Home News ‘త్రిపురాసుర’ సంహారం!

‘త్రిపురాసుర’ సంహారం!

0
SHARE

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు కొందరికి విస్మయాన్ని కలిగించాయి. ముఖ్యంగా కమ్యూనిస్టులకు కంచుకోట అయిన త్రిపుర రాష్ట్రంలో భాజపా స్పష్టమైన మెజారిటీ సంపాదించి మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ‘కామ్రేడ్ల’ రాజ్యంలో ఇది ఎలా జరిగింది? భారతదేశ చరిత్రలో త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ మూడు కమ్యూనిస్టు ప్రాధాన్యం కలిగిన రాష్ట్రాలు. త్రిపురకు సరిహద్దు దేశంగా బంగ్లాదేశ్ వుంది. అంటే త్రిపురలో వంగభాషీయుల సంఖ్య గణనీయంగా వుంది. ఈ చిన్న రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా సిపిఎం ప్రభుత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ నిరాడంబరుడు, మచ్చలేని రాజకీయ నేత. ఆర్థిక ప్రలోభాలు లేనివాడు అని విస్తృత ప్రచారం జరిగింది. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 3 వేల రూపాయలు! సీఎం పదవిలో తనకు నెలనెలా వచ్చే జీతభత్యాలను పార్టీకి విరాళంగా ఇచ్చి, వ్యక్తిగత ఖర్చులకు గాను కేవలం ఐదువేలు మాత్రమే తీసుకుంటూ వుంటాడు. ఇలాంటి ఆదర్శ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న రాష్ట్రంలో భాజపా ఎలా ఘన విజయం సాధించగలిగింది? ఇది చాలా లోతుగా అనే్వషింపవలసిన విషయం.

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో నాగాలాండ్, మేఘాలయ కూడా వున్నాయి. వీటిని చైనా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. అందువల్ల భాజపా తన సమస్త శక్తులు ఒడ్డి ఎన్నికల సమరంలో పాల్గొన్నది. త్రిపురలో పైకి కనబడుతున్న తెరను తొలగించి చూస్తే, చాలా రహస్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1917వ సంవత్సరంలో రష్యాలో సాయుధ విప్లవం జరిగాక, స్టాలిన్ తన ప్రత్యర్థుల్ని హతమార్చడం మొదలుపెట్టాడు. స్థానిక రష్యన్ సంస్కృతిని నిర్మూలించాడు. అక్కడ క్రైస్తవ ప్రార్ధనా మందిరాలను నేలమట్టం చేశారు. దీనికి ‘స్టాలిన్ కల్చర్’ అని పేరు. సరిగ్గా త్రిపురలో ఇదే జరిగింది. సిపిఎంలోని ప్రత్యర్థి వర్గం నాయకులను మాణిక్ సర్కార్ వర్గం మట్టుపెట్టింది. ఈ సందర్భంగా 1998లో జరిగిన ఆనంద మోహన రాజా హత్యోదంతం ప్రముఖంగా చెప్పుకోదగ్గది. ఇతడు సిపిఎం ఎంఎల్‌ఏ. ఆ తరువాత బిమల్ సిన్హా, ఆయన సోదరుడు విద్యుత్ సిన్హా హత్య చేయబడ్డారు. 1998 తరువాత అక్కడి హిందూ సామాజిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. డిసెంబర్ 2016లో చంద్రమోహన్ హత్య చేయబడ్డాడు. మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ స్కామ్ బయటికి రాగానే సిపిఎం కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడ సామూహిక అత్యాచారాలు (గ్యాంగ్ రేప్స్) క్రమక్రమంగా పెరగసాగాయి. మొత్తం 2,013 కేసులను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నమోదు చేసింది. ‘నేషనల్ లిబరేషన్ ఆఫ్ త్రిపుర’ అనే ఉగ్రవాద సంస్థ సహాయంతో మాణిక్ సర్కార్ ప్రభుత్వం ఈ హత్యా రాజకీయాలకు దిగింది.

బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను మాణిక్ సర్కార్ ప్రభుత్వం ప్రోత్సహించింది. కొద్దిరోజుల క్రితం సమర్ అనే ఒక సిపిఎం కార్యకర్తకు సంబంధించిన వీడియో క్లిప్ వెలుగు చూసింది. అందులో కరెన్సీ కట్టలున్న పరుపుమీద సమర్ పడుకున్నాడు. ‘నా సంపద కోటి రూపాయలకు పెరుగుతుంది, చూడండి..’ అంటూ అతడు చెప్పిన మాటలు ఆ వీడియో క్లిప్పింగ్‌లో ఉన్నాయి. రిగ్గింగ్‌తోనూ, పోలింగ్ బూత్‌ల స్వాధీనంతోనూ ప్రత్యర్థులను భయపెట్టి వారిని ఎన్నికల బరి నుండి తప్పించడంలో ఆరితేరిన మాణిక్ సర్కార్ ప్రభుత్వం ఇనే్నళ్ళు అధికారంలో కొనసాగుతూ వచ్చింది.

2014 తరువాత ఒక పరిణామం జరిగింది. సునీల్ దేవధర్ అనే జాతీయవాది మహారాష్ట్ర నుండి త్రిపురలోకి ప్రవేశించాడు. ఆయన తన వెంట కార్యకర్తల బృందాన్ని కూడా తీసుకొనివచ్చాడు. ఒక్కొక్క కార్యకర్తకు 60 పేర్లు ఇచ్చారు. ఇలా 60 మందిని ఒక కార్యకర్త వెళ్లి కలుస్తూ వుంటాడు. దీనికి ‘పన్నా పేపర్’ అని పేరు. త్రిపురలో జరుగుతున్న అన్యాయాలు, హత్యాకాండలను సామాన్యుల దృష్టికి తీసుకొని రావడంలో సునీల్ దేవధర్ కృతకృత్యుడయ్యాడు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వేసుకున్న ‘సత్పురుషుడు’ అనే ముసుగును సునీల్ దేవధర్ తొలగించాడు. ఇది భాజపా ఘన విజయానికి ఎంతగానో తోడ్పడింది. దీనికితోడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ఈశాన్య రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా నియమితుడు కావడం కూడా కలసివచ్చింది. ఆయన రాత్రింబవళ్లు పరిశ్రమించి త్రిపుర, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పార్టీ విజయానికి తోడ్పడ్డారు. ఇంతటి విజయానికి తోడ్పడ్డ మరొక వ్యక్తి పేరు హేమంత్ విశ్వాస్ శర్మ. ఒకప్పుడు ఇతడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ దర్శనానికి వెళ్లినపుడు- ఆయన ఒక కుక్కపిల్లతో ఆడుకుంటూ హేమంత్ విశ్వాస్ ముఖం చూడడానికి నిరాకరించాడు. దీంతో హేమంత్ కాంగ్రెస్‌ను వీడి, భాజపాలో చేరాడు. పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్, సీపీఎంల పరాజయానికి హేమంత్ విశ్వాస్ గణనీయంగా తోడ్పడ్డాడు.

కొందరు ప్రముఖులు సైతం ఒక్కోసారి చారిత్రక తప్పిదాలు చేస్తూ వుంటారు. అందుకు వారు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ అలనాడు కాసు బ్రహ్మానందరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసింది. అందుకు మర్రి చెన్నారెడ్డి తిరగబడి తెలంగాణ ఉద్యమాన్ని 1969లో నడిపి బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాడు. ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు ఒక రాజ్యసభ సీటును ఆశించాడు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నిర్మూలించాడు. చంద్రబాబు నాయుడు నుండి తాను ఆశించిన పదవి లభించకపోవడంతో కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. సరిగ్గా హేమంత్ విశ్వాస్ విషయంలో రాహుల్ గాంధీ కూడా ఇలాంటి చారిత్రక తప్పిదం చేశాడు. ఫలితంగా ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నరేంద్ర మోదీ ఆశయాన్ని సాధించడంలో హేమంత్ విశ్వాస్ ఈశాన్య భారతంలో కీలక పాత్రను పోషించడం విశేషం.

ఇప్పుడేం జరగబోతోంది?

త్రిపురను కోల్పోవడం ద్వారా భారతదేశ చరిత్రలో ఒక్క కేరళలో మాత్రమే ఇపుడు కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం మిగిలింది. సైద్ధాంతికంగా అటు సామ్యవాదానికి, ఇటు సాంస్కృతిక జాతీయ వాదానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో సిపిఎం త్రిపుర రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. పురాణాల్లో త్రిపురాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు లోక కంటకుడుగా ఉండడంతో పరమశివుడు ఆయనను సంహరించినట్లు ఒక కథ వుంది. త్రిపురలో మాణిక్ సర్కార్ కానివ్వండి, కేరళలో పినరయ్ విజయన్ కానివ్వండి.. అక్కడి పాలకులు భారత జాతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ దేశానికి సహజమైన, చారిత్రకమైన, సనానతమైన జీవధారను నిర్మూలించాలన్న కృషి జరిగింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ నాటాలని వారు విశ్వప్రయత్నం చేశారు. త్రిపురలో జాతీయోత్సవాల సందర్భంగా దీపారాధన జరుగదు. సంప్రదాయ పద్ధతిలో పూజలు ఉండవు. వేద మంత్రాలు వినబడవు. దేవాలయాలపై ప్రభుత్వ ఆధిపత్యం వుంటుందే కానీ వాటి అభివృద్ధికి పార్టీ కార్యకర్తలు తోడ్పడరు. త్రిపురలో మాణిక్ సర్కార్, కేరళలో విజయన్ ఇదే ధోరణిని అవలంబించారు. కేరళలో ఓనం ఉత్సవాలు జరుగకుండా విజయన్ ఆంక్షలు విధించడం ఇటీవలి చరిత్ర.

త్రిపురలో సిపిఎం ప్రభుత్వం గద్దె దిగడం ఒక చారిత్రిక సంఘటన. ఈ ప్రభుత్వం ఆర్టికల్-356 కింద రద్దు చేయబడలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఓటర్లే మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించారు. తిరిగి అక్కడ సిపిఎం ప్రభుత్వం అధికారంలోకి రావడం అంత సులభమైన పని కాదు. సీపీఎం నేత ఏచూరి సీతారామ్ తనకు మూడవసారి రాజ్యసభ సభ్యత్వం రాలేదని అలిగినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంటే- కమ్యూనిస్టు నేతల అంతర్గత విభేదాలు వారికి తెలియకుండానే భాజపా విజయానికి పరోక్షంగా తోడ్పడ్డాయని భావించవలసి వస్తుంది.

త్రిపురలో అధికారంలోకి రాబోయే భాజపా ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా మాణిక్ సర్కార్ కాలంలో జరిగిన అవినీతిని, కుంభకోణాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లయితే ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలు భారత ప్రజలకు తెలిసే అవకాశం వుంది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోల్చినపుడు త్రిపుర చాలా చిన్న రాష్ట్రం. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఒకటి రెండు సార్లు ఆ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు జరిపించి మాణిక్ సర్కార్ అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సఫలీకృతుడైనాడు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు దిక్సూచిగా కనబడుతున్నాయి.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668

(ఆంధ్రభూమి సౌజన్యం తో)