Home News సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ

సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ

0
SHARE

సంస్కృతి ఫౌండేషన్.. భారతీయ సంస్కృతి, నాగరికత, విలువల పునర్ వికాసం కోసం పనిచేస్తున్న సంస్థ. 2010వ సంవత్సరంలో కొద్ది మంది పెద్దలు ఆలోచనల ద్వారా రూపుదాల్చిన ఈ సంస్థ.. సమాజంలోని ఉన్నత వ్యక్తుల ద్వారా మంచి అలవాట్లను, దేశం పట్ల ఆరాధన భావనను కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమాజం పట్ల గౌరవ భావనను కలిగించే సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ సంస్కృతి ఫౌండేషన్. సమాజంలో ఒక నూతన ఒరవడిని తెచ్చి, నిరాశలో కొట్టుమిట్టాడుతున్న యువత తమ శక్తియుక్తులు తాము తెలుసుకునే విధంగా ‘కెరీర్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్’ అనే శిక్షణా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా జూన్ 16న సంస్కృతి ఫౌండేషన్ కార్యాలయం నందు నూతనంగా నిర్మించిన ‘భీంసేన్ దేశ్ పాండే’ హాలులో కార్యక్రమము ఏర్పాటు చేసారు. 
 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ టీవీఎల్ నరసింహారావుగారు.. విద్యార్థులు ప్రస్తుత సమయంలో ఎంతో జాగరుకతతో మెలగాలని, ఉద్యోగ అవసరాలకు కావలసిన అన్ని విషయాలలో నేర్పరితనము కలిగి ఉండాలని తెలియచేశారు. సంస్కృతి ఫౌండేషన్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ..  ముందు ముందు మంచి నడత కలిగిన యువకులు సంస్థ ద్వారా తయారుకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు తన వంతు సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తానని తెలియజేశారు.
సికింద్రాబాద్ పవర్ గ్రిడ్ హెచ్.ఆర్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ అన్నావజ్జల రాధాకృష్ణ గారు మాట్లాడుతూ.. యువతకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పని చేయాలంటే నీతివంతమైన యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలని అన్నారు. తన నుండి ఏ విధమైన సలహాలు, సూచనలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.
కూకట్పల్లిలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా పాఠశాల నిర్వహిస్తూ, రామకృష్ణ మఠంలో శిఖకులుగా కూడా బాధ్యత నిర్వహిస్తున్న శ్రీముర్తి గారు ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారిలో ఉన్న వత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవానే అంశంపై విలువైన మెళకువలు తెలియజేసారు. ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమయ్యామని బాధ పడకుండా వచ్చిన అవకాశాలను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు. ఉద్యోగం రాలేదని నిరాశతో కుంగిపోక మరింత ఉత్సాహంగా ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని ఉదాహరణలతో వివరించి విద్యార్థులను ఉత్సాహపరిచారు.
డాక్టర్ వివేక్ మోడిగారు ప్రసంగిస్తూ.. విద్యార్థులు  ముందు తమను తాము అర్హులుగా చిత్రించుకోగలిగితే ఆత్మస్థైర్యం పెరిగి స్పర్ధలో ముందడుగు వేస్తారు అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత చక్కటి విన్యాసాలు చేయించి వారిని ఉత్తేజితులను చేశారు.  
శ్రీ వనజకుమారు గారు విద్యార్థులతో అనుభవాలు పంచుకొంటూ ఎన్నోరకాల సేవలు ఈ సమాజానికి కావలసి ఉన్నది ఎంతమంది ఎన్ని చేసినా ఇంకా చేయవలసినది చాలా ఉన్నది కాబట్టి మిలో ఎవరైనా ఏదైనా సమయంలో సేవ చేయాలని అనిపిస్తే సంస్కృతి మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా వున్నదని తెలిపారు. 
కార్యక్రమం ఆద్యంతం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగినది. ఇందులో 5 కాలేజీల విద్యార్థులు హాజరు అయ్యారు.