Home News గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వాన్ని ఘనంగా జరుపుకోవాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్...

గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వాన్ని ఘనంగా జరుపుకోవాలి – ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ జోషి

0
SHARE

550 ఏళ్ల క్రితం 1526వ సంవత్సరంలో శ్రీ గురునానక్ దేవ్ జీ రాజ్ భోయ్ కి తల్వండీలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మాతా త్రిప్త, శ్రీ మెహ్తా కల్యాణ్ దాస్ జీ.

సమాజంలోని విఘటన, బలహీనతలను ఆసరా చేసుకుని విదేశీ దురాక్రమదారులు ఈ దేశపు మత, సాంస్కృతిక అస్తిత్వాన్ని సమూలంగా రూపుమాపడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. జ్ఞానం, భక్తి, సత్కర్మ వంటివి ఎంత అవసరమో తెలియజేస్తూ గురునానక్ జీ మహారాజ్ సామాజిక జాగృతికి దారి చూపారు. దిక్కుతోచని, గందరగోళ పరిస్థితిలో ఉన్న భారతీయ సమాజానికి కొత్త ఉత్సాహం, దారి కనిపించాయి.

చర్చ, సంవాదం ద్వారా సమాజానికి దారి చూపే ప్రయత్నం శ్రీ గురునానక్ దేవ్ జీ చేశారు. `ఉదాసీ’గా పిలిచే యాత్రలను ఆయన చేశారు. మొదట మూడుసార్లు ఆయన ముల్తాన్ (పాకిస్తాన్) నుంచి శ్రీలంక, లఖ్ పత్ (గుజరాత్) నుండి కామరూప్, ఢాకా(బంగ్లాదేశ్) వరకు వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించారు. నాలుగవ ఉదాసీ(యాత్ర) బాగ్దాద్, ఇరాన్, కంధహార్, డమాస్కస్, మిశ్ర్, మక్కా, మదీనా మొదలైన ప్రాంతాల్లో చేశారు. ఈ యాత్రాల్లో ఆయన సాధుసంతులు, యోగులు, సూఫీ, ఫకీర్, జైన, బౌద్ధ సన్యాసులను కలిసి వారితో తాత్విక చర్చలు జరుపుతూనే మతం పేరుతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయకూడదని తెలియజెప్పారు.

మతమౌఢ్య దురాక్రమణదారుడైన బాబర్ దాడుల్ని ఎదుర్కోవాలంటూ భారత జాతికి ఆయన పిలుపునిచ్చారు. `కీరత్ కర్ నామ్ జప్ వంద్ చ్చక్’ అంటే కష్టపడి పనిచేయండి, భగవంతుడిని నమ్మండి, ఇతరులతో పంచుకుని ఆహారాన్ని తీసుకోండి, అని ఆయన బోధించారు.

నేటికీ ఎంతో ముఖ్యమైన శ్రీ గురునానక్ దేవ్ జీ సందేశాన్ని అనుసరించి, ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ పర్వ్ ను ఘనంగా జరుపుకోవాలని యావత్ సమాజాన్ని, స్వయంసేవకులకు విజ్ఞప్తి చేస్తున్నాము .

– సురేశ్ జోషి, ఆరెస్సెస్ సర్ కార్యవాహ