Home News భారతీయత ఆధారిత ఆర్థికనమూనా

భారతీయత ఆధారిత ఆర్థికనమూనా

0
SHARE

ఇటీవలే ముగిసిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో, దేశంలోని బహుసంఖ్యాక ప్రజలకు నూతన ఉద్యోగావకాశాలు, మరియు జీవనోపాధి అవకాశాలు అన్వేషించాలని తీర్మానించారు. ఈ మధ్య సంభవించిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వలన అతలాకుతలమైన జీవనోపాధి రంగంలో, భారతీయత ఆధారంగా ఒక నూతన ఆర్థిక నమూనాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నమూనా ఎలా ఉండాలంటే, పెరుగుతున్న ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలు మరియు సేవా, సహాయ రంగాలలో భారతదేశ స్వావలంబన ఆధారంగా తయారుచేయాలి. ఆర్.ఎస్.ఎస్. లోని మేధావి వర్గం, మనదేశం లోని మానవవనరులను నిరంతరం విస్తరిస్తూ, లాభసాటి అయిన ఉపాధి కల్పించటంలో, మన స్వంత, స్థిరమైన పరిష్కారాలను సూచిస్తూ వస్తున్నది. ఇంకా, భారతీయత ఆధారంగా జరిగే దేశాభివృద్ధి, ఇక్కడ సమృద్ధిగా ఉన్న సహజమైన, మానవవనరులను ఒక న్యాయమైన, స్థిరమైన పద్ధతిలో వినియోగించుకుంటే, సులభం అవుతుంది.  ఆర్.ఎస్.ఎస్. కొన్ని దశాబ్దాలుగా, యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మొదలైన సుగుణాలను పెంపొదించుతూ వస్తున్నది. ఈ రెండు జాతినిర్మాణ సుగుణాలే, భారతీయత ఆధారంగా జరిగే దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

భారత్ లోని సహజరంగం ఇక్కడి ప్రజలకు నిత్యజీవనోపాధి ద్వారా ఒక స్థిరమైన ఆదాయం కల్పించేందుకు అపారమైన అవకాశాలను కల్పిస్తున్నది. భారతదేశంలోని పర్యావరణసంబంధమైన చేతివృత్తులు, హస్తకళలు, నేతపని సంప్రదాయాలే ఒకప్పుడు భారత్ ను సంపన్నదేశంగా నిలబెట్టాయి. క్రీ.శ.23 నుండి 79 వరకు ఉన్న ఒక రోమన్ అధికారి, గ్రంథకర్త అయిన Pliny అనే ఆయన – భారతీయవ్యాపారులు తమ చేతివృత్తుల, హస్తకళల వస్తువులను విక్రయించి, అందుకు ప్రతిగా బంగారం తీసుకెళ్ళేవారు – అని వ్రాశారు. వాస్తవంగా, భారతదేశంలోని కుటీరపరిశ్రమలలో తయారైన నాణ్యమైన హస్తకళల వస్తువులు, చేనేత వస్త్రాలు, బంగారం కంటే అత్యంత విలువైనవి అని చెప్పవచ్చు. దేశంలో గల సంగ్రహాలయాలలో భద్రపరచబడిన ఉత్తమ హస్తకళల, చేతివృత్తుల వస్తువులు, భారతీయ హస్తకళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతల మూలంగా, అతిసాధారణ వస్తువులనుండి తయారుచేసి, అధికవిలువ పొందేటట్లు చేయటాన్న, నిరూపిస్తాయి. ఒరిస్సాలోని ఒక పట్టాచిత్ర కళాకారుడు, ఒక 50 చ.అ. సాధారణపట్టా (వస్త్రం)ను ఒక విలువైన, నాణ్యమైన కళాఖండంగా తన కళానైపుణ్యంతో  మార్చగలడు, అది సుమారుగా రూ.ఒక లక్ష వరకూ అమ్ముడు పోగలదు. అలాగే, లక్నోకి చెందిన చికంకారీ కళాకారుడు కానీ, లేక పిపిలీలోని  కలంకారీ కళాకారుడు కానీ, 60 కుట్లు, అల్లికల నమూనాలను ఒక వస్త్రంపై కవితల రూపంలో ప్రదర్శించగలడు. ఇలా తయారైన  కళావస్త్రం, విదేశీ చేతివృత్తుల మార్కెట్లో అధికధరను సంపాదిస్తుంది. ఛత్తీస్ గఢ్ లోని గిరిజనకళాకారులు ఇనుప, కొయ్య వస్తువులపై, మనలను మంత్రముగ్ధులను చేసే అపురూపమైన కళాత్మకతను ప్రదర్శించి, బంగారం కంటే విలువైన వస్తువులను తయారుచేయగలరు. కానీ దురదృష్టవశాత్తూ, ఛత్తీస్ గఢ్ లోని వామపక్ష తీవ్రవాద (నక్సలైట్) ఉద్యమం గిరిజనులలో అటువంటి అమూల్యమైన హస్తకళల నైపుణ్యాన్ని నాశనం చేసింది. భోపాల్ కు చెందిన బటువా కళానైపుణ్యం కానీ, గుజరాత్ లోని బంధని పూసలతో చేతివృత్తులు కానీ, ఆదిలాబాద్, ఒడిషాలలో ధోక్రా హస్తకళలు, బీదర్ కు చెందిన బిద్రీవేర్, కాశ్మీర్ లోని  కాగితపు గుజ్జుతో తయారైన వస్తువులు, మరియు తివాచీల ప్రదర్శన, రాజస్థాన్ లోని కొయ్య మరియు దంతపు వస్తువులు, అస్సాం, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడీషా లలోని నేతవస్త్రాలు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. పాశ్చాత్యసంస్కృతి వలన వచ్చే ప్రతికూలప్రభావం, వినియోగదారుల చైతన్యం, బజారులో సులభంగా దొరికే చౌకప్లాస్టిక్, ఇంకా అలంకరణసామగ్రి ఇత్యాదులు చేతివృత్తుల, హస్తకళలపై ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఆయా రంగాలలోని భారతీయ కళాకారులు తమ కళలకు, నైపుణ్యానికి పదును పెట్టి, అందమైన, నాణ్యమైన వస్తువులను సమాజానికి అందిస్తూనే ఉన్నారు.

ప్రపంచమంతటా ఇప్పుడు పర్యావరణంతో మమేకమయ్యే చేతివృత్తుల, హస్తకళల తయారీకి ప్రాధాన్యం పెరుగుతూనే ఉన్నది. ఐ‌సి‌ఎం‌ఏ ఆర్.సి. నివేదిక ప్రకారం ఇప్పుడు విశ్వవిపణిలో చేతివృత్తుల, హస్తకళల అమ్మకాల ప్రాధాన్యం 680.10 అ.డాలర్ల నుండి 1252 బిలియన్ డాలర్ల వరకూ పెరిగింది. భారతదేశం ఇప్పుడు ఇటువంటి చేతివృత్తుల, హస్తకళల కళాత్మకత, నైపుణ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నట్లయితే, దానికి తగిన ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతుంది. ఎందుకంటే ఇదే చేతివృత్తులకు గల ఏకైక విక్రయ ప్రతిపాదన. భారతీయ కళాకారులు అతిసామాన్యమైన వస్తువులను, తమ తమ నైపుణ్యం, ఊహలు, సృజనాత్మకతలను రంగరించి, అధికధర పలికేటట్లు చేయగలరు.  చైనావాళ్ళు, అచ్చం భారత్ లో తయారైనట్లుగా ఉండే హస్తకళలను, చిత్రలేఖనాలను అనుకరించే వస్తువులను, వాళ్ళ యంత్రాలు, కంప్యూటర్ల సహాయంతో టన్నులకొద్దీ తయారుచేసి విక్రయించేందుకు విశ్వవిపణిలో పెట్టినప్పటికీ, అవన్నీ కూడా, భారతీయ కళాకారుల చేతులలోని సహజమైన నైపుణ్యత, సృజనాత్మత, కళాత్మకతలతో తయారైన మేలిమి వస్తువులతో పోటీపడలేవు. కేవలం సహజమైన కళాకారులు మాత్రమే, తమ ఊహలు, సృజనాత్మకతలతో జీవంలేని వస్తువులలో సైతం జీవం పోయగలరు. ఒక ఒడిస్సీ చిత్రకారుడు, ఇంకా ఒడిస్సీ రాతిశిల్పాలను చేసే కళాకారులు, తమతమ శిల్పాలలో అనురాగం, క్రోధం, కరుణ వంటి గుణాలను అబ్బురపరచేవిధంగా తయారుచేయగలరు. అతివిలువైన చిత్తూరు గ్రానైట్ రాతిశిలలను తీసుకువెళ్లి, అరబ్బు దేశాలలోని హోటళ్లు, కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఇటువంటి శిలలు ఆయా దేశాలలో అక్కడి కళాత్మకతను ఇనుమడింపజేస్తాయి. భారతీయ కళాకారులు భారత్ లోని రాతిశిలలను అద్భుతంగా మలిచి, దేశ, విదేశాలలో ఎక్కువ ధర పలికేటట్లు చేస్తున్నారు. ప్రాచీనకాలంలో భారత్ ను బంగారుబాతు అనేవాళ్లు, ఎందుకంటే, ప్రకృతిలో దొరికే అనేక సాధారణ వస్తువులకు సైతం, ఎక్కడైనా అధికధర లభ్యం అయ్యేది.

భారతదేశంలోని చేతివృత్తుల వలెనే, అన్యదేశాల స్థానిక ఆహారాలకు కూడా ఇది బంగారుగని వంటి నిలయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఏకసంస్కృతి మరియు అధిక సబ్సిడీ ఆధారిత – నిలకడలేని సాగు పద్ధతుల వత్తిళ్ల వలన,  ఆహారసమృద్ధి, నిల్వలు  తగ్గుముఖం పడుతున్నది. కానీ, భారతదేశం, తమ స్థానిక ఆహారపంటలలో తగినంత విస్తృతమైన జన్యుస్వచ్ఛత వలన, ఇంకా పైచేయి కలిగి ఉన్నది.

ఇటీవల ప్రచురింపబడిన ఒక ఐక్యరాజ్యసమితి నివేదికలో ఏమి చెప్పారంటే, – నేడు అరుదైన, అమూల్యమైన, జన్యువైవిధ్యం కలిగిన, ప్రియమైన జీవజాతులు అంతరిస్తున్నా, మానవాళికి అవసరమైన ఆహారసరఫరా, ఆరోగ్యం, భద్రత మొదలైన విషయాల్లో జీవవైవిధ్య విపత్తులను నియంత్రించటంలోనూ, ప్రపంచం విఫలమౌతున్నది, భారతదేశంలోని ప్రియమైన సస్యవైవిధ్యం (పంటల మార్పు) ప్రజల ఆహారసమృద్ధి మరియు పోషకావసరాలు తీర్చేందుకు వినియోగించవచ్చు. భారతీయులు తమతమ అపారమైన మేధోసామర్థ్యాన్ని విశ్వంలో నిత్యం ఉత్పన్నమయ్యే  అవకాశాలను పూరించేందుకు వినియోగించి, ఒక భారతీయ ఆధారిత అభివృద్ధి నమూనాను ఉద్భవింపజేయవచ్చు.

భారతదేశంలోని సుమారు 15 కోట్ల మంది రైతులు, 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు, కలిపి సంయుక్తంగా కృషి చేసినట్లయితే, స్థూల జాతీయోత్పత్తిలో 72% సహకారం అందించవచ్చు. 2018 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం, స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం 19.9%, అసంఘటిత కార్మికరంగం 52% సహకారం అందించాయి. దీర్ఘకాలం వ్యాపించిన కోవిడ్ మహమ్మారి ఈ అసంఘటితరంగాన్ని బాగా దెబ్బతీసింది. నిజానికి ఈ అసంఘటిత రంగంలోని  కార్మికులకు ఎటువంటి సహాయమూ అవసరం లేదు, వాళ్ళకు కావలసినది ఏమంటే, ఒక ఆరోగ్యకరమైన సామాజిక సాంస్కృతిక పర్యావరణం, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే సామాజిక కార్యకర్తలు, మంచి బ్యాంకులు, రక్షక భటులు, ఇంకా న్యాయమూర్తులు మొ||. మంచి పోలీసు సిబ్బంది, ఒక పారదర్శకమైన న్యాయవ్యవస్థ, పరిపాలనారంగంలో స్నేహపూర్వక సిబ్బంది వంటి సౌకర్యాలను కల్పించినట్లయితే, అసంఘటిత కార్మికరంగం కూడా భారత్ ను ‘ఈజ్ ఆఫ్ బిజినెస్’ లో అగ్రస్థానంలో నిలబెడుతుంది.

అసంఘటిత రంగంలోని కార్మికులు, రకరకాల తినుబండారాలు, జీవవ్యర్థాలు అధోకరణం చెందే ఉపకరణాలు, పట్టణీకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మత్స్యసంపదను పెంపొందించే కార్యాచరణలు, కిరాణా దుకాణాలు నడపటం, రెస్టారెంట్లు, ధాబాలు నిర్వహించటం, వందలకొద్దీ అటవీఉత్పత్తుల విక్రయం మొ|| అనేకరకాల కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తారు. వారిలో చాలామంది పేదవారు, నిరక్షరాస్యులు అయినప్పటికీ, వారి మెరుగైన పనితనం, అనుభవం, నైపుణ్యత, సృజనాత్మకతలతో మర్యాదగా, చక్కగా జీవించగలరు. భారతదేశము వ్యవసాయం, ఇంకా అసంఘటిత కార్మికరంగాలే కాకుండా, ఒక చైతన్యవంతమైన యాత్రికుల రంగం, పర్యాటకరంగం, వన్యప్రాణుల విహార/పర్యాటక రంగం, అటవీ రంగం, పశుసంవర్ధక రంగం, ఉద్యానవన రంగం మొ|| విషయాలలో విజయవంతమైన భారీ ఉపాధి అవకాశాలను సృష్టించగలదు.

కేంద్రప్రభుత్వం మనదేశంలో అనేకరంగాలలో ఆర్థికరంగ పరిపుష్టి కోసం రకరకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అమలుచేస్తున్నది. అందులో అందరినీ మరింత ఆకట్టుకునేవిధంగా సహజవ్యవసాయంలో శూన్యబడ్జెట్ ప్రవేశపెట్టటం వలన, వ్యవసాయవిధానంలో  ప్రపంచంలోనే ఒక పెనుమార్పుకు, నాంది పలికింది. వ్యవసాయమంత్రిత్వశాఖ వచ్చే అయిదేళ్లలో 12 లక్షల హెక్టార్లలో రూ.2500 కోట్ల పెట్టుబడితో, సహజ వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర బడ్జెట్ ప్రకారం, దేశం మొత్తంలో రసాయనరహిత వ్యవసాయం అమలు చేయాలని నిర్దేశించింది. ఒక సంబంధిత అవగాహన మరియు అంకితభావంతో గనక ఇటువంటి సహజరంగాల పర్యవేక్షణ జరిగినట్లయితే, భారత్ ఒక శక్తివంతమైన దేశంగా రూపొందుతుంది. భారతదేశానికి గల ఇటువంటి సహజమైన, స్వాభావిక శక్తి, సామర్థ్యాలచేత,  విశ్వమందున్న ప్రజలందరికీ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు ఆర్థిక అవసరాలను తీర్చి, మనదేశం శక్తివంతంగా నిలబెట్టగల అభివృద్ధికి, ఆదర్శమైన విశ్వనమూనా కాగలదు.

Source : ORGANISER

అనువాదం  : సత్యనారాయణ మూర్తి