కంచి మఠం వారి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఈ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు ‘న్యాయ,మీమాంస,వ్యాకరణ,అద్వైత, వేద భాష్య కంచి వేద వేదాంత శాస్త్ర సభ’ వారిచే నిర్వహించ బడుతుంది.

ప్రియవ్రత అన్ని వ్యాకరణ మహాగ్రంధాల పై పరీక్ష రాశాడు, ఇది రెండు రకాలుగా ఉంటుంది. వ్రాత, మౌఖిక పరీక్షలు.

తెనాలి మహాపరీక్ష లో 14 స్థాయిలు ఉంటాయి. 5,6 సంవత్సరాల కృషి తరువాతనే ఈ పరీక్షకి సిద్దం అవుతారు. కానీ ప్రియవ్రత కేవలం 2 సంవత్సరాలలోనే విజయవంతంగా పూర్తి చేశాడు. సెప్టెంబర్ 6 న తెనాలిలో అతను  ఈ పరీక్ష పూర్తిచేశాడు.

ఈ అద్భుత విజయాన్ని గుర్తించి స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీ అతనికి శుభాకాంక్షలు చెప్పారు.

ప్రియవ్రత మీడియా తో మాట్లాడుతూ ప్రధాని మోడి గారి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా, స్పూర్తిదాయకంగా ఉందని అన్నాడు. భారతీయ ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించడం తన కర్తవ్యమని తండ్రి గారు చెప్పారని కూడా అన్నాడు.

తల్లి అపర్ణా పాటిల్ తన కుమారుడి విజయనికి ప్రధానమంత్రి మోడి నుంచి ప్రశంసలు రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.

ప్రియవ్రత ఈ పరీక్షకు స్పూర్తినిచ్చిన , తయారు అయిన విధానం గురించి ఇలా వివరించారు:

  • ఇంత చిన్న వయస్సులో ‘తెనాలి పరీక్ష’కోసం చదవడానికి ఎవరు స్ఫూర్తిని ఇచ్చారు ?

ప్రియవ్రత : నా తల్లిదండ్రులు,గురువులు నాకు స్ఫూర్తిని ఇచ్చి మార్గదర్శనం చేశారు. అది నాకు చివరివరకు ఉపయోగ పడింది. చిన్నవయస్సు నుంచే నాకు శాస్త్రాలపై ఆసక్తి ఉంది. మనం మన శాస్త్రాలను, వేదాలను చదవాలని,  ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని కాపాడుకోవాలని మా నాన్న ఎప్పుడూ చెపుతుండేవారు. ఆయన ప్రేరణ, మా గురువులు మోహన్ శివనారాయన్ శర్మ గారి మార్గదర్శనం వల్ల నేను 14 అంచెల పరీక్షలు రెండు సంవత్సరాలలో పూర్తిచేయగలిగాను.

  • నీవు మహాపరీక్ష ఎలా సిద్దం అయ్యావు ? నీ దినచర్య ఎలా ఉండేది?

ప్రియవ్రత : నేను గత చాలా సంవత్సరాలుగా 14 – 16 గంటలు చదివేవాడిని. ఉ|| 5 గం||కు రోజు ప్రారంభం అయితే రా|| 11 గం||కు పూర్తి అయ్యేది. స్నానాలు, ఆహారం, సంధ్యావందనం వీటికి మాత్రమే విరామం తీసుకునేవాడిని మిగతా సమయమంతా మహాపరీక్షకి తయారు అయ్యేవాడిని. తయారీ విషయంలో నా గురువు, తల్లిదండ్రులు చాలా సహాయం చేశారు.

  • నీవు మునుముందు ఏమి చెయ్యాలనుకుంటున్నావు ?

ప్రియవ్రత : నేను శాస్త్ర అధ్యయనం కొనసాగిస్తాను, మా తండ్రిగారి లాగా గురుకులాలలో నేర్పిస్తాను. ప్రధానమంత్రి గారి ట్వీట్ నాకు ఇంకా ముందుకు వెళ్లాలని స్ఫూర్తిని ఇచ్చింది, అందరూ ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని నేర్చుకొని సంరక్షించాలి.

ప్రియవ్రత తల్లి శ్రీమతి అపర్ణా పాటిల్ చెప్పిన విషయాలు:

  • ఆధునిక విద్యకే ఎక్కువ అవకాశం ఉన్న ఈరోజుల్లో, మీ కుమారుడిని గురుకులాలలో వేద విద్య నేర్పించడానికి స్పూర్తినిచ్చిన విషయం ?

శ్రీమతి అపర్ణా పాటిల్ : తన తండ్రి సఫలమైన సంస్కృత పండితుడు, నేను కూడా సంస్కృతం లో PHD చేశాను. తల్లిదండ్రులుగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మాకు అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా సాధారణమైన చదువు కాకుండా వాళ్ళకి వేద విజ్ఞానం నేర్పాలని. శాస్త్రాలు మన సంప్రదాయ ఆస్తులు. వాటిని మనం కాకపోతే ఇంకెవరూ నేర్చుకొని కాపాడతారు?

అది మనమే చెయ్యాల్సిన పని. విదేశీయులు వాటిని కాపాడుతారని మనం ఆశించలేము కదా. ఈ విషయం మనసులో పెట్టుకొని ప్రియవ్రతను సంస్కృత విద్యను నేర్చుకోమని ప్రోత్సహించాము. అతను చిన్నవయస్సు నుంచే వేదాలు నేర్చుకుంటున్నాడు. మేము చెప్పకుండానే అతనికి స్వయంగానే శాస్త్రాలపట్ల ఆసక్తి కలిగింది. అతని గురువు మోహన్ శర్మ ఇంకా చదవమని ప్రోత్సహించారు.  అదే అతను శ్రద్ధగా చేశాడు. అతనికి ఎంత ఆసక్తి కలిగిందంటే 6 సం|| లలో పూర్తి చెయ్యాల్సింది 2 సం|| లకే పూర్తి చేసేశాడు.

  • ·         తరువాత అతను ఏం చేస్తాడు?

శ్రీమతి అపర్ణా పాటిల్ : గోవా లో మా గురుకులంలో విద్యార్ధులు చిన్నవయసు నుండి పెద్ద వాళ్ళు వరకు ఉన్నారు. ఆడపిల్లలు, మొగపిల్లలు మా గురుకులంలో వేద విద్య నేర్చుకుంటున్నారు. ప్రియవ్రత గురువు మోహన్ శర్మ ఉజ్జయిని కి చెందినవారు.  MA పూర్తి చేశారు,  వేరే విశ్వవిద్యాలయాలో చదువు చెప్తే చాలా బాగా సంపాదించి ఉండేవారు. కానీ వారు మాతోనే ఉన్నారు. తనకు విద్య నేర్పిన గురుకులాలలో  బోధించడం తన కర్తవ్యం అని చెప్పారు. ఇలానే రానున్న తరాలు ఆలోచిస్తే గురుకులాలు నిలబడతాయి, వృద్ది చెందుతాయి.

సంస్కృతం మనందరి వారసత్వం. దానిని కాపాడడం మన బాద్యత. ఎలాగైతే రామాయణం, మహాభారతం ఒక సమూహానికో, రాష్ట్రానికో చెందినవి కావో,  మొత్తం దేశానికి చెందినవో  అలాగే సంస్కృతం కూడా అందరికీ చెందినది. దేశ సమగ్రతకు సంస్కృతం ముఖ్యమైన సాధనం. ప్రియవ్రత ఈ మార్గాన్ని కొనసాగిస్తాడు. శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు. అతను  రానున్న కాలంలో పరిశోదన లో భాగస్వామి అవుతాడు. మా గురుకులంలో కూడా విద్య నేర్పిస్తాడు.

ఆర్గనైజర్ సౌజన్యంతో….