Home News తిరుమల పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహించిన శ్రీ టి.ఎస్.రావు ఇక లేరు

తిరుమల పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహించిన శ్రీ టి.ఎస్.రావు ఇక లేరు

0
SHARE

తిరుమల తిరుపతి క్షేత్ర పవిత్రతను కాపాడటంతోపాటు ధర్మరక్షణకు సంబంధించిన పలు విషయాల్లో చురుకుగా పాల్గొన్న మాజీ పోలీసు అధికారి శ్రీ టి ఎస్ రావుగారు ఈ నెల 15న స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు.

కృష్ణ జిల్లాలో జన్మించిన తాళ్లూరి సూర్యనారాయణ రావు చిన్నప్పటి నుండి మేధావి. గణితంలో దిట్ట. మంచి ఉపాధ్యాయుడు కావాలన్నది వారి జీవన లక్ష్యం. కానీ వారు IPS పూర్తి చేశారు. ప్రారంభంలో గుజరాత్ లో పనిచేశారు. 1983లో NTR ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అయ్యారు. ఆనాడు మత ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండేవి. హైదరాబాద్ లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడంలో వారు కృతకృత్యులయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు DGP గా పనిచేశారు.

పదవీ విరమణ అనంతరం 1996 లో ఆర్.ఎస్.ఎస్.తెలంగాణ ప్రాంత సమ్మేళన సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ఆనాటి ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ ప్రొ.రాజేంద్ర సింహ  విచ్చేశారు.

జన్మతః రావుగారికి ధార్మిక భావాలు మెండు. చాలా కాలం హైదరాబాద్ శృంగేరి శాఖకు ధర్మకర్తగా ఉన్నారు. 2005లో తిరుపతి, తిరుమలలో అన్య మత ప్రచార సంఘటనలు ప్రజలలో ఆందోళనలు కల్గించాయి. వాస్తవాలు తెలుసుకోవడం కోసం కర్ణాటకకు చెందిన ఉడిపి పీఠాధిపతి పూజ్య విశ్వేశ్వర తీర్థులు జస్టిస్ బిక్షపతి గారి నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఆ కమిటీలో శ్రీ టి.ఎస్.రావుగారు కూడా ఉన్నారు. ఆ కమిటీ తిరుమల, తిరుపతిలను సందర్శించి నివేదికను ఉడిపి స్వామీజీ కి అందచేశారు.

తిరుమల తిరుపతి లో అన్యమత ప్రచారం నిజమని నివేదిక తెలుపడంతో తిరుపతిలో అనేకమంది ధర్మాచార్యులు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన భక్తులతో ఒక పెద్ద హిందూ సమ్మేళనం జరిగింది. పెజావరు స్వామి శ్రీ టీ.ఎస్.రావు గారి అధ్యక్షతన తిరుమల తిరుపతి సంరక్షణ సమితిని ప్రకటించారు.

టి.టి. డి. అధికారులతో, దేవాదాయ శాఖ మంత్రితో పలు దఫాలు చర్చలు జరిగాయి. భక్తులు తిరుమల పవిత్రత సంరక్షణకు ఉద్యమించారు. అనేక గ్రామాల్లో రథయాత్ర లు జరిగాయి. ఉపవాస దీక్షలు జరిగాయి. హిందూ సమాజం మేల్కొన్నది.  చివరికి ఆనాటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి రెండు G.O.లు 746( తిరుమల ఏడు కొండలూ స్వామీ వారి దివ్యక్షేత్రమని, అక్కడ అన్య మత ప్రచారం చేయరాదని,  అలా చేస్తే అది శిక్షార్హమని పేర్కొంటుంది), 747 ( రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 18 దేవాలయాల వద్ద అన్య మత ప్రచారం చేయడం శిక్షార్హమైనది) ప్రకటించారు.హిందూ దేవాలయాల  వద్ద తమకు మత ప్రచారం చేయడం తమ హక్కు అని క్రైస్తవ మత ప్రచారకులు భావిస్తున్న తరుణంలో, సూడో సెక్యులరిస్టులు, కొన్ని రాజకీయ పార్టీలు వీరిని సమద్ధిస్తున్న వేళ ఈ రెండు GO లు వెలువడడంలో శ్రీ టి.ఎస్.రావు గారి నేతృత్వపు గొప్పతనం కనపడుతుంది. ఈ ఉద్యమం ఆధునిక హిందూ ధర్మ రక్షణ ఉద్యమంలో ఒక మైలు రాయి.

2007 అనంతరం కూడా అనేక అంశాల పై తిరుమల తిరుపతి సంరక్షణకు  వారు మార్గ దర్శనం చేశారు.

తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం .క్రైస్తవ మత ప్రచారానికి కేంద్రమైంది. కడప జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ సందర్భంలో శ్రీ టి.ఎస్.రావు గారు స్వయంగా విశ్వ విద్యాలయం వచ్చి వివరాలు సేకరించి నివేదికను తయారు చేశారు.

తిరుపతి చంద్రగిరి మార్గంలో ఇస్లామిక్ మహిళా విశ్వవిద్యాలయం అనుమతులు లేకుండా నిర్మించడంపై విచారణ జరపడం కోసం ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీలో పాల్గొన్నారు.

కేరళ వెళ్లి లవ్ జిహాద్ ఘటనలపై వాస్తవాలు సేకరించి ఒక నివేదికను అంద చేశారు. ఇలా హిందూ సమాజ రక్షణకు, దేశ భద్రతకు అవసరమైన పలు అంశాలపై ముందుండి నాయకత్వం వహించిన గొప్ప నాయకులు.

వారికి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అంజలి ఘటిస్తోంది.