Home News చైనా ఆదిపత్యాన్ని ఎదుర్కుంటున్న నేపాల్

చైనా ఆదిపత్యాన్ని ఎదుర్కుంటున్న నేపాల్

0
SHARE

నేపాల్ ప్రభుత్వం భద్రతకు సంబంధించిన విధాన వైపరీత్యాలను గ్రహించగలుగుతోందనడనికి ఇది నిదర్శనం. తమ దేశంలోని గండకీనదిపై ‘విద్యుత్ ఉత్పాదక జలాశయాన్ని’ నిర్మించడానికి చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నేపాల్ ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. ఇలా ఈ ఒప్పందం రద్దుకావడం నేపాల్‌తో చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణకు ఎదురుదెబ్బ. నేపాల్ భద్రత మనదేశ భద్రతతో ముడిపడి ఉంది. నేపాల్‌లో చైనా ఉనికి పెరగడం మనదేశ భద్రతకు సైతం ప్రమాదకరం. కానీ రెండు దశాబ్దులుగా చైనా ప్రభుత్వం నేపాల్‌లోకి వ్యూహాత్మకంగా చొరబడుతూనే ఉంది! క్రీస్తుశకం 1996లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలోని చైనా అనుకూల వర్గం ఆ పార్టీ నుండి చీలిపోయి మావోయిస్టు పార్టీగా అవతరించిననాటి నుంచి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యూహాత్మక దురాక్రమణ కొనసాగుతోంది. మావోయిస్టులు ‘నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ’గా ఏర్పడి దశాబ్దిపాటు నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను నిరోధించారు. నేపాల్‌లో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడరాదన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ వారి అభిమతం. తమ దేశంలో వలెనే నేపాల్‌లో కూడ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ ఏర్పడాలన్నది చైనా కమ్యూనిస్టుల దుర్వాంఛ. ఎందుకంటే బహుళపక్ష ప్రజాస్వామ్య నేపాల్ భారతదేశంతో యుగయుగాల మైత్రిని కొనసాగించగలదు. సమాన సాంస్కృతిక జాతీయతత్వం నేపాల్‌నూ, మనదేశాన్ని సహజ మైత్రీబంధంతో పెనవేస్తోంది. క్రీస్తుశకం 1950లో మన దేశానికి, నేపాల్‌కు మధ్య కుదిరిన ‘శాంతి, స్నేహ అంగీకారం’ యుగాలనాటి ఈ ఉమ్మ డి సాంస్కృతిక వారసత్వానికి మరో ధ్రువీకరణ. ఈ మైత్రిని చెడగొట్టడం, తాము నేపాల్‌కు దగ్గరకావడం చైనా ఆధిపత్య విస్తరణ వ్యూహంలోని మొదటి దశ! అందువల్ల చైనా ప్రేరణలో పుట్టుకొచ్చిన మావోయిస్టు పార్టీ 1996 నుంచి నేపాల్‌లో భయంకర బీభత్సకాండ జరిపింది. ఈ బీభత్సకాండకు పదమూడువేలమందికి పైగా బలైపోవడం చరిత్ర! ‘‘తుపాకిగొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న’’ ఆశ అడుగంటిపోవడంతో 2005లో మావోయిస్టు పార్టీ అధినేత పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ వ్యూహం మార్చాడు. ఇలా వ్యూహం మార్చడం చైనా విస్తృత వ్యూహంలో భాగం. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల నిబద్ధతను అభినయించడం ఈ మారిన వ్యూహం.. ప్రజాస్వామ్య ప్రక్రియను ఉపయోగించి నేపాల్‌ను భారత్ నుంచి ‘‘విడగొట్టి’’ చైనా ‘ఒడి’లో కూర్చుండబెట్టాలన్నది ‘ప్రచండ’ వ్యూహం! ఇందులో భాగంగానే గత ఏడాది ప్రచండ ప్రధాన మంత్రిత్వంలోని నేపాల్ ప్రభుత్వం గండకీ నదిపై ‘జలవిద్యుత్ కేంద్ర నిర్మాణం’ కార్యక్రమాన్ని చైనాకు చెందిన ‘గెఝో ఉబా’ అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థకు కట్టబెట్టింది! షేర్ బహదూర్ దూబా ప్రధానమంత్రిత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఈ ‘జలవిద్యుత్ కేంద్రం’ ఒప్పందాన్ని రద్దు చేయడం మన దేశానికి పరోక్ష విజయం…

నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, మన ప్రభుత్వం చైనావారి భౌతిక, వ్యూహాత్మక, వాణిజ్య, దౌత్య దురాక్రమణను అడ్డుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చైనా ప్రభుత్వం మరింత తీవ్రంగా తన ప్రచ్ఛన్న దురాక్రమణను కొనసాగిస్తుండడం నిరాకరింపజాలని నిజం. మన ప్రభుత్వం అడుగడుగున అడ్డుకుంటోంది. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవు అభివృద్ధి పేరుతో చైనా నౌకాదళం మన పడమటి తీరంలో నిరంతరం పచార్లు చేస్తోంది. ఇందుకు సమాధానంగా మన ప్రభుత్వం ఇరాన్‌లోని ‘చౌబహార్’ ఓడరేవు అభివృద్ధిని చేపట్టింది. చైనా ఇంతటితో ఆగలేదు. అరేబియా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి సమీపంలో ఉన్న ఆఫ్రికా దేశమైన ‘జిబౌటి’లో తన నౌకాదళ స్థావరాన్ని స్థాపించింది. శ్రీలంకలోను మాల్‌దీవులలోను చైనా సైనిక కలాపాలు పెరుగుతుండడం క్రీస్తుశకం 2009 నుంచి నడుస్తున్న చరిత్ర… శ్రీలంక తీర జలాలలో చైనా నౌకలు జలాంతర్గాములు తిష్టవేస్తున్నాయి. శ్రీలంక ఆగ్నేయ సముద్ర తీరంలో ఉన్న ‘హంబన్‌తోట’ ఓడరేవు నిర్వహణలో చైనాకు భాగస్వామ్యం ఏర్పడడం ఇటీవల సంభవించిన భారత వ్యతిరేక పరిణామం. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం చైనాతో కుదుర్చుకున్న ‘విద్యుత్ కేంద్ర నిర్మాణం’ ఒప్పందం రద్దుకావడం భారత్‌కు పరోక్ష దౌత్య విజయం..

మాల్‌దీవులలో చైనా తొలిసారిగా 2011 నవంబర్‌లో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది. అంతవరకూ శ్రీలంకలోని తమ రాయబారి కార్యాలయం ద్వారా మాత్రమే చైనా మాల్‌దీవులలో వ్యవహరించగలిగింది. దక్షిణ వైపునుంచి మనదేశంపై ‘దురాక్రమణ’ జరుపడం ఈ దౌత్య విస్తరణకు లక్ష్యం. ఇలా చైనా తమ దేశంతో దౌత్య కార్యాలయాన్ని నెలకొల్పడానికి అనుమతించడం ద్వారా మాల్‌దీవుల ప్రభుత్వం భారత్ వ్యతిరేకతకు ఒడిగట్టింది. 2011 వరకు మాల్‌దీవులతో మనదేశానికి మరో మూడు దేశాలకు మాత్రమే దౌత్య కార్యాలయాలు ఉండేవి! చైనా ఐదవ దేశమైంది. ఇలా చైనా చొరబడిన తరువాత సంవత్సరం తిరగకముందే మనదేశానికి చెందిన ‘జిఎమ్‌ఆర్’ అను వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మాల్‌దీవుల ప్రభుత్వం రద్దు చేసింది! రాజధాని మాలే సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు మన సంస్థ నిర్మాణం సాగించిన తరువాత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తరువాత మాల్‌దీవుల ప్రభుత్వం మాట తప్పింది! ఒప్పందాన్ని రద్దు చేసింది! ‘ప్రపంచీకరణ’ నియమాలకు మనదేశం ‘బందీ’ అయినట్టుగా మరే దేశం కూడా ‘బందీ’ కావడం లేదు. అతి చిన్నదేశమైన మాల్‌దీవులు ఇలా ‘ప్రపంచీకరణ’ వాణిజ్య నిబంధనలను నిర్లజ్జగా నిర్భయంగా ఉల్లంఘించింది! ఇందుకు కారణం చైనా ప్రభుత్వం మాల్‌దీవులను మనకు వ్యతిరేకంగా ఉసిగొల్పడం… అలా రద్దయిన ఒప్పందాన్ని మాల్‌దీవుల ప్రభుత్వం ఆ తరువాత ఒక చైనా వాణిజ్య సంస్థకు కట్టబెట్టింది! ఇలా మనకు వ్యతిరేకంగా దౌత్య దౌర్జన్యం చేస్తున్న చైనా దురహంకారానికి నేపాల్‌లో ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది! ఈ గండకీ జలవిద్యుత్ కేంద్ర నిర్మాణ కార్యక్రమాన్ని నేపాల్ ప్రభుత్వం మన దేశానికి చెందిన వాణిజ్య సంస్థలకు అప్పగించే అవకాశం ఉందట!

మావోయిస్టు నాయకుడు ప్రచండ 2008 నుంచి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రతిసారీ సంవత్సరం తిరగకముందే రాజీనామా చేయవలసి వచ్చింది! రెండుసార్లు, ప్రధానిగా ఉండిన సమయంలో ప్రచండ భారత వ్యతిరేక విధానాలను అవలంబించాడు. ఈ వ్యతిరేకతలో భాగంగానే గత జూన్ ఆరవ తేదీన ఈ ‘గండకీ’ ఒప్పందాన్ని చైనాతో కుదుర్చుకున్నాడు. దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంవల్ల పనె్నండువేల మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాలగదు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)