Home News కొరేగావ్ యుద్ధం నేర్పే పాఠాలు

కొరేగావ్ యుద్ధం నేర్పే పాఠాలు

0
SHARE

– @Dimple_Kaul &  @TrueIndology 

2018వ సంవత్సరం కుల పోరాటాలు, ఉద్రిక్తతలతో ప్రారంభం కావడం దురదృష్టకరం. వీటిని ప్రభుత్వం వెంటనే అదుపుచేసి ఉండకపోతే అవి ప్రజా యుద్దానికి దారితీసి ఉండేవి. `యువ’ నేతలు జిగ్నేశ్ మెవాని, రాహుల్ గాంధీ వంటివారు, కొంతవరకు మీడియా వర్గం కుల రాజకీయాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం మనం చూశాం.

రాహుల్ గాంధీ ట్వీట్ చూస్తే ఇది అర్ధమవుతుంది –

ప్రస్తుత భారత రాష్ట్రపతి హిందువు, దళిత వర్గానికి చెందినవారు. ఆయన పాలనా  వ్యవస్థకు అధిపతి కూడా. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రాష్ట్రపతి అయ్యారు. అయినా  ప్రధాని కావాలని కలలు కనే ఈ `యువ’ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

దీనంతటికంటే మించి `బ్రేకింగ్ వార్తల’ కోసం ఎల్లప్పుడు అర్రులుచాచే మన మీడియా అగ్నికి ఆజ్యం పోస్తూ మొత్తం సంఘటనను `దళిత’ `హిందువు’ ల మధ్య ఘర్షణగా చిత్రీకరించింది.

కొన్ని ప్రయోజనాలను ఆశించి స్వార్ధపర శక్తులు భారత సమాజంలోని అంతరాలు, తేడాలను మరింత పెద్దవిచేయడానికి, తద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో ఈ సందర్భంగా గమనించవచ్చును. చాలా సందర్భాలలో మీడియా ఈ కార్యకలాపాలలో ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఉంటుంది. అన్యాయాలు, అత్యాచారాలు జరిగిపోతున్నాయంటూ ప్రచారం చేస్తుంది. హిందుసమాజంలోని కొన్ని వర్గాలలో తమకు అన్యాయం జరిగిందని, తాము అణచివేతకు గురయ్యామనే భావన కలిగించడం ద్వారా సమాజంలో చీలికలు తేవడం ఈ శక్తుల ప్రయత్నం. లింగం, మత విశ్వాసాల ఆధారంగా కూడా విభేదాలు సృష్టిస్తుంటారు.

కొరేగావ్  బ్రిటిష్ వారికి, మరాఠాలకు  మధ్య జరిగిన యుద్ధాలలో ఒకటి. కానీ ఇప్పుడు హఠాత్తుగా అది వార్తల్లోకి వచ్చింది. చరిత్రలో అంతగా ప్రాధాన్యత లేని ఈ యుద్ధం ఇలా వార్తలకు ఎక్కడానికి కారణం ఏమిటి?  దళితులు, బ్రాహ్మణులపై చేసిన యుద్దం చరిత్రలో ఏదైనా ఉందా అని మీడియా చాలాకాలంగా వెతుకుతోంది. ఇప్పటివరకు వారికి అలాంటి యుద్దం ఏది కనిపించలేదు. కొరేగావ్ యుద్దం అలాంటిది కాకపోయినా అది  అలాంటి పోరాటమేనని చిత్రీకరించేందుకు, ఒక వర్గానికి(దళితులు) అన్యాయం జరిగిందని, మరొక వర్గం (బ్రాహ్మణులు) అందుకు కారణమని ప్రచారం చేసేందుకు అవకాశం మాత్రం లభించింది.

నిజానికి కొరేగావ్ `దళితులు’, `ఉన్నత కులాల’ వారికి మధ్య జరిగిన యుద్దం కాదు. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఈ యుద్దంలో గెలవనూ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా హిందూత్వం అసమానతలను ప్రోత్సహిస్తుందని చూపేందుకు  `దళిత’, `దళితేతర’ వర్గాల మధ్య వైరం ఉందని, ఒక వర్గం అణచివేతకు గురైంది, మరొకటి అణచివేసిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది.

`బ్రిటిష్ కాలంలో దళిత సైన్యం పీష్వాలను ఓడించిన భీం కొరేగావ్ యుద్దపు విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఉత్సవం జరుగుతుంది’ అని కొరేగావ్ లో జరిగే సమ్మేళనం గురించి రాస్తూ ఉంటారు. నిజానికి ఆ యుద్దం పీష్వాలు, బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. అంతేకాదు ఆ యుద్దంలో పీష్వాలు ఓడిపోలేదు. ఆ కాలానికి చెందిన చరిత్రకారుడు, సైనికుడు అయిన జేమ్స్ గ్రాంట్ డఫ్ అందించిన సమాచారం పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

 

డఫ్ సమాచారాన్ని పక్కన పెట్టి బ్రిటిష్ వాళ్ళే గెలిచారనుకున్నా అది బ్రిటిష్ విజయం కాకుండా దళిత విజయం ఎలా అవుతుంది? బ్రిటిష్ సైన్యంలో పోరాడిన మహర్ /దళిత సైనికుల్లో ఒక్కరైనా ఆ యుద్దంలో ప్రధాన పాత్ర పోషించారా? బ్రిటిష్ సైన్యంలోని ఒక్క దళిత లెఫ్టినెంట్ పేరైన చెప్పగలరా? లేదు.

బ్రిటిష్ వాళ్ళు దళితులకు ఎప్పుడు అలాంటి పదవులు, స్థానాలు ఇవ్వలేదు. ఒకవేళ బ్రిటిష్ సైన్యంలో దళితులు ఉన్నారు కాబట్టి అది దళితుల విజయమని అంటే అప్పుడు రెండు ప్రపంచ యుద్ధాల్లో విజయం భారతీయులదనే చెప్పాల్సిఉంటుంది.(ఎందుకంటే బ్రిటిష్ సైన్యంలో భారతీయులు ఉన్నారుకాబట్టి). కానీ అలాగని ఎవరు అనరు. ఇక తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు పై తర్కాన్నే మరింత పొడిగించి 1857 ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామంలో బ్రాహ్మణులపై దళితులు విజయం సాధించారని కూడా అనవచ్చును. ఎందుకంటే మంగల్ పాండే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, తాత్యతోపే, పీష్వా నానాసాహెబ్ మొదలైన బ్రాహ్మణులు నాయకత్వం వహించిన జాతీయ సైన్యాన్ని ముంబై మహార్, మఝబి దళిత సిక్కు రెజిమెంట్లు ఉన్న బ్రిటిష్ సైన్యం ఓడించింది. కానీ కల్పనకు కూడా ఒక హద్దు ఉండాలి కదా.

కనుక ఎలా చూసినా అది బ్రిటిష్ విజయం కానేకాదు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు వెనుకంజవేశారు. మొదట్లో సంవత్సరకాలం పాటు వాళ్ళు కూడా తాము విజయం సాధించామని చెప్పుకోలేదు. 1819లో బ్రిటిష్ పార్లమెంట్ లో కొరేగావ్ యుద్దపు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అది తమ విజయమని ప్రకటించుకోలేదు.

 “In the end, they secured not only unmolested retreat, they also carried off their wounded” 

(`చివరికి వాళ్ళు (బ్రిటిష్ సైన్యం) సురక్షితంగా వెనుకకు వచ్చారు. తమలో గాయపడినవారిని కూడా వెనుకకు తెచ్చారు.’)

విజయం మాట అటుంచి బ్రిటిష్ సైన్యం పూర్తిగా విఫలమైంది. 1818 జనవరి 1న పీష్వాకు చెందిన రాజధానిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ అధికారులు తమ సేనలను సెరూర్ నుండి పూనాకు తరలించాలనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ సేనాల్ని కొరేగావ్ దగ్గర మరాఠా సైన్యం అడ్డగించింది. అపారమైన మరాఠా సైన్యం ముందు బ్రిటిష్ సేనలు నిలువలేకపోయాయి. అయినా  బ్రిటిష్ సైనికులు, అలాగే భారతీయ సిపాయిలు (అందులో దళితులూ ఉన్నారు, దళితేతరులూ ఉన్నారు) ధైర్యంగా మరాఠా సేనల్ని ఎదుర్కొన్నారు. కానీ చాలా ప్రాణనష్టం చవిచూడాల్సి వచ్చింది. దానితో పూనాకు వెళ్లాలనుకున్న వ్యూహాన్ని కట్టిపెట్టిన బ్రిటిష్ సైన్యం తిరిగి సెరూర్ వైపుకు తోకముడిచింది.

ఇక కొరేగావ్ యుద్దంలో వీరోచితంగా పోరాడిన దళిత సైనికుల పట్ల బ్రిటిష్ వాళ్ళు చూపించిన `కృతజ్ఞత’ ఏమిటి? వాళ్ళు `వీరోచిత జాతి కాదు, నిమ్న అంటరాని కులం’ అంటూ 1892లో దళితులను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు.

అంతేకాదు చాలామటుకు గిరిజన, `అంటరాని కులాల’ వారిని `నేర జాతులు’గా బ్రిటిష్ ప్రభుత్వం ముద్ర వేసింది. వీరిలో `నేరప్రవృత్తి’ ఎక్కువని, వాళ్ళంతా నేరస్తులని ప్రకటించి ఆ జాతులపై అమానుషమైన ఆంక్షలు విధించింది. ఈ జాతులకు చెందిన పురుషులు ప్రతివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు వేయించుకోవాలని నిబంధన విధించింది. భారత్ ను పూర్తిగా ఆక్రమించుకున్న వెంటనే బ్రిటిష్ వాళ్ళు `అంటరానివారిని’ `పనికిమాలిన సైనికులు’గా ముద్రవేసి విధుల నుంచి తొలగించారని స్టీఫన్ కొహెన్ వ్రాశాడు. `ఉన్నత కులాలకు చెందిన అందమైన వారిని’ మాత్రమే సైన్యంలో చేర్చుకునేవారని వ్రాశాడు.

 “Why bother to recruit the “dhobi [an untouchable washerman caste battalions,” one series of articles in the Pioneer argued, if they could not be trusted against the formidable Pathans. Untouchables were docile creatures, perhaps suitable for internal guard duty or labor battalions, but otherwise useless as soldiers….. “largest, handsomest, and cleverest looking men were undoubtedly the high castes”. 

బ్రిటిష్ వాళ్ళు తమ `ఆర్య’ , `శౌర్య జాతుల’ సిద్దాంతం ప్రకారం దళిత మహర్ లను సైన్యంలో చేర్చుకోవడం నిలుపుచేయడంతో తాము క్షత్రియ జాతికి చెందినవారమేనని, తమను కూడా సైన్యంలో చేర్చుకోవాలని మహర్లు బ్రిటిష్ వారికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆనాటి బ్రిటిష్ సైన్యంలో ఉన్న మహర్ లు ఇప్పటి జిగ్నేశ్ మెవాని వంటివారు మాత్రం కాదు. మహర్ సైనికుడైన అంబేడ్కర్ తండ్రి ప్రఖర హిందువు. ఆయన రామాయణ, భారతాలు పారాయణ చేసేవాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేటి `దళిత యువ నేతలు’ బ్రిటిష్ వారిని, వారి విజయాలను పొగడుతున్నారు.

ఇటీవల `ది ప్రింట్’ లో ప్రచురితమైన రాహుల్ సోన్ పింపల్ రాసిన వ్యాసంలో పై వక్రీకరణాలన్నీ కనిపిస్తాయి. ఆ వ్యాసంలో ఇలా ఉంది – “(కొరేగావ్)యుధ్ధాన్ని గుర్తుపెట్టుకోవడం, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో స్మారక స్థూపాన్ని దర్శించుకోవడం మన దేశంలో ఉన్న కులవ్యవస్థ నియమాలకు విపరీతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యవస్థ దళితులకు ఇలా చురుకుగా, క్రియాశీలంగా ఉండే అవకాశం ఇవ్వదు.

మనుస్మృతి వంటి ప్రాచీన హిందూ గ్రంథాలు దళితులు లేదా శూద్రులు, అతి శూద్రులకు తమ వాదన వినిపించే హక్కు లేదని స్పష్టం చేస్తున్నాయి. కానీ కొరేగావ్ స్మారక దినోత్సవం ఈ కుల కట్టుబాటుకు వ్యతిరేకంగా సాగుతోంది.

హిందూ జాతీయవాదులలో దళితులంటే `అమాయకులు, ఏది చెప్పినా వినేవారు, కుల వ్యవస్థలోని అంతరాలను మౌనంగా సహించేవారు’ అంటూ ఉన్న అభిప్రాయాలను ఈ స్మారక దినం పటాపంచలు చేసింది. స్మారక దినాన్ని పాటించడం ద్వారా దళితులు ఈ అభిప్రాయాలు సరైనవి కావని తేల్చి చెప్పినట్లైంది. అంతేకాదు `మా చరిత్రలోని విజయాలను మేము గర్వంగా చెప్పుకుంటాం’ అని స్పష్టం చేసినట్లైంది.’ `హిందూ జాతీయవాదానికి సరిపోదు కాబట్టి మా చరిత్రను వక్రీకరించారు. మాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మా సమాంతర చరిత్రలను కాదన్నారు.’

ఇదంతా దళితులకు అన్యాయం జరిగిపోయిందని, వాళ్ళు అణచివేతకు గురయ్యారని చేసే ప్రచారంలో భాగమే. ఈ ప్రచారంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే గతంలో జరిగిన సంఘటన, విషయాన్ని వర్తమానానికి వర్తింపచేయడం. పైన పేర్కొన్న వ్యాసంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. 19వ శతాబ్దంలో జరిగిన యుద్ధాన్ని, అందులో బ్రిటిష్ వారి `కల్పిత’ విజయాన్ని దళిత పోరాటం, దళిత విజయంగా ఇప్పుడు చిత్రీకరించే ప్రయత్నం కనిపిస్తుంది. అంతేకాదు, దళితులు ఆయుధాలు పట్టుకునేందుకు, తమను తాము రక్షించుకునేందుకు హిందూ సమాజం వారిని అడ్డుకుందని వ్యాసంలో రాశారు. కానీ కాస్త చరిత్రను పరిశీలిస్తే ఈ వాదనలో పస లేదని స్పష్టమవుతుంది. మహర్ లలో ఒక వర్గమైన సోమవంశీ మహర్ లు మహాభారత యుద్ధంలో పాండవుల వైపు పోరాడారు.

ఇలా దళితులను ఆయుధాలు పట్టుకోనివ్వలేదనే వాదనే సరైనదైతే మహాభారత యుద్ధంలో మహర్ లు ఎలా పాల్గొన్నారు?

పోనీ ఇతిహాసాన్ని కూడా కట్టుకధ అని కొట్టిపారేసినా, శివాజీ మహారాజ్ సైన్యంలో మహర్ లు ఉన్నారన్నది ఎవరు కాదనలేని సత్యం. శివాజీ కుమారుడు రాజారం శివంక్ మహర్ కు కాలాంబి అనే గ్రామాన్ని దానం చేశాడన్నది నిజం. అలాగే శివంక్ మహర్ మనవడైన మరో శివంక్ మహర్ 1795 నిజాంతో పోరాటంలో పురేశ్వరం భాను ప్రాణాలను కాపాడాడు. ఆ సమయంలోనే కొద్దిమంది మరాఠా శిబిరంలో శివంక్ మహర్ ఎలా ఉంటాడని ప్రశ్న లేవనెత్తినప్పుడు పీష్వా దగ్గర ఉన్న బ్రాహ్మణ మంత్రి హీరోజీ పతంకర్ యుద్దంలో కుల పట్టింపులు ఉండకూడదని వారికి సమాధానం చెప్పాడు. నాగనక్ మహర్ ముస్లిముల నుండి విరాట్ గఢ్ ను స్వాధీనం చేసుకుని రాజారాం కు అప్పగించాడు. అప్పుడు నాగనక్ మహర్ ను రాజారాం సతారా పాలకుడు  (పాటిల్)గా  చేశాడు.

ఈ విషయాలన్నీ బయటకు వస్తే ఉద్రిక్తతలను రెచ్చగొట్టి అల్లర్లు చేయించాలనుకునేవారి ప్రయత్నాలు సాగవు. ఈ విషయాలను ఎవరు ఇప్పటివరకు కాదనలేదు.

విదేశీ సైన్యం ఇక్కడి వారిపై విజయం సాధిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. అంతేకాని ఆ `విజయాన్ని’ గొప్పగా చెప్పుకోరు. అంతేకాదు బ్రిటిష్ సైన్యంలో కేవలం మహర్ లు మాత్రమే లేరు. ఇతరులు కూడా ఉన్నారు. అలాగే మేజర్ దిరోమ్ పేర్కొన్నట్లుగా మరాఠా సైన్యంలో నిమ్న కులాల వారు కూడా ఉన్నారు. కాబట్టి రెండువైపులా చనిపోయిన భారతీయులలో  అన్ని వర్గాలకూ  చెందినవారు. బ్రిటిష్ సైన్యంలో ఉన్న మహర్ లు మరాఠా సైన్యంలో ఉన్న మహర్ లతో పోరాడారన్నది కూడా నిజం.

కాబట్టి కోరేగావ్ యుద్దం మహర్ లు, పీష్వాల మధ్య జరిగినది కాదు. అది బ్రిటిష్ వారికి, భారతీయులకు మధ్య జరిగినది. రెండువైపులా మహర్ లు చనిపోయారు. కానీ విచిత్రంగా బ్రిటిష్ సైన్యంలోని మహర్ లే నిజమైన దళితులనే విధంగా వాదన సాగుతోంది. శివంక్ మహర్ గురించి వీరెవరైనా చెప్పగా ఎప్పుడైనా విన్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళు భారత్ లో సాగించదలచుకున్న కుల యుద్దలకు ఆ యదార్ధ గాధ పూర్తి వ్యతిరేకం కనుక.

మహర్ లు బ్రిటిష్ సైన్యంలో ఎలా చేరారు? వారిని చేర్చుకునేందుకు బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకమైన శిబిరాలు, శిక్షణా కేంద్రాలు ఏవి ఏర్పాటుచేయలేదు. మరాఠా సైన్యంలో మాత్రం చాలాకాలంగా మహర్ లు పనిచేస్తున్నారు. పీష్వాలు పెద్ద సంఖ్యలో వారిని సైన్యంలో చేర్చుకున్నారు. ఇలా యుద్ద అనుభవం సంపాదించిన మహర్ లు ఆ తరువాత తమంతతాముగా బ్రిటిష్ సైన్యంలో చేరారు. (Christophe Jaffrelot,  Dr Ambedkar and Untouchability: Analysing and Fighting Caste p.19)

మహర్ లకు పీష్వాలకు మధ్య సత్సంబంధాలు ఉండేవి. క్రీ.శ. 1770లో పాలించిన పీష్వా మాధవరావు నిమ్న కులాలు/తరగతుల వారిని నిర్బంధంగా పనిచేయించడాన్ని(వెత్) నిషేధించాడు. ప్రతి పనికి తప్పనిసరిగా వేతనం ఇవ్వాల్సిందేనని చెప్పాడు.( GS Sardesai, New History of the Marathas: The expansion of the Maratha power, 1707-1772 p.346). ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసవిధానాన్ని నిషేధించడానికి 50 ఏళ్ల ముందే పీష్వాలు ఈ వెట్టిచాకిరి (వెత్)ని నిషేధించారు.

మాధవరావ్ జన్మించినప్పుడు పీష్వా బాలాజీ రావ్ `నిమ్న కులాలైన’ కోలి, రామోసిస్, మహర్ లకు 300 హెక్టార్ ల పన్ను లేని భూమిని  దానం చేశాడు. ఈ మహర్ లు, ఇతర కులాల వారి కింద గిరిజనులు కాపలాదారులుగా పనిచేసేవారు. (Kotani, CASTE SYSTEM, UNTOUCH ABILITY AND THE DEPRESSED p.70). ఇలా వెట్టిచాకిరిని రద్దుచేసినది కేవలం మాధవరావ్ మాత్రమే కాదు. అంతకు ముందు శివాజీ కాలంలో బ్రాహ్మణ సైనికాధికారి మహదాజీ నీలకాంతరావ్ ఇద్దరు మహర్ లను పురందర కోట పాలకులు (నాయక్ వతన్)గా నియమించాడు. ప్రతి మహర్ కింద 40మంది సైనికులు ఉండేవారు(Kotani, CASTE SYSTEM, UNTOUCH ABILITY AND THE DEPRESSED),

మహర్ లు, పీష్వాల మధ్య సామాజిక సంబంధాన్నిమరో సంఘటన వెల్లడిస్తుంది. 1748 సంవత్సరంలో పౌధ్కోర్ జిల్లాకు చెందిన మహర్ లు జిల్లా అధికార యంత్రాంగానికి ఇలా విజ్ఞప్తి చేశారు – `మహర్ లమైన మా ఇళ్ళలో పెళ్లిళ్లు వాతాన్దై జోషిలు జరిపించేవారు. ఇతర జిల్లాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. కానీ 15,20 సంవత్సరాల క్రితం జోషిలు, మాకు మధ్య తలెత్తిన ఒక వివాదం మూలంగా వాళ్ళు మా వివాహకార్యాలను జరిపించడం మానుకున్నారు. కనుక ఇప్పుడు ఆ విషయాన్ని పరిశీలించి ఇతర జిల్లాలలో పద్ధతిని పరిగణలోకి తీసుకుని పాత ఆచారాన్ని పునరుద్ధరించగలరని మనవి’ (Kotani, CASTE SYSTEM, UNTOUCH ABILITY AND THE DEPRESSED).

పౌద్కోర్ జిల్లాలో కొందరు బ్రాహ్మణులు ఒక వివాదం మూలంగా మహర్ ల ఇళ్ళలో పెళ్లిలు జరిపించడం మానుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పీష్వాలు బ్రాహ్మణులు మహర్ ల పెళ్లిళ్లు జరిపించాల్సిందేనంటూ ఆదేశించి, ఈ ఆదేశాలను పాటించనివారికి 10 రూపాయల జరిమానా కూడా విధించారు.

 ఇది మహర్ లను అణచివేసే చర్య అవుతుందా? పీష్వా ఆదేశాలను ఉల్లంఘించలేని బ్రాహ్మణులు పదేపదే విన్నవించుకోవడంతో అసలువివాదం గురించి విచారించిన పీష్వా ఆ ఒక్క జిల్లాలో మహర్ ల పెళ్లిళ్లకు వెళ్లవలసిన అవసర లేదంటూ మినహాయింపు ఇచ్చారు. అంటే మిగిలిన జిల్లాల్లో ఎప్పటిలాగానే మహర్ పెళ్లిళ్లు బ్రాహ్మణులు జరిపించారు.

కొన్ని ఆచారాలు, పద్దతులలో మహర్ లకు ప్రత్యేక స్థానం ఉండేది. పన్వర్ రాజపుత్రులు నారాయణ దేవుని ఉత్సవం జరిపించినప్పుడు ప్రధమ ప్రసాదం మహర్ లు స్వీకరించేవారు. (The Tribes And Castes Of The Central Provinces Of India Vol IV pp 131).

శాంతి ఉత్సవంలో కూడా మహర్ లకే ప్రాధాన్యత ఉండేది. బ్రిటిష్ పాలన కాలంలో ఒకసారి 20మంది మహర్ లు ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నారు. కానీ వారిని మసీదులోకి రానివ్వకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. (The Tribes And Castes Of The Central Provinces Of India Vol IV pp 131).

నేటి `దళితవాదులు’ చేసే మరో పని ఏమిటంటే `నిమ్న కులాల’ వారందరినీ `దళితులు’ గానే పరిగణించి దళితులు, దళితేతరుల మధ్య ఎప్పుడు ఘర్షణ ఉండేదని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. దళితేతరులే దళితులను అణచివేశారని గుండెలు బాదుకుంటారు. కానీ ఇందులో సత్యం ఏమాత్రం లేదు. `నిమ్న కులాల’వారిలో కూడా `కుల తత్వం’ ఎలా ఉండేదో చాలామంది రచయితలు తమ రచనలలో చెప్పారు. ఒక దళిత ఉపకులం మరొక దళిత ఉపకులానికి చెందినవారిపట్ల ఎలా దుర్వ్యవహారం చేసేవారో వాటివల్ల తెలుస్తుంది. ఇలాంటివి జరగలేదని బుకాయించడంవల్ల ప్రయోజనం లేదు.

మహర్ లు (తమకంటే తక్కువ కులానికి చెందినవారని భావించిన) మంగ్ లపట్ల ఎలా వ్యవహరించారో గమనించాలి. మహర్ లు మంగ్, భంగివంటి కులాలవారి నుండి ఎలాంటి ఆహారం తీసుకునేవారుకాదు. ఎందుకంటే వారిని `కలుషితమైన’ వారిగా పరిగణించేవారు. (Gazetteer of the Bombay presidency 1885 pp.440).

ఒకసారి మంగ్ కులానికి చెందిన పెళ్ళికొడుకు పద్దతి ప్రకారం ఎద్దుపై ఊరేగకుండా గుర్రంపై తిరిగాడు. దీనితో కోపగించిన మహర్ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు మాత్రమే గుర్రంపై ఊరేగే అధికారం ఉందని, మంగ్ లకు కాదని వాళ్ళు వాదించారు. మంగ్ లు కేవలం ఎద్దులను మాత్రమే ఉపయోగించాలని, వాళ్ళు గుర్రాలు ఉపయోగించకుండా నిషేధించాలని పీష్వాకు విన్నవించారు. (1776. SSRPD VI-816).

గుర్రం హోదాకు గుర్తు. కాబట్టి తమకు మాత్రమే ఆ హోదా ఉండాలని, మంగ్ లకు కాదని మహర్ లు భావించారు. ఇలా మంగ్ లపై మహర్ లు ఆధిపత్యం చెలాయించడానికి కారణం వర్ణ వ్యవస్థ లేదా మరొక స్మృతి కాదు. మహర్ లకు తోటి మంగ్ ల కంటే ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉన్నాయని ఏ స్మృతి చెప్పలేదు. అలాగే తమ వాదనను వినిపించేటప్పుడు మహర్ లు కూడా ఏ స్మృతినీ ఆధారంగా చూపలేదు. కేవలం అప్పుడు ఆచరణలో ఉన్న పద్దతిని, సామాజిక వ్యవహారాన్ని మాత్రమే వాళ్ళు ప్రస్తావించారు. పీష్వా, మహర్ ల మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల మంగ్ కులానికి చెందిన పెళ్లికొడుకులు గుర్రంపై ఊరేగరాదని మహర్ ల విన్నపాన్ని పీష్వా ఆమోదించాడు.

దీనితో మహర్ లు, మంగ్ ల మధ్య స్పర్ధ పెరిగింది. `మహర్ లను ఉరితీయడం కంటే సంతోషకరమైన పని మరొకటి లేదని మంగ్ లు భావించేవారు’ అని గెజెట్ పేర్కొంది (Gazetteer of the Bombay presidency 1885 pp.443), మరోవైపు అటు మహర్ లు, ఇటు మంగ్ లు తమ ఇళ్ళల్లో పుణ్య కార్యాలు జరిపించడానికి బ్రాహ్మణులను నియమించుకునేవారు. రెండు కులాల మధ్య పోలిక ఏమిటంటే రెండుకులాలవారు బ్రాహ్మణులను గౌరవించేవారు, హిందూ సాంప్రదాయాలను అనుసరించేవారు. శాంతి ఉత్సవంలో మహర్ లు, మంగ్ లతో పాటు సమాజంలోని అన్నీ కులాలవారు కలిసి పాల్గొనేవారు. అలా ఆ ఉత్సవం సామాజిక సమైక్యతకు గుర్తుగా ఉండేది.

సామ్రాజ్యవాద కళ్ళద్దాల గుండా కులాన్ని చూసేవారికి గిరిజనవాదం కనిపించదు. నిజానికి బ్రిటిష్ వారే ఈ గిరిజన కులవాదానికి తెరతీశారు. 19వ శతాబ్దపు తొలినాల్లో బ్రిటిష్ వారు మహర్ లను కూడా తమ సైన్యంలోకి తీసుకునేవారు. ఎందుకంటే వారికి అప్పుడు మరో గతి లేదు. కానీ (ఈ దేశంలో తమ పాలన స్థిరపడిన తరువాత) 1892లో వాళ్ళు మహర్ లను సైన్యంలో భర్తీ చేసుకోవడం మానివేశారు. కేవలం `సుందరమైన ఉన్నత కులస్తులను’ మాత్రమే తీసుకునేవారు. పోస్టల్ సేవలు అందుబాటులోకి రావడంతో చిరకాలంగా `రాయబారులుగా’, `వార్తాహరులుగా’ వ్యవహరించిన మహర్ లకు ఉపాధి లేకుండా పోయింది. దానితో ఇతర నిమ్న కులస్తుల మాదిరిగానే మహర్ లు కూడా పట్టణ ప్రాంతాలకు తరలిపోవలసివచ్చింది. అక్కడ తమ సంప్రదాయ వృత్తి (వార్తాహరులు)నే తక్కువ జీతానికి చేయవలసివచ్చింది. తక్కువ స్థాయి పనులను చేయించడానికి ఎన్నడూ లేనివిధంగా కులపు స్థాయి, విభజనను పరిగణలోకి తీసుకోవడం ప్రారంభమైంది. (Susan Bayly, Caste, Society and Politics in India from the Eighteenth Century to the Modern Age pp.226).

In colonial hospitals and medical colleges, many of the north Indian funerary specialists known as Doms were employed as mortuary attendants and dissecting-room assistants. In textile production too, mill hands were often from the groups which had come to be identified as ‘impure’ or unclean[18].

పీష్వాల కాలంలో కోరిన వృత్తిని, పనిని ఎంచుకునే అవకాశం కలిగిన దళితులు బ్రిటిష్ పాలనలో ఇంతకు ముందెన్నడూ లేని నియమనిబంధనలు, ఆంక్షలు పాటించాల్సిన పరిస్థితిలో పడ్డారు. (Susan Bayly, Caste, Society and Politics in India from the Eighteenth Century to the Modern Age).

అలెగ్జాండర్ రాబర్ట్స్ సన్ పీష్వాల పాలనలోనే దళితులు అమానుషమైన పరిస్థితులు ఎదుర్కొన్నారని వ్రాశాడు. ఆ విధంగా తాము (బ్రిటిష్ వారు) `అణగారిన తరగతుల’ను ఉద్దరించామని, బ్రిటిష్ సామ్రాజ్యవాదపాలన దళితులకు మేలుచేసిందని చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. కానీ నిజం మరోలా ఉంది. పీష్వా మాధవరావ్ కాలనికంటే బాగా ముందు నుంచే మహర్ లు ఎంతో వతన్(భూమి) కలిగిఉండేవారు. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత పరిస్తితి ఎంత మారిపోయిందంటే `తమ ఇళ్ళలో పనివారిని నియమించుకునేప్పుడు `తగిన’ కులం వారినే నియమించుకోవాలని’ బ్రిటిష్ మాన్యువల్ లు బ్రిటిష్ మహిళలకు సూచించాయి.

బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలో పెద్ద ఎత్తున అడవుల నరికివేత వల్ల `గిరిజనులు’ నిరాశ్రయులయ్యారు. బ్రిటిష్ పరిశ్రమల వల్ల సంప్రదాయ వృత్తులు దెబ్బతిన్నాయి. రోడ్లు, రైల్వేలు, పోర్ట్ ల నిర్మాణానికి పెద్ద సంఖ్యలో కూలీలు అవసరమయ్యారు.  అంతకు ముందు ఏ రాజు నిర్వహించని పెద్ద సైనిక స్థావరాలను బ్రిటిష్ వారు ఏర్పాటుచేసుకున్నారు. పాకీ పనికి, తేయాకు తోటల్లో పనికి పెద్ద సంఖ్యలో పనివారు కావలసి వచ్చారు. దానితో `పారిశుద్య తరగతులు’గా తాము ముద్ర వేసిన మహర్, భంగి కులాల వారిని ఈ పనులకు నియోగించడం ప్రారంభించారు. కులపరమైన `స్వచ్ఛత’ , `కలుషితం’ అనే అంశాలకు ఎన్నడూలేని ప్రాధాన్యత వచ్చింది. వాటి ప్రకారమే వ్యవహరించడం ప్రారంభమైంది.

అందుకనే అంటరానితనం బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన విషఫలం అని సుసాన్ బైలి అన్నారు – `నేడు మనకు తెలిసిన అంటరానితనానికి కారణం సామ్రాజ్యవాద ఆధునికత. ఈ సామ్రాజ్యవాద ఆధునికత నూతన ఆర్థిక అవకాశాలు, మిల్లులు, నౌకా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనివారి నియామకంలో బాగా కనిపిస్తుంది. ఈ పనివారు బ్రిటిష్ పాలకులకు, సైనిక అధికారులకు సేవ చేసేవారు.( Susan Bayly, Caste, Society and Politics in India from the Eighteenth Century to the Modern Age)

Untouchability as we now know it is thus very largely a product of colonial modernity, taking shape against a background of new economic opportunities including recruitment to the mills, docks and Public Works Departments, and to the labour corps which supported both the British and sepoy regiments[20].

ఎంతసేపు మనువును తిట్టిపోయకుండా, సమస్యలన్నిటిని ఆయన రాసిన స్మృతికి అంటకట్టకుండా వివక్షకు, అన్యాయానికి కారణమయ్యయంటున్న శాస్త్ర గ్రంథాలను మనం అధ్యయనం చేయాలి. కుల వివక్ష ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. దానిని తొలగించడానికి మనమంతా ప్రయత్నించాలి. అయితే సమస్యను కేవలం ఒక స్మృతికి, ఒక వర్గంవారికి అంటకట్టకుండా మన సమాజంలోని కులతత్వాన్ని పరిశీలించుకోవాలి. అంతేకాని స్వార్థ ప్రయోజనాలకోసం పనిచేసే కొన్ని శక్తుల వలలో పడి మన సనాతన సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు. ఈ శక్తుల విభజన, విచ్చినకర వాదాల వెనుక అసలు రంగును తెలుసుకోవాలి. మహాభారత యుద్ద కాలం నుండి మహర్ ల శౌర్య, ప్రతాప చరిత్ర పట్ల మనందరికీ గౌరవం ఉంది. కానీ ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపట్ల బహు జాగ్రత్తగా ఉండాలని వారిని కోరుతున్నాం.

కఠోపనిషత్ లోని ఈ వాక్యాలతో ముగిస్తున్నాము

ఉత్తిష్టత! జాగ్రత! ప్రాప్యవరాన్నిబోధత

క్షురాసన్నధారా నిశితా దురత్య దుర్గమ పథహ తత్ కవయో వదంతి

(లేవండి, మేల్కొనండి, జ్ఞానవంతులు కండి. పదునైన కత్తివంటి ఆ మార్గం చాలా కష్టమైనదని పండితులు చెపుతున్నారు)

– ఆంగ్ల మూలం opindia  .