Home News నిబంధనలకు విరుద్ధంగా ఎండోమెంట్ ఆలయం వద్ద క్రైస్తవ సభలు

నిబంధనలకు విరుద్ధంగా ఎండోమెంట్ ఆలయం వద్ద క్రైస్తవ సభలు

0
SHARE
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామం శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో క్రైస్తవ సభలు ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమైంది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రార్ధనలపై నిషేధం విధిస్తూ 2007లో జారీ చేసిన ‘అన్యమత ప్రచార నిరోధక చట్టం’ (జీవో నెంబర్ 747)కు విరుద్ధంగా,  దేవాలయానికి కేవలం 10 అడుగుల దూరంలో ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు రోజులపాటు ఈ క్రైస్తవ ప్రార్ధనా కూటములు ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలను గాయపరిచింది. శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖకు చెందినది కావడంతో ఈ వ్యవహారంపై ఎండోమెంట్ వారు ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం కారణంగా పోలీసులు కూడా ఈ ఘటనపై చూసి చూడనట్లు వ్యవహరించారు.
దేవాలయానికి కేవలం 10 అడుగుల దూరంలో క్రైస్తవ సభలు నిర్వహిస్తున్న దృశ్యం
తొలుత కూటములు నిర్వాహకులకు వేరొక ప్రదేశంలో అనుమతి ఇచ్చినప్పటికీ అది కాదని పనిగట్టుకుని హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ క్రైస్తవ కూటములు నిర్వహించడాన్ని ఈడూరు గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కుట్రపూరితమైన చర్య అని, రాజకీయ లబ్ది కోసం నాయకులు కూడా ఇటువంటి నేరపూరితమైన కార్యకలాపాలకు సహకరించడం అనైతికం అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.