Home News శోభాయాత్రపై దాడి ఘటన: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయపై చర్యలు తీసుకోవాలి – వి.హెచ్.పి

శోభాయాత్రపై దాడి ఘటన: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయపై చర్యలు తీసుకోవాలి – వి.హెచ్.పి

0
SHARE

నిజామాబాద్ లో ఈ నెల 19న జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన నగర పోలీస్ కమీషనర్ కార్తీకేయను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూపరిషద్ డిమాండ్ చేసింది.

ఈ ఘటన పై నేడు (26-ఏప్రిల్) హైదరాబాద్ లో జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో వి.హెచ్.పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, అధికార ప్రతినిది శ్రీ శశిధర్, మాట్లాడుతూ.. హనుమాన్ శోభాయత్రపై ముష్కరులు దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అసలు దోషులను శిక్షించాలని,  హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్నికోరారు.

నిజామాబాద్ లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాదరణ పెరుగుతున్న హనుమాన్ జయంతి శోభ యాత్రను లక్ష్యంగా చేసుకొని కొన్ని మతోన్మాద శక్తులు టిఆర్ఎస్ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంఐ.ఎం అండతో దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.

సంఘటన గురించి వివరిస్తూ.. ఏప్రిల్ 19వ తేదీ రాత్రి 8:30 సమయంలో నిజామాబాద్ పట్టణం బడా బజారులోని అల్ రషీద్ ఫర్నిచర్ షాపు దగ్గరకి చేరిన హనుమాన్ శోభా యాత్రలో పాల్గొన్న హిందువులపై ముష్కరులు ఒక్కసారిగా రాళ్ళ దాడి జరిపారని, ఈఘటనలో అనేకమంది గాయపడ్డారు అని తెలిపారు. ఇటువంటి రాళ్ల దాడి ఘటనలు అత్యంత పకడ్బంది ప్రణాళికతో జరుగుతున్నాయని విశ్వహిందూపరిషద్ ఆరోపించింది. శోభాయాత్ర జరిగే సమయంలో వీధి దీపాలు పోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, వెంటనే మతోన్మాద శక్తులు యాత్రపై దాడి చేయడం జరుగుతోందన్నారు. ఈ దాడులను నిలువరించాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం యాత్రలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని అక్రమ కేసులు నమోదు చేయడం సైతం అనుమానాస్పదంగా ఉందన్నారు.

నిజామాబాద్ లో జరిగిన ఘటన మరుసటి రోజు 20 ఏప్రిల్ నాడు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇక్బాల్ హిందువులను లక్ష్యంగా చేసి ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా వివిధ హిందూ సంస్థల ప్రతినిధులను, ముఖ్యంగా వి.హెచ్.పి, బజరంగ్ దళ్ కార్యకర్తల పై 147, 148, 341, 153(A), 295(A), 427 & 109, R/w 149  ఐపిసి  లాంటి వివిధ సెక్షన్లలో కేసులు పెట్టి అరెస్ట్ చేయడం పెద్ద కుట్ర అని ఆరోపించారు.

శోభాయత్రకు ముందే నిర్వాహకులు ఇటువంటి దాడి ఘటన జరిగే అవకాశం ఉందని అని పోలీస్ కమిషనర్ కార్తీకేయ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు తీసుకోక పట్ల పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇదే తరహాలో గత రెండు సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పీస్ కమిటీ చర్చల సందర్బంగా పోలీసుల దృష్టికి తీసుకొని వచ్చినా ఫలితం లేదని శశిధర్ వివరించారు.

పత్రిక సమావేశంలో పాల్గొన్న వి.హెచ్.పి సభ్యులు అసలు దోషులను శిక్షించి, హిందువులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.