Home News సామాజికంగా వెనుకబడిన ముషాహర్లు ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చేసిన సుధావర్గీస్‌

సామాజికంగా వెనుకబడిన ముషాహర్లు ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చేసిన సుధావర్గీస్‌

0
SHARE

సుధావర్గీస్‌ కేరళలోని కొట్టాయంకు చెందిన మహిళ. ఈమె 1949వ సంవత్సరంలో జన్మించింది. బీహార్‌లో నివసిస్తున్న ముషాహర్ల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి అహర్నిశలు శ్రమించింది.

బీహార్‌లో ముషాహర్లు ఎంతగా వెనకబడ్డా రంటే.. చాలా కాలం వరకు ఎలుకలను పట్టుకొని వండుకొని తిని జీవనం సాగించేవారు. వీరి జీవన విధానం చూసి సామాన్య ప్రజలు దూరంగా ఉంచే వారు. దాంతో ఊరికి దూరంగా గుడిసెల్లో జీవితం గడిపేవారు. అగ్రవర్ణాలవారు వీరిని చాలా నీచంగా చూసేవారు.

సమాజంలో కులవివక్ష అప్పటికీ ఉందంటే సుధాకు నమ్మబుద్ధికాలేదు. ముషాహర్ల జీవితాల్ని దగ్గరగా చూసిన ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. వారి జీవితాలల్లో మార్పు తీసుకురావలనుకుంది. వెంటనే కార్యాచరణకు పూనుకుంది. వారి గుడిసెల వద్దనే తనూ ఒక గుడిసె నిర్మించుకొని నివాసం ఏర్పరచుకుంది. కష్టపడి ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్చుకుంది. డిగ్రీ పూర్తిచేసింది. తను చేస్తున్న పనిలో న్యాయ పోరాటాలుంటాయి. అందుకు ఆమె న్యాయశాస్త్రం కూడా చదువుకుంది.

1987లో ‘నారీగుంజన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా దళిత స్త్రీలు వారి హక్కులు పొందేలా చేయగలిగింది.

2005లో బాలికల కొరకు ‘ప్రేరణ’ అనే ఆవాస విద్యాలయాన్ని పాట్నాలోని దానాపూర్‌లో ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాల కార్మికులుగా మారుతున్న బాలికలను చదువు వైపు మళ్లించడమే.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రోత్సా హంతో గయలో ‘ప్రేరణ-2’ పాఠశాల ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నారీగుంజన్‌ ద్వారా నడుపుతున్న పాఠశాలల్లో సుమారు 3000 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కొంతమంది ఇంటర్మీడియట్‌ కూడా చదువుతున్నారు. ఈ పాఠశాలలో నర్సింగ్‌ విద్యను కూడా నేర్పిస్తున్నారు. చదువుతోపాటు బాలికలకు నృత్యం, కరాటేలు కూడా నేర్పించే ఏర్పాట్లు చేశారు.

2011లో గుజరాత్‌లో నిర్వహించిన ఆటల పోటీలలో ప్రేరణ విద్యార్థినులు 5 బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు. అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొనడానికి జపాన్‌ వెళ్లే అర్హత సంపా దించారు.

యువకులను చెడు అలవాట్ల నుండి దృష్టి మళ్లించడానికి సుధ వారికి క్రికెట్‌ కిట్లను అంద జేసింది. ఈ ప్రక్రియలో ఒక బ్యాంక్‌ సహకరించింది. ఆమె ప్రయత్నం వలన నేడు ఆ గ్రామంలో 16 క్రికెట్‌ జట్లు ఏర్పడ్డాయి. వారు ఇతర గ్రామాల క్రికెట్‌ జట్లతో పోటీపడి విజయాలు సాధిస్తున్నారు. ఆ యువకుల జీవితాల్లో మంచి మార్పు సంభవించింది. ప్రస్తుతం నారీగుంజన్‌ స్వచ్ఛంద సేవాసంస్థ బీహార్‌లోని 5 జిల్లాలలో పనిచేస్తోంది. 850 స్వయం సహాయక గ్రూపులున్నాయి. వీరు అంగన్‌వాడీలను పోలిన ఆనంద్‌ శిక్షా కేంద్రాలను నడిపిస్తున్నారు. మధ్యలో బడి మానేసిన వారికోసం కిశోరీ శిక్షా కేంద్రాలను నడుపుతున్నారు. ‘అక్షరాంజలి వయోజన విద్య’ ద్వారా మహిళలను విద్యావంతుల్ని చేస్తున్నారు.

ముషాహర్‌ తెగలో పౌష్ఠికాహార లోపం ఎక్కువ. సుధ వారికి పౌష్ఠిక ఆహారం అందించే దిశగా కృషిచేసింది. నేడు వారు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. తమ పెరటిలో కూరగాయలు సైతం పండిస్తున్నారు.

నారీగుంజన్‌ సంస్థలోని మహిళలు ఒక బ్యాండ్‌ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుధ వారికి శిక్షణ ఇప్పించింది. వీరి ప్రతిభ చూసిన ఒక వ్యక్తి తన వివాహంలో బ్యాండు వాయించడానికి వీరిని ఆహ్వానించాడు. ఈ వృత్తి ద్వారా వారి ఆదాయం పెరిగింది. అంతేకాకుండా ఈ సంస్థ స్త్రీలకు అవసర మైన సానిటరీ నామ్‌కిన్స్‌ ఉత్పత్తి చేసి తక్కువ ధరలకే అందిస్తోంది.

సుధ సైకిల్‌పై పర్యటిస్తూనే తన కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం చేస్తుంది. అందుకే ఆమెను అందరూ ‘సైకిల్‌ దీదీ’ అని పిలుస్తారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ బిరుదునిచ్చి సత్కరించింది. బీహార్‌ ప్రభుత్వం ‘ఐకాన్‌ ఆఫ్‌ బీహార్‌’ అనే బిరుదునిచ్చింది. 2017కుగాను ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ బిరుదు పొందింది. ఈ అవార్డు మళయాల మనోరమ సంస్థ నుండి లభించింది.

సుధావర్గీస్‌ పోరాట ఫలితంగా నేడు ముషాహర్లు సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారు. మానవ త్వానికి మారుపేరుగా నిలిచిన సుధాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

Source: జాగృతి