Home Telugu Articles ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం!

ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం!

0
SHARE

బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.

జార్జిరెడ్డి జీవితం ఇతివృత్తంగా నిర్మించిన చలన చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానిని ప్రోమోట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా ఇటీవల `హన్స్ ఇండియా’ వంటి పత్రికలతో పాటు సామాజిక మాధ్యమ గ్రూపులలో అతనిని కీర్తిస్తూ వ్యాసాల పరంపర మొదలైంది. కొన్ని వ్యాసాల్లో అతడిని ఏకంగా సమాజోద్ధారకుడుగా అభివర్ణించారు.

ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి జీవితంలో మీడియా మనకు చూపని చీకటి కోణాన్ని మీ ముందుంచే ప్రయత్నం ఇది:

జార్జిరెడ్డి తల్లి కేరళ క్రిష్టియన్, తండ్రి చిత్తూరు ప్రాంతానికి చెందినవాడు. జార్జిరెడ్డి 8 ఏళ్ల వయసున్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ కుటుంబ పరిస్థితుల ప్రభావం అతడిపై తీవ్రంగా ఉండేది. 

ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి ప్రస్థానం:

1969-70 మధ్యకాలంలో అర్జెంటీనా మార్క్సిస్ట్  చేగువేరా అడుగుజాడల్లో నడవాలనుకునే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్ధులు కొందరు ఒక బృందంగా ఏర్పడ్డారు. వారికి జార్జిరెడ్డి నాయకుడు. వారికి చేగువేర సిద్ధాంతాలను `బోధించడమే’కాక వారికి స్వయంగా నకుల్ డస్టర్, కత్తులు, ఇతర పదునైన మారణాయుధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చాడు. తమ సైద్ధాంతిక మూలాలు బయటపడకుండా ఉండడం కోసం ఈ బృందం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్.ఎస్.యు.ఐ తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఆవిధంగా కాంగ్రెస్ నాయకుల అండదండలు కూడా పొందగలిగింది. అలా పనిచేస్తూ ఎన్.ఎస్.యు.ఐ వంటి కాంగ్రెస్ అనుబంధ సంస్థలతో పొత్తును కొనసాగిస్తూ రాజకీయంగా తమ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం చేసింది. పిడిఎస్ పేరున కరపత్రాలు విడుదల చేసేవారు. ఆ తరువాత దానినే ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU)గా మార్చారు.

హింసాయుత నక్సల్ సిద్ధాంతమే స్ఫూర్తిగా:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో సాయుధ తిరుగుబాటు జరుగుతున్న సమయమది. 1968 – 72 మధ్య నాలుగు సంవత్సరాల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో ‘వర్గ శత్రువులు’గా ముద్రవేసిన 156 మందిని నక్సలైట్లు తుదముట్టించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు కూడా ఈ హింసావాదానికి బలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మధ్యయుగం నాటి క్రూరాత్మక ఘటనలను తలపించే విధంగా బాధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు కూడా భయపడే వాతావరణం సృష్టించారు. ప్రత్యర్ధులను హత్యచేసి, వారి అవయవాలను ముక్కలుగా కోసి వారి ఇంటికే వేలాడదీసేవారు. తలలను తెగనరికి వెదురు కర్రలకు వేలాడదీసి ఇంటి ఎదుట పాతేవారు. ‘నిందితులు’గా తాము ముద్రవేసినవారిని కుటుంబ సభ్యుల ముందే హింసించి కిరాతకంగా హత్యచేసేవారు. అలా చంపినవారి రక్తంతోనే గోడలపై `విప్లవ’ నినాదాలు రాసేవారు నక్సలైట్లు.

జార్జిరెడ్డి – క్రూరమైన హింసా ప్రవృత్తికి ప్రతిరూపం:

“నీ చేతులు వర్గశత్రువు రక్తంతో తడవనంతకాలం నువ్వు నిజమైన కమ్యూనిస్టువి కావు” 

మావోయిజం తాలుకు ఈ నినాదాన్ని జార్జిరెడ్డి తన బృందంలోని విద్యార్థులను హింసవైపు ప్రేరేపించేందుకు ఎంచుకున్నాడు.
(రెఫెరెన్స్: శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు రాసిన ‘మావోయిజం’ అనే పుస్తకంలోనిది)

1968 నుండి జార్జిరెడ్డిపై 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1970లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇద్దరు న్యాయవిద్యార్ధులపై హత్యాప్రయత్నం చేశాడు. అంతకు పూర్వం వరకు ఆంధ్రప్రదేశ్ లోని ఏ యూనివర్సిటీ ప్రాంగణంలోనూ ఇటువంటి హింసాత్మక ఘటన జరగలేదు. ఇది యూనివర్సిటీ విద్యార్థులలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అతడిని బహిష్కరించింది. కానీ కొన్ని వారాల్లోపే కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కూడా.

జార్జిరెడ్డి విద్యార్థి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ  ప్రచారం మొదలైంది. కానీ నిజానికి అతను గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. 1970లో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయాలు సాధించింది. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయ సైన్స్ కాలేజీ ఎన్నికల్లో జార్జి రెడ్డి నిలబెట్టిన అభ్యర్ధి ఓటమిపాలయ్యాడు. దీనితో ఏబీవీపీ పై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు విద్యార్ధులందరికి ఒక `గుణపాఠం’ నేర్పాలని జార్జ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.

ఓయూ ప్రాంగణంలో జార్జిరెడ్డి వీరంగం:
1971లో జార్జిరెడ్డి తన బృందంతో జీపులో తిరుగుతూ విద్యార్థులను భయాందోళనలకు గురిచేసేవాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఏబీవీపీ విద్యార్థి సి.హెచ్. నరసింహారెడ్డిపై హాస్టల్ లోనే దాడి చేశాడు.  హాస్టల్ నుండి బయటకు లాగి, హాకీ బ్యాట్లు, ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. జార్జ్ రెడ్డి బృందం చేసిన దాడిలో అప్పటి లా కళాశాల యూనియన్ ప్రెసిడెంట్ దవడ ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఏబీవీపీ నాయకుడిని ఏకంగా ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. చివరికి చనిపోయాడనుకుని ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేసి పోయారు.  హైదరాబాద్ కు చెందిన ఒక ఏబీవీపీ నేతతోపాటు మరికొందరు విద్యార్ధులపై కూడా ఇలాంటి దాడే జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఘటనలను చూసీచూడనట్టు వ్యవహరించింది. దానితో ఏబీవీపీ విద్యార్థులే లక్ష్యంగా జార్జిరెడ్డి హింసాత్మక దాడులు మరింత పెరిగాయి.

జార్జిరెడ్డి మరణం.. అనంతర పరిణామాలు:
1972 ఏప్రిల్ 14న విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడే జార్జిరెడ్డి తన బృందంతో కలిసి ఇంజనీరింగ్ హాస్టల్ మీద దాడిచేశాడు. జార్జిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి కాదు, ఆ కళాశాల హాస్టల్ కు అతడికి సంబంధం కూడా లేదు. మరోవైపు జార్జిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా పోటీచేస్తున్న విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోకి ఉంటున్నాడు. అలా ఇంజనీరింగ్ కాలేజీతో ఎలాంటి సంబంధం లేని జార్జిరెడ్డి ఎలాంటి దురుద్దేశ్యం, దుర్మార్గపూరిత ఆలోచన లేకపోతే అక్కడకు  వెళ్లాల్సిన అవసరం ఏముంది? చివరికి అక్కడ జరిగిన ఘర్షణలో జార్జిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.

మరుసటి రోజు దినపత్రికలలో ‘ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి నేత జార్జిరెడ్డి మరణం వెనుక ఏబీవీపీ, ఆరెస్సెస్’ అనే శీర్షికలతో  వార్తలు వచ్చాయి. విచిత్రమేమిటంటే ఏ పత్రికా జార్జిరెడ్డి నేరచరిత్రను కనీసం ప్రస్తావించలేదు. విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీని పూర్తిగా తుడిచిపెట్టేంచేందుకు ఈ హత్యోదంతాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది.

ఏబీవీపీ విద్యార్ధులపై నేరారోపణ – హైకోర్టు క్లీన్ చిట్:
ఈ హత్యకేసులో 9 మంది విద్యార్ధులపై చార్జిషీట్ నమోదైంది. 6 నెలలపాటు జైలులో ఉన్న వీరిని ట్రయిల్ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. వారు విడుదలైన రోజున ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థులు ఓయూ ప్రాంగణమంతా తిరుగుతూ “కోర్టులు కాదు, మేము బహిరంగ విచారణ జరిపి, నేరస్థులను శిక్షిస్తాం” అంటూ నినాదాలిచ్చారు. ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. కానీ హైకోర్టు కింది కోర్టు తీర్పునే సమర్ధించింది. ఈ న్యాయపోరాటంలో ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో వేదనకు, కష్టాలకు గురయ్యారు.

ముగింపు:
కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం..  గత రెండు దశాబ్దాలలో (1998-2018) `జార్జిరెడ్డి ఆశయసాధన కోసం పనిచేస్తున్నామని’ చెప్పుకునే సంస్థలు సాగించిన మారణహోమంలో దాదాపు 12000 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 8000 మంది సాధారణ పౌరులున్నారు. బీబీసి వార్తా సంస్థ సర్వే ప్రకారం జార్జిరెడ్డి హింసాత్మక సిద్ధాంతానికి బలైన వ్యక్తుల సంఖ్య 6000.

ఇలాంటి నేర చరిత్ర, ద్వేషం, విధ్వంస స్వభావం కలిగిన వ్యక్తులను వీరులుగా, హీరోలుగా కీర్తించే ప్రయత్నాలను సమాజం మేలు కోరుకునేవారు అడ్డుకునే తీరాలి.  

Source: www.arisebharat.com లో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదం