Home Telugu Articles `కల్లోల రాజకీయ పరిస్థితి’ చర్చ్ కే ఎందుకు కనిపిస్తోంది?

`కల్లోల రాజకీయ పరిస్థితి’ చర్చ్ కే ఎందుకు కనిపిస్తోంది?

0
SHARE
Representative Image

ప్రస్తుత బిజెపి ప్రభుత్వమే తిరిగి 2019లో అధికారం చేపడితే `అప్పుడు ఇక నాలాంటి వారు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవనం గడపడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి, రాష్ట్రానికి గవర్నర్, ప్రధాన సైనికాధికారి మొదలైన ఉద్యోగాలు మాకు రావు’ అని మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ జూలియో రెబెరో అన్నారు. (టైమ్స్ ఆఫ్ ఇండియా, మే, 28,2018)

కర్ణాటక ఎన్నికల ముందు ఢిల్లీ రోమన్ కాథలిక్ ఆర్చ్ బిషప్ అనిల్ క్యుటో `దేశంలో రాజకీయ పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని, దేశ ప్రజాస్వామ్య, సెక్యులర్ వ్యవస్థ ప్రమాదంలో పడిందని కనుక క్రైస్తవులంతా ప్రతి శుక్రవారం ప్రార్ధనలు చేయాలని’ కోరుతూ రాసిన బహిరంగ లేఖను రెబెరో సమర్ధించారు. కానీ తన లేఖ గురించి సర్వత్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన ఆర్చిబిషప్ తాను ప్రస్తుత మోదీ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ 2019 ఎన్నికల గురించి ఆ లేఖలో చేసిన ప్రస్తావన అసలు విషయాన్ని చెప్పకనే చెపుతోంది.

జూలియో రెబెరో ప్రముఖ, సమర్ధ  పోలీసు అధికారిగా అందరి మన్ననలు అందుకున్నవారు. అనేక ఉన్నత పదవులు పొందినవారు, వృత్తినైపుణ్యానికి, రాజ్యాంగబద్ధతకు మారుపేరుగా నిలిచినవారు. ఇదే రెబెరో గతంలో (మార్చ్ 17,2015) ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వ్రాసిన ఒక వ్యాసంలో “`హిందూ రాష్ట్ర వాదుల’ మూలంగా క్రైస్తవుడినైనందుకు సొంత దేశంలోనే  ఎవరికి పనికిరాని, గుర్తింపులేని, భద్రతలేని వాడిని అయ్యాను’’ అంటూ బాధను వెళ్ళగక్కారు. అప్పట్లో డిల్లీలో పాఠశాలలు, చర్చ్ లపై జరిగిన దాడుల గురించి ఆయన అందులో ప్రస్తావించారు. అయితే పశ్చిమ బెంగాల్ లో కూడా అలాంటి సంఘటనలు జరిగిన రెబెరో బిజిపి నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసు విచారణ సాగుతోందని, అది పూర్తి అయ్యేవరకు ఓపిక పట్టాలనే విషయాలను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అప్పుడు శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.

చర్చ్ దాడులలో ఏ హిందూ సంస్థ పాత్ర లేదని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలిన తరువాత మాత్రం రెబెరో పూర్తి మౌనం వహించారు. కొద్దిమంది నేరస్తులు వ్యక్తిగత ద్వేషం, పాత పగలవల్ల ఈ దాడులకు పాల్పడ్డారని తేలినా రెబెరో మాత్రం తన తప్పును అంగీకరించి `క్షమాపణలు’ చెప్పలేదు. పోలీసు దర్యాప్తు వివరాలను ప్రకటించిన డిల్లీ డెప్యూటీ కమిషనర్ జాయ్ టిర్కి కూడా క్రైస్తవుడే. అయినా తన ఆరోపణలను ఉపసంహరించుకునేందుకు రెబెరో ఏమాత్రం ప్రయత్నించలేదు.

జూన్ 2015లో షెడ్యూల్ కులాలకు చెందిన క్రైస్తవమతం పుచ్చుకున్న కొందరు భారత్ లోని కాథలిక్ చర్చ్ లో తాము కులవివక్షకు గురవుతున్నమని, దీనికి కారణం వాటికన్ విధనాలేనంటూ ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశారు. దళిత క్రైస్తవ విముక్తి ఉద్యమం (DCLM), విధుతలై తమిళ్ పులిగల్ కట్చి(మానవహక్కుల ఉద్యమకారులు)లతో కూడిన 22మంది ఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి భారత, భూటాన్ సమాచార కేంద్రంలో ఫిర్యాదు దాఖలు చేశారు.  కానీ అటు రెబెరోగానీ, అనిల్ క్యుటో గాని తమ తోటి క్రైస్తవులకు మద్దతుగా గొంతువిప్పలేదు. కాథలిక్ చర్చ్ తమ మానవ హక్కులను హరిస్తోందన్న వారి వాదనను వినిపించుకోలేదు.

తమిళనాడులో షెడ్యూల్ కులాలకు చెందినవారిపట్ల చర్చ్ చూపుతున్న వివక్ష గురించి జూన్, 2015లో రాష్ట్ర మైనారిటీ కమిషన్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వివిధ దళిత క్రైస్తవ సంస్థలకు చెందిన ప్రతినిధులు చర్చ్ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చాలా మటుకు జిల్లాల్లో 70 శాతం క్రైస్తవులు షెడ్యూల్ కులాలకు చెందినవారే ఉన్నప్పటికీ అక్కడ కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న `అగ్రవర్ణ’ క్రైస్తవుల మాటే చెల్లుబాటు అవుతోందని వారు ఆరోపించారు. క్రైస్తవ మిషనరీలు నడుపుతున్న పాఠశాలల్లో కూడా దళిత క్రైస్తవ విధ్యార్ధులను చేర్చుకోవడంలేదని ఒక దళిత క్రైస్తవ సంస్థకు చెందిన క్రిస్టఫర్ ఫిర్యాదు చేశాడు.

2010 సెప్టెంబర్ లో భారత్ లో షెడ్యూల్ కులాలవారు క్రైస్తవమతం పుచ్చుకున్నప్పటికీ `కులాన్ని’ తప్పించుకోలేకపోతున్నారని బీబీసి ఒక కధనం ప్రచురించింది. తమిళనాడు తిరుచ్చి పట్టణంలో కాథలిక్ శ్మశానవాటికలో అడ్డంగా కట్టిన గోడ గురించి ఆ కధనంలో పేర్కొంది. షెడ్యూల్ కులాలకు చెందిన క్రైస్తవులు గోడకు ఒక పక్కన సమాధులు కట్టుకుంటే, మరో పక్క ఉన్నత కులాలకు చెందినవారు సమాధులు నిర్మించుకుంటారు. రెబెరోగానీ, మతం పుచ్చుకున్న ఆయన ఉన్నత కులస్తులుగానీ ఈ వివక్ష గురించి ఏమి మాట్లాడరు. వారికి కాథలిక్ చర్చ్ అనుసరిస్తున్న ఈ పద్దతి ఏమాత్రం  అవమానకరంగా తోచదు.

ఇలాంటి సంఘటనలు, సందర్భాలు చూస్తే అసలు కాథలిక్ చర్చ్ మత సంస్థేనా అని అనుమానం వస్తుంది. కాథలిక్ చర్చ్ కి సుదీర్ఘమైన, వివాదాస్పదమైన రాజకీయ చరిత్ర ఉందని అందరికీ తెలుసు. రోమానస్ పొంటిఫెక్స్ (1454), ఇంటర్ సెటెర (1493) అనే రెండు పోపు ఆదేశాల ద్వారా స్థానిక జాతుల భూములను స్వాధీనం చేసుకున్న చర్చ్ వాటిని క్రైస్తవ సామ్రాజ్యంగా ప్రకటించింది. రోమానస్ పొంటిఫెక్స్ ఆదేశాలను (పాపల్ బుల్) పాప్ నికోలస్ V అప్పటి పోర్చుగల్ రాజు అల్ఫోంసో V కు జారీచేస్తూ ఆఫ్రికాలో కేప్ బోజడోర్ కు దక్షిణాన ఉన్న అన్నీ భూములు రాజుకు చెందుతాయని పేర్కొన్నాడు.

ఇంటర్ సెటెరను పాప్ అలెగ్జాండర్ VI కాస్టైల్ కు చెందిన ఫెర్డినాండ్, ఈసబెల్లా లకు రాసిచ్చాడు. దీనితో ఆఫ్రికన్ వాసుల భూములు ఆక్రమించుకుని, మతం మార్చి, వారిని బానిసలను చేసే అధికారం స్పైన్ కు దక్కింది.

ఈ పోపు ఆదేశాలను ధిక్కరించడానికి, ప్రశ్నించడానికి ప్రయత్నించినవారిని `సర్వశక్తిమంతుడైన దేవుదూ, పేటర్, పాల్ ల ఆగ్రహానికి గురికావద్దని’ హెచ్చరించేవారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా పాప్ ఫ్రాన్సిస్ పై ఒత్తిడి వస్తోంది.

యూదులపై తీవ్ర వ్యతిరేకతే కాథలిక్ అసహనానికి, నిరంకుశత్వానికి కారణమంటారు డేవిడ్ కేర్ట్ జర్. ఇటలీకి చెందిన నిరంకుశ పాలకుడు బెనిటో ముస్సోలిని తో పోప్ పయస్ XI కి ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలుసు.  ప్రపంచంలో మొట్టమొదటి ఫాసిస్ట్ ఉద్యమం ఇటలీలో వచ్చింది. దీనికి కారణం దేశంలో 99 శాతం కాథలిక్ లు ఉండడం, పోప్ ఆ దేశంలోనే ఉండడమని పరిశీలకులు చెపుతారు. స్లోవక్ రిపబ్లిక్ (1939-45), క్రొయేషియా (1941-45)ల్లో `మతగురువుల ఫాసిస్ట్’ పాలన రావడానికి కారణం అవి రెండూ  కాథలిక్ దేశాలు కావడమే. ఇక ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ఫాసిస్ట్ ఉద్యమాలు రోమన్ కాథలిక్ చర్చ్ ఆశీర్వాదంతోనే బలపడ్డాయి.

కాబట్టి జూలియో రెబెరో ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి రాజకీయ ఆక్రమణవాదాన్ని వ్యాప్తిచేసే కాథలిక్ చర్చ్ కు వత్తాసు పలుకుతున్నారో ఆయనకే తెలియాలి. పైగా ఇదంతా ఆయన మత విశ్వాసాలు దెబ్బతినడం వల్లనేనంటున్నారు.  పోప్ వ్యవస్థ సాగిస్తున్న ఈ సామ్రాజ్యవాద విధానానికి మద్దతుగా ఆయన మాట్లాడటం `హిందూ దేశపు’ గొప్ప సాంస్కృతిక భిన్నత్వాన్ని, సహనశీలతను కించపరచటమే.

– డా. బి.ఎస్. హరిశంకర్

విజయవాణి సౌజన్యంతో