Home News పాత పంటలతో జీవ వైవిధ్యానికి పునరుజ్జీవనం ఇస్తున్న మహిళలు

పాత పంటలతో జీవ వైవిధ్యానికి పునరుజ్జీవనం ఇస్తున్న మహిళలు

0
SHARE

మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకలమీద తిరుగుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్థకత చేకూరుతోంది. అందుకే ఒకప్పటి పచ్చ జొన్నల గట్క మళ్లీ రారమ్మని పిలుస్తోంది. ఆనాటి రాగిజావ తిరిగి కళ్లముందు కదలాడుతోంది. కనుమరుగైన సామపాశం మల్లీ సాహో అంటోంది. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు మిర్రిమిర్రి చూస్తున్నాయి. ఈ తరానికే తెలియని నూనె పోలెలు నున్నగా కవ్విస్తున్నాయి.

ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి. సన్నబియ్యం, బాసమతి రైస్ తినడమే స్టేటస్ అనుకునే రోజులు పోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్న సరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామబియ్యం తింటే చలువ అని జనానికి అర్థమైంది. చలికాలం కొర్ర బువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. పజ్జొన్న రొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే చైతన్యం వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత పంటల అన్నం దొరుకుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఝరాసంగం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా చిరుధాన్యాల మీద పిహెచ్‌డి స్టూడెంట్‌కి సరిపోయేంత మెటీరియల్ చెప్తాడు. నల్లవడ బియ్యం ఎందుకు తినాలో పోచయ్య అనే రైతు చెప్తుంటే ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది.

జొన్నలంటే మనకు ఎరుకైంది మహా అయితే రెండు మూడు రకాలు. కానీ అందులోనూ పది రకాల వెరైటీలున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతాం. మొక్కజొన్న, పచ్చజొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న, తెల్లమల్లె జొన్న, రికపచ్చల జొన్న, గుండుశాయి జొన్న, తోక జొన్న, ఎర్రశాయి జొన్న, పేలాల జొన్న- ఇలా పది రకాల జొన్నలుంటాయి. ఈ తరం కోడళ్లకి అవిశెలు ఎలా వుంటాయో తెలియదు. ఆమాటకొస్తే వరినాటు ఎలా వేయాలో కూడా అర్థం కాదు. మలీద ముద్దల పేరు చెప్తే నోరెళ్లబెడతారు. వాణిజ్య పంటలు అవసరమే. కానీ తినే పంటలు కూడా కావాలి. ఆ విషయంలో రైతుకి అవగాహన తేవడంలో సొసైటీ విజయం సాధిస్తోంది. కమర్షియల్ క్రాప్‌కి ఏ మాత్రం తగ్గకుండా చిరుధాన్యాలతో ఎంత లాభాలను పొందవచ్చో ఊరూరూ తిరిగి రైతులకు చెప్తుంటారు. మైక్ పట్టుకుని ఉపన్యాసం దంచితే రైతులు ఎవరూ వినరు. అందుకే ప్రతీ పంటమీద ఒక పాట శ్రుతి చేసుకుంటుంది. ప్రతీ ధాన్యంమీద చెక్క్భజన అలరిస్తుంది. రైతులకు ఏ రూపంలో చెప్తే అర్థమవుతుందో ఆ రూపాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి కళారూపాల ప్రచారం ఫలితంగా జహీరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో చిరుధాన్యాల సాగు గణనీయంగా పెరిగింది. వానాకాలం, యాసంగి పంటలన్నీ చిరుధాన్యాలే. అందుకోసం ప్రత్యేకంగా విత్తన బ్యాంకులు ఏర్పాటుచేసుకున్నారు.

జహీరాబాద్, కొహిర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాలకల్, మొగ్దంపల్లి మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లోని విత్తన బ్యాంకులన్నీ మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ విత్తనాల ద్వారా సుమారు 15 వేల ఎకరాల సాగు చేస్తుంటారు. ఒక్కో రైతు పదికిపైగా పాత పంటలను పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే వాణిజ్య పంటలే అన్న భావన ఇక్కడి రైతుల్లో పోయింది. మిర్చిని మాత్రమే లాభసాటి పంటగా చూసే రైతు సజ్జలు పండిస్తూ సంతోషాన్ని ప్రకటిస్తున్నాడు. చిరుధాన్యాలకు మించిన చిరునవ్వుల వ్యవసాయం మరోటి లేదని నిండు మనస్సుతో నమ్ముతున్నాడు.

చిరుధాన్యాల చిరునవ్వుల సాగు

అక్కడ ప్రతీ ఊళ్ళో, ప్రతీ తండాలో ఒక కోడళ్ల సంఘం ఉంటుంది. అంటే, అత్తలు కోడళ్లకు పాతతరం వ్యవసాయ పద్ధతులను, ఆహారపు అలవాట్లను నేర్పిస్తారు. ఒకరకమైన వారసత్వ మార్పడి జరుగుతోందక్కడ. అస్తిత్వం పొల్లుపోవడం లేదు. శతాబ్దాలపాటు ఉనికి అలాగే వుంది. కనుమరుగు అవుతున్న చిరుధాన్యాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ 20 ఏళ్ల సంకల్పం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ధ్వంసమైన జీవ వైవిధ్యం ఊపిరిపోసుకుంది. పురుగుమందుల వ్యవసాయం సంప్రదాయ బాట పట్టింది. చిరుధాన్యాల సాగుపై వారు గ్రామ గ్రామాన తిరిగి చైతన్యం తెస్తారు. ఏటా సంక్రాంతి నాకు పాత పంటల జాతర ఏర్పాటుచేస్తారు. దేశ విదేశాల నుండి అతిథులు వచ్చి పాత పంటల జాతరలో పాల్గొంటారు. సుమారు 30 రకాల సంప్రదాయ చిరుధాన్యాలు కచ్చురబండ్లమీద సందడి చేస్తాయి.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)