Home Telugu Articles దేశ భద్రత కన్నా ఓట్లే ముఖ్యమా!

దేశ భద్రత కన్నా ఓట్లే ముఖ్యమా!

0
SHARE

లాహోరులో 1947కు ముందు 14 శాతం హిందువులు ఉండేవారు. ఇవ్వాళ కొద్దిమంది సిక్కులు మాత్రమే మిగిలారు. వారిని కూడా ఇటీవల చంపివేస్తున్నారు. కాశ్మీరులో లక్షలాది హిందూ పండిట్లు ఉండేవారు. వారిని పాకిస్తానీ ఉగ్రవాదులు తరిమివేశారు. టిబెట్‌లో పది లక్షల మంది బౌద్ధ్భిక్షువులను మావోసేటుంగ్ చంపివేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో- అమెరికాల మధ్య గోడ కట్టించి చొరబాటుదారులను నిరోధిస్తున్నాడు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఎవ్వరూ నోరెత్తలేదు. ఇవ్వాళ లోక్‌సభలో భారత హోంశాఖామాత్యులు రాజనాథ్‌సింగ్, అస్సాంలో అక్రమంగా 40 లక్షల మంది బంగ్లాదేశీయులు చొరబాటుదారులున్నారు అని ప్రకటించేసరికి ‘వారిని ఏమీ అనకండి- చొరబాటుదారులను మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లిపోవాలని కోరితే అంతర్యుద్ధం వస్తుంది- రక్తపాతం జరుగుతుంది’ అని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, సీపీయం కమ్యూనిస్టు నాయకుడు సునిల్‌చోప్రా వంటివారు హెచ్చరిస్తున్నారు. మీకీ సంగతి తెలుసా? దర్భాంగా పాట్నా, గయ వంటి బీహారు నగరాల్లో 50 లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారు. అస్సాం, యుపి, హైదరాబాద్‌ల్లో రోహింగ్యాలు ఉన్నారు. ఇంకా చక్మా శరణార్థులున్నారు. సింహళంనుండి వచ్చినవారు కేరళ, తమిళనాడులో ఉన్నారు.

బంగ్లాదేశీ చొరబాటుదారులను బంగ్లాదేశ్‌కు పంపవలసిందేనని భారత ప్రభుత్వం అంటుంటే ‘అది జరగడానికి వీలులేదు. కాదంటే సివిల్‌వార్ వస్తుంది’ అని ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు బెదిరిస్తున్నారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లా నిండా బంగ్లాదేశీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వారి ఓట్లమీదనే లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెసు ప్రభుత్వం ఆధారపడ్డాయి. చొరబాటుదారుల ఓట్లమీద ఆధారపడి భారతదేశంలో ప్రభుత్వాలు నిర్మాణమవుతున్నాయి. 2005లో లోక్‌సభలో ఇదే మమతాబెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదార్లవల్ల ఇండియాకు ముప్పుఉన్నదని మాట్లాడింది. సీపీఐ నాయకుడు నాటి హోంమంత్రి ఇంద్రజిత్‌గుప్త అస్సాంలోని చొరబాటుదార్ల గురించి ఆందోళన వ్యక్తంచేశాడు. రాజీవ్‌గాంధీ కాలంలో జరిగిన అస్సాం ఒప్పందం ప్రకారం చొరబాటుదార్లను స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు! 1985లో రాజీవ్‌గాంధీ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. సూర్యప్రకాశ్ జైస్వాల్ లెక్కల ప్రకారం ఈ చొరబాటుదారుల సంఖ్య 60 లక్షలు. నేటి బిజెపి లెక్కల ప్రకారం నలభై లక్షలు. వీరు కాజిరంగా నేషనల్ పార్క్ వరకు వచ్చి స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. వీరికి ఓటింగ్ హక్కు, భారత పౌరసత్వం ఉండకూడదు కదా! ఐనా చొరబాటుదార్లకు మమతాబెనర్జీ చట్టబద్ధత కల్పించింది. వారి ఓట్లతో ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు కాలం కలిసివస్తే భారత ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నది. సారాంశం ఏమిటంటే ఎవరికీ దేశ రక్షణ పట్టదు-ఎన్నికలు- ఓట్లు- పదవులు ఇంతకుమించి ఆలోచించటం లేదు. అస్సాం, మిజోరాం, మణిపూర్, అరుణాచల్, మేఘాలయ వంటి రాష్ట్రాలపై చైనా కన్నువేసింది. అందుకే చైనాకు అనుకూలవర్గాలు భారతదేశంలో చొరబాటుదారులను బహిరంగంగా సమర్ధిస్తూ ఉన్నారు. మమతాబెనర్జీ అస్సాంలోని చొరబాటుదార్లు వెనుకకు పోరాదు అని వాదిస్తున్నది. వీరా మన రాజకీయ నాయకులు?? నిజానికి బెంగాల్, కేరళ రాష్ట్రాలల్లో పరిపాలనా యంత్రాంగం అంటూ ఒకటి లేదు. అక్కడ ఎప్పుడో అధ్యక్ష పాలన ప్రవేశపెట్టవలసింది. రోహింగ్యాలు ఇటీవల అస్సాంలో వంద మంది హిందువులను ఎందుకు చంపారు? ఈ వార్త ఎంతమంది దృష్టికి వచ్చింది??

మానవతా దృక్పథంతో చక్మా-రోహింగ్యా వలసలను ఆలోచిస్తే బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ దేశం. అక్కడినుండి శరణార్థులు మయన్మార్ నుండి శరణార్థులు అసలు ఇండియాలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారో ఎవరైనా ఆలోచించారా? ఇలా వచ్చిన వారంతా ముస్లిములే. అక్కడ ఉన్నదీ ముస్లిము పాలకులేకదా? దీనికి మానవ హక్కుల సంఘంవారు ఏమి సమాధానం చెపుతారు?

ప్రస్తుతానికి భారతదేశం ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి ఈ చొరబాటుదారులను గౌరవంగా వారివారి దేశాలకు పంపాలి. అప్పటివరకు వారికి భారతదేశంలో ఓటింగు హక్కులేకుండా చూడాలి. ఇది చాలా సమంజసమైన ప్రతిపాదన!! చాలా దశాబ్దాలుగా ఈ వలసలు ఇండియాలోకి కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు 40,000 మంది అధికారులు అస్సాంలో శాస్ర్తియ పద్ధతిలో ఈ వలసలపై సర్వేను నిర్వహించి ప్రస్తుతం వీరి సంఖ్య 40 లక్షలు అని తేల్చారు. వీరు కనీసం భారత పౌరులు అని ఏ ఆధారం (ఆధార్) చూపినా వారు వెనుకకు వెళ్లనక్కరలేదు. లేదంటే 2018 సెప్టెంబరు తర్వాత తిరిగి మయన్మార్‌కు వెళ్లవలసి ఉంటుంది. రాజ్యసభలో అమిత్‌షా చేసిన ఈ ప్రకటనకు బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వివరణ కూడా ఇచ్చారు. అయితే మమతాబెనర్జీ ఈ అక్రమ చొరబాటుదార్ల ఓట్లమీద ఆధారపడి భారత ప్రధాని కావాలనుకుంటున్నది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అన్నట్లు బెంగాల్ వంటి ఒక రాష్ట్రాన్ని పరిపాలించలేని ఆమె ఇంతపెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి కాగలదా??

ముఖ్యాంశాలు

* 1951లో 6 లక్షల మంది చొరబాటుదారులున్నట్లు నాటి ప్రధాని పండిత జవహర్‌లాల్ గుర్తించారు. కాని వారిని బయటకు పంపే ప్రయత్నం చేయలేదు.

* సుప్రీంకోర్టు తీర్పు/ 1985 రాజీవ్‌గాంధీ- అస్సాం ఎ కార్డ్ / ఐఎంబిపిఐలు- చొరబాటుదారులను, కాందిశీకులను విడివిడిగా గుర్తించాలని సూచించాయి.

* అస్సాం తేయాకు తోటలలో పనిచేసే నిమిత్తం బ్రిటీషువారు పెద్ద సంఖ్యలో బెంగాల్‌నుండి కార్మికులను దిగుమతి చేసుకున్నారు. బెంగాల్ అంటే నేటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కూడా వస్తుంది.

* ఇది 1820నుండి సాగింది- అప్పుడు ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేది.

* 1905లో బెంగాల్‌ను కర్జన్ రెండుముక్కలు చేశారు. అప్పుడు ఉద్యమం జరిగింది. 1912లో బెంగాల్ విభజన ఆగిపోయింది. అప్పుడు అస్సాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

* 1971 తర్వాత వచ్చినవారిని చొరబాటుదారులు (కటాఫ్ డేట్) తీర్మానించారు.

* బిజెపి తన రాజకీయ లబ్దికోసం 40 లక్షల మంది ముస్లిములను బంగ్లాదేశ్‌కు పంపాలని ఆలోచిస్తున్నట్లు దళిత క్రైస్తవులు, ముస్లిం సంఘాలు, మమతాబెనర్జీ, కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు.

* 1961-2011 మధ్యకాలంలో గణాంకాలు మారాయి. 2.4 శాతం ఉన్న మైనారిటీలు 3.9 శాతానికి చేరారు. అంటే అస్సాం మరొక బంగ్లాదేశ్‌గా మారిపోతున్నదని అర్ధం. దీనికి రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ ఏం సమాధానం చెపుతారు?

బెంగాల్‌లో 35 లక్షల మంది పౌరులకు నేడు ఉండడానికి ఇళ్లులేవు. వారిని వదిలిపెట్టి 35 లక్షల మంది చొరబాటుదారులకు ఇళ్లు – ఆధార్‌కార్డు కావాలని మమతాబెనర్జీ రాజకీయ లబ్ధికోసం వాదిస్తున్నది.

* ఇంతకూ ఎన్‌ఆర్‌సి ప్రకారం గణన జరిగిందే కాని, ఎవరికీ ఓటుహక్కు నిరాకరింపబడలేదు- కనీసం ఏ చిన్న ఆధారం (ఆధార్) ఉన్నా వారిని భారత పౌరులుగానే గుర్తిస్తున్నారు. ఫిర్యాదులు ఏవైనా ఉంటే 2018 సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం స్వీకరిస్తున్నది- ఐనా మమతాబెనర్జీ సివిల్‌వార్ గురించి ఎందుకు ప్రస్తావించింది? సిపియం నాయకులు తస్లీం రహమానీ- కేరళ పీపుల్స్‌ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద సంస్థ నాయకులు క్రైస్తవ సమాజాలవారు ‘చొరబాటుదారులను బయటకు పంపకూడదు’అని వాదిస్తున్నారు. ముఖ్యంగా మల్దా జిల్లా(బెంగాల్)లో లక్షలాది బంగ్లాదేశీ చొరబాటుదారులున్నారు. వారి ఓట్లమీద మమతాబెనర్జీ సర్వాధికారం నిలబెట్టుకుంటున్నది. ఈమెను తనకు బదులు భారత ప్రధానిని చేయడానికి ‘ప్రధాని అభ్యర్థి’గా రాహుల్‌గాంధీ అంగీకరించాడు. ‘మనం గెలువకపోయినా ఫరవాలేదు, బిజెపిని మాత్రం గెలువనీయవద్దు’ అని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ దృష్ట్యా ఎన్‌ఆర్‌సి – గణన సర్వేలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది.

త్రిపురను చైనా ప్రేరేపిత కమ్యూనిస్టులు ఇటీవలివరకు పాలించారు. అస్సాంను బంగ్లాదేశ్ చొరబాటుదారులు పాలిస్తున్నారు. మిజోరాంలో క్రైస్తవీకరణం పూర్తిఅయి, ‘అమెరికన్ కాలనీ’గా మారింది. ఇక ఈశాన్య భారతంలో ఇండియాకు మిగిలే ప్రాంతాలేవి??

-ముదిగొండ శివప్రసాద్
040- 2742 5668