Home News వారికెందుకంత `అసహనం’? – మన్మోహన్ వైద్య , సహ సర్ కార్యవాహ్, ఆర్ ఎస్ ఎస్

వారికెందుకంత `అసహనం’? – మన్మోహన్ వైద్య , సహ సర్ కార్యవాహ్, ఆర్ ఎస్ ఎస్

0
SHARE
डॉ. मनमोहन वैद्य (लेखक राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह हैं)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయవర్ష శిక్షవర్గ ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయించుకోగానే కొందరు ఎక్కడలేని అభ్యంతరాలు, ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఎంతో అనుభవం కలిగిన రాజకీయవేత్త. ప్రజాజీవనంలో ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. సామాజిక, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలూ, ఆలోచనలు ఉన్నాయి. ఆ విలువైన అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశ్యంతోనే ఆయనను కార్యక్రమానికి ఆహ్వానించాం. అలాగే ఆయన కూడా ప్రత్యక్షంగా సంఘ గురించి తెలుసుకోవచ్చును. ఇలా అభిప్రాయాలూ, ఆలోచనలను పరస్పరం పంచుకోవడమనేది భారతీయ సంప్రదాయం. కాబట్టి ఇలా ఆహ్వానించడం, దానిని ఆయన అంగీకరించడం ఆ సాంస్కృతిక సాంప్రదాయంలో భాగమే.

కానీ ఈ విషయమై కొందరు ఎందుకింత అభ్యంతరాలు చెపుతున్నారు? ఎందుకింత వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు?

ఈ అభ్యంతరాలు, వ్యతిరేకత కొందరికి విచిత్రంగా అనిపించవచ్చును. వీటి వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక, సిద్దాంతపరమైన ఆలోచన పరిశీలిస్తే ఇది కొత్త విషయమేమికాదని తెలుస్తుంది. భారతీయ మానసచిత్రంపై విదేశీయమైన, అత్యంత అసహనపురితమైన, హింసాత్మకమైన వాదన ఏదైనా ఉందంటే అది `కమ్యూనిజం’. దీనిని ప్రపంచమంతా తిరస్కరించింది. ఈ వాదానికి కట్టుబడినవారు ఎల్లప్పుడు తమ వాదాన్నే `నెగ్గించుకోవాలనుకోవడమే’కానీ ఇతరులు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడరు. మరో అభిప్రాయాన్ని సహించారు.

వామపక్షవాదుల సైద్ధాంతిక ప్రపంచంలో రెండే పక్షాలు(స్వ, వైరి) ఉంటాయి. కనుక స్వపక్షానికి చెందనివారిని విమర్శిస్తారు, వ్యతిరేకిస్తారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అనుసరించే విధానం. ఇలా తీవ్ర `అసహనశీలత’ను కలిగిఉండే వీరు మానవహక్కులు, వాక్ స్వాతంత్ర్యం అంటూ నినాదాలు చేస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఇదే కార్యక్రమానికి (తృతీయవర్ష సమారోప్) ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగాసెసే పురస్కార గ్రహీత అభయ్ బంగ్ ను ఆహ్వానించినప్పుడు కూడా కొందరు `వామపక్ష’ సామాజికవేత్తలు గగ్గోలు పెట్టారు. తమ మరాఠి పత్రిక `సాధన’ లో అభయ్ బంగ్ కు వ్యతిరేకంగా వ్యాసాలు, వ్యాఖ్యలు ప్రచురించారు. తాను తన అభిప్రాయాలను కార్యక్రమంలోనే వెల్లడిస్తానని, కనుక కాస్త ఓపిక పట్టాలని అభయ్ వారికి సమాధానమిచ్చారు. అంతేకాదు తన భావాలు, అభిప్రాయాల గురించి తెలిసినప్పటికీ తమ కార్యక్రమానికి ఆహ్వానించడంలో ఆర్ ఎస్ ఎస్ విశాల దృక్పధం అర్ధమవుతోందని, మరోపక్క స్వేచ్చ, సహనం అంటూ గొంతుచించుకునే కమ్యూనిస్టులే అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి హాజరుకావాలన్న తన నిర్ణయానికి కట్టుబడుతూ, తన ఉపన్యాస ప్రతిని ముందుగానే సాధన పత్రికకు పంపారు. కానీ వాక్ స్వాతంత్ర్యానికి, భావ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే పత్రికవారు ఆయన పంపిన ఉపన్యాసాన్ని మాత్రం ప్రచురించలేదు.

2010లో నేను కేరళలోని కొల్లమ్ కు చెందిన సిపిఎం కార్మిక సంఘ నాయకుడు కేశవన్ నాయర్ ను కలిశాను. స్థానిక పత్రికలో `వేదాల్లో శాస్త్రవిజ్ఞానం’ అనే వ్యాసాలు రాసినందుకుగాను అప్పట్లో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ అనుసరిస్తున్న అసంబద్ధ, విచిత్ర విధానానికి నిరసనగా ఆ తరువాత ఆయన అనేక వ్యాసాలు వ్రాసారు. అంతేకాదు `బియాండ్ రెడ్’ అనే పుస్తకాన్ని(అది నాకు ఇచ్చారు కూడా) ప్రచురించారు. ఆ పుస్తకపు అట్టపై `కమ్యూనిస్టులు మీకు ఇచ్చే ఏకైక స్వేచ్ఛ ఏమిటంటే వారిని పొగడడం’ అని ముద్రించారు.

నేను ప్రచార ప్రముఖ్ గా ఉన్నప్పుడు కోల్ కతాలో స్టేట్స్ మన్, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వర్తమాన్ లతో పాటు మరో కమ్యూనిస్టు పత్రికకు చెందిన సంపాదకులను కలిసే ప్రయత్నం చేశాను. అన్ని పత్రికల సంపాదకులు అందుకు అంగీకరించారుకానీ కమ్యూనిస్టు సంపాదకుడు మాత్రం ఇష్టపడలేదు. తన సమయం వృధా చేసుకోవడం ఇష్టంలేదంటూ తిరస్కరించాడు. ఇదీ వారికి వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య విలువలపై ఉన్న శ్రద్ధా, నిష్ట. మేము ఎవరిని కలుస్తామో వారంతా మా అభిప్రాయాలను మన్నించాలనిగాని, మన్నిస్తారనిగాని ఆశించము. నేను కలిసిన సంపాదకులంతా అలా సంఘ ఆలోచనలను తెలుసుకున్నారు. ఇక కలవడానికి ఇష్టపడని సంపాదకుణ్ణి ఎప్పుడు   కోల్ కతా వచ్చినా కలవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని అనుకున్నాను.

కొన్నేళ్ళ క్రితం జైపూర్ లో జరిగిన సాహిత్య సభలో సామాజిక, జాతీయ అంశాలపై ఆర్ ఎస్ ఎస్ ఆలోచనలను ప్రస్తావించాలంటు నన్ను, దత్తాత్రేయ హోసబలేని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఒక జర్నలిస్ట్ మాతో సంభాషిస్తారని చెప్పారు. కార్యక్రమానికి హాజరుకావాలని మేము అనుకున్నాము. కానీ అక్కడ కూడా వామపక్షవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సంఘకు దేశవ్యాప్తంగా అంగీకారం, ఆమోదం లభిస్తున్నప్పటికీ కమ్యూనిస్టులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోరు. అందుకనే ఆర్ ఎస్ ఎస్ ను ఆహ్వానించినందుకు నిరసనగా సీతారాం ఏచూరి, ఎం ఏ బేబీ వంటి వారు జైపూర్ సాహిత్య సభలను బహిష్కరించారు. వారి భావ స్వాతంత్ర్య నిర్వచనం సంఘ ఏమిచెపుతోందో తెలుసుకునేందుకు మాత్రం పనికిరాలేదు. ఇంతకీ వారి నిరసనకు కారణం ఏమిటి? ఆర్ ఎస్ ఎస్ ఆలోచనలు, అభిప్రాయాలూ వ్యక్తం చేసేందుకు వేదిక ఇస్తే ఇప్పటి వరకు తాము ప్రచారం చేస్తూ వచ్చిన అబద్ధాలు బయటపడిపోయి తమ ముసుగు తొలగిపోతుందని భయమా? ప్రజలకు నిజానిజాలు తెలిసిపోతాయని ఆందోళనా? భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకునే ఇలాంటి ఫాసిస్ట్ ధోరణి, కమ్యూనిస్ట్ సిద్దాంతం భారతీయ దృక్పధానికి పూర్తి వ్యతిరేకం.

ఇక్కడ మరొక సంఘటన కూడా చెప్పుకోవాలి. కొన్నేళ్ళ క్రితం చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం భారత్ ను సందర్శించింది. ఆ బృంద సభ్యులు సంఘ పెద్దలను కలవాలనుకున్నారు. వారిని ఢిల్లీ లోని కేశవ కుంజ్ కు ఆహ్వానించాము. నేనే ఆ బృందానికి స్వాగతం పలికాను. వాళ్ళు నాకు ఒక జ్ఞాపికను బహుకరించారు కూడా. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిస్టు నేతలను, ఇతర పార్టీ వారిని కలవడంలో అర్ధం ఉందికానీ సంఘ అధికారులను కలవాలని ఎందుకు అనుకున్నారని నాకు ఆసక్తి కలిగింది. తమది కార్యకర్తల ఆధారంగా నడిచే పార్టీ అని సంఘ కార్యకర్తల ద్వారా నడిచే సంస్థ కాబట్టి దాని గురించి తెలుకోవాలనుకున్నామని సమాధానం చెప్పారు. అప్పుడు నేను రెండు సంస్థల మధ్య తేడాను వారికి గుర్తుచేశాను -`చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా రాజకీయ పార్టీ. అది అధికారం కోసం, అధికారం ద్వారా తన కార్యకలాపాలు సాగిస్తుంది. కానీ ఆర్ ఎస్ ఎస్ కు ఎలాంటి రాజ్యాధికారం అవసరం లేదు. మేము నేరుగా సమాజంలో, ప్రజల సహకారంతో పనిచేస్తాం.’’ ఇలా నేను చెప్పిన తరువాత కూడా సంభాషణ స్నేహపూర్వకంగానే సాగింది. ఇదే భారతీయ పద్దతి.

నేడు భారతీయ మేధోప్రపంచాన్ని `వామపక్ష’ ధోరణి ఆక్రమించింది. దీనికి కారణం కుటుంబం, వ్యక్తి, కులం ఆధారంగానే నడుస్తున్న కాంగ్రెస్ తో సహా వివిధ పార్టీలు మేధోపరమైన కార్యకలాపాలను కమ్యూనిస్ట్ లకు అప్పగించాయి. దీనివల్ల అక్కడ కూడా వామపక్ష ధోరణే కనిపిస్తోంది. ఈ పార్టీలు కూడా స్వేచ్చ, ప్రజస్వామ్యం, భావప్రకటన స్వేచ్చ మొదలైన వాటి గురించి మాట్లాడినా చివరికి కమ్యూనిస్ట్ తరహా అసహనశీలత, మేధోపరమైన అంతరానితనం, వేర్పాటు ధోరణినే ప్రదర్శిస్తున్నాయి.

ప్రణబ్ ముఖర్జీ సంఘ కార్యక్రమానికి రావాలని నిర్ణయించుకోవడంతో మరోసారి వీరి అసహనశీలత బయటపడింది. నాలుగవ సర్ సంఘచాలక్ రజ్జు భయ్యాకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో స్నేహ సంబంధాలు ఉండేవి. ఒకసారి కాంగ్రెస్ నాయకుడు ప్రయాగకు వెళ్లినప్పుడు నగరంలోని ప్రముఖులతో సమావేశానికి రావలసిందిగా ఆయన్ని ఆహ్వానించారు. కానీ ఆ నాయకుడు అందుకు నిరాకరించాడు. అలా వస్తే తన పార్టీలో కలకలం రేగుతుందని, తాను వివాదంలో కూరుకుంటానని ఆ నాయకుడు చెప్పాడు. అప్పుడు రజ్జుభయ్యా ఆ నాయకుడితో సంఘ గురించి చెప్పారు. తనను కాంగ్రెస్ నాయకుడితో చూసిన ఇతర స్వయంసేవకులు ఎవరు సందేహించరని, పైగా సంఘాన్ని గురించి ఆ నాయకుడికి వివరిస్తున్నానని అనుకుంటారని చెప్పారు. అంత పెద్ద నాయకుడిని కూడా కాంగ్రెస్ ఎలా అనుమానిస్తుందని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్ళీ అలాంటి పరిస్థితే పునరావృతమవుతోంది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతిని కూడా ఇప్పుడు పార్టీలో జూనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు, సందేహిస్తున్నారు.

మరోపక్క ఒక్క స్వయంసేవక్ కూడా కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాష్ట్రపతిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఎందుకని ప్రశ్నించలేదు. ఇదీ ఆర్ ఎస్ ఎస్ కి, `భావప్రకటన స్వేచ్ఛ’ అంటూ గొంతుచించుకునే ఇతరులకు మధ్య తేడా.

భిన్నాభిప్రాయాలను గౌరవించడం, మన్నించడం భారతీయ సంప్రదాయం. ఇతరుల అభిప్రాయాలను తిరస్కరించడం, నిరసన తెలుపడం అభారతీయ పద్దతి. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయానికి కూడా వ్యతిరేకమే.

మొత్తానికి ప్రణబ్ ముఖర్జీ సంఘ ఆహ్వాన్ని మన్నించడంతో మొదలైన చర్చ  `స్వేచ్ఛావాదు’ల, `ప్రగతివాదు’ల నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రణబ్ ముఖర్జీ కూడా తనపై వచ్చిన విమర్శలు, నిందలకు హుందాగా ప్రతిస్పందించారు. నాగపూర్ కార్యక్రమంలో ఉపన్యాసమే తన సమాధానమని చెప్పారు. ఆయన చూపిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మేము ఆహ్వానిస్తున్నాము.