Home Telugu Articles ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ – సంస్కృత భాష

ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ – సంస్కృత భాష

0
SHARE

–డా. సంపదానంద  మిశ్రా

సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంతరాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు  ప్రధాన స్రవంతిలోని  పాఠ్యాంశాల నుండి  అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను  తీసివేస్తున్నాయి. జీవితంలోని అన్ని దశలలో సంస్కృత భాష  పునరుత్థానం కావడం అంటే అది మనదేశ నిజమైన స్ఫూర్తిని,  దాని ఆత్మశక్తిని పునరుజ్జీవనం చేయడమే. సంస్కృత భాష  ద్వారానే మనం మన పూర్వీకులలోని శౌర్యపరాక్రమాలను,జ్ఞానతృష్ణ ను గ్రహించి గొప్ప నాగరికతలతో ఒకటిగా ఏర్పడ్డాము.

మానవ చైతన్యశక్తిని  శ్రేష్ఠమైన స్థాయికి పెంచే గొప్ప శక్తి సంస్కృతానికి ఉంది. సంస్కృత భాష ద్వారా వ్యక్తీకరించబడిన భావాలు ఒకవ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, సంస్కృతం, ఆ భాషను స్పృహతో పలికేవారి చైతన్యశక్తిని విస్తృతం చేస్తుంది. ఈ చైతన్యం వివిధ స్థాయిలలో పనిచేసే శక్తి. ఎల్లపుడూ శుద్ధిగా, నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటుంది కనుక  సంస్కృతాన్ని తిరిగి ఆవిష్కరించడం అంటే, సంస్కృత శబ్దాలలో దాగిన శక్తుల గురించి చైతన్యాన్ని వ్యాపింపజేయడమే అవుతుంది.

సంస్కృతం – మృత భాష, కష్టమైన భాష, హిందూ భాష, ఉద్యోగావకాశాలు లేని భాష లాంటి అపోహలు ఆ భాష చుట్టూ చాలా ఉన్నాయి. కానీ, ప్రస్తుత మారుతున్న సమాజంలో పరిశీలిస్తే మనదేశంలో 16 సంస్కృత విశ్వవిద్యాలయాలు సంస్కృత మాధ్యమం ద్వారా వివిధ విషయాలను బోధిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఐచ్ఛిక భాషలలో ఒకటిగా, I నుండి XII తరగతి వరకు సంస్కృత బోధన జరుగుతున్నది. స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులలో చాలావరకు 6వ తరగతి నుండి 10 వ తరగతి  వరకు ‘త్రీ లాంగ్వేజ్ ఫార్ములా’లో భాగంగా  XI , XII తరగతులలో రెండవ ఐచ్ఛిక భాషగా సంస్కృతాన్ని భోదిస్తున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండవ అధికారిక భాషగా  సంస్కృతం కొనసాగుతున్నది. కొన్ని పాఠశాలలు నర్సరీ స్థాయి నుండే సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధిస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు దీనిని మాతృభాషతో పాటు మిశ్రమ కోర్సుగా అందిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో మొత్తం ఐదు కోట్ల మంది విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తున్నారని అంచనా. దేశంలో పాఠశాల స్థాయిలో సుమారు 5000 సాంప్రదాయ సంస్కృత పాఠశాలలు, 1000 వేద పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో సంస్కృత మాధ్యమిక విద్యా మండలి లేదా సంస్కృత విద్య డైరెక్టరేట్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఏమీ లేవు. సుమారు 120 సాధారణ విశ్వవిద్యాలయాలు యుజి నుండి పిజి స్థాయిలో సంస్కృతాన్ని అందిస్తున్నాయి. ఇవే కాకుండా మన దేశంలో 10 సంస్కృత అకాడమీలు, 16 ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, 60 కి పైగా పీరియాడికల్స్, మ్యాగజైన్స్, సుమారు వంద ఎన్జీఓలు సంస్కృతం ప్రజాదరణ పొందడం కోసం పనిచేస్తున్నాయి.

ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో రోజుకు రెండుసార్లు సంస్కృత బులెటిన్‌లను ప్రసారం చేస్తున్నది. డిల్లీ దూరదర్శన్ రోజుకు రెండుసార్లు  సంస్కృత వార్తలను, వారానికి అరగంట ప్రత్యేక బులెటిన్ సంస్కృతంలో ప్రసారం చేస్తుంది. దివ్యవాణి అనే సంస్కృత  24/7 ఇంటర్నెట్ రేడియో, వివిధ రకాల ప్రసారాలను పూర్తిగా సంస్కృతంలో ప్రపంచవ్యాప్తంగా 165 కి పైగా దేశాలలో అందిస్తున్నది. ప్రతి సంవత్సరం సంస్కృతంలో వందలాది రచనలు, పరిశోధనా పత్రాలు ప్రచురించబడుతున్నాయి.

సంస్కృతంలో సృజనాత్మక రచయితలకు ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు ఇస్తున్నారు. కర్ణాటకలోని మత్తూరు లాంటి ఏడూ గ్రామాలూ, మధ్యప్రదేశ్‌లోని ఝిరీ వంటి  గ్రామాలు సంస్కృతంను  రోజువారీ భాషగా ఉపయోగిస్తాయి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు సంస్కృతం నేర్చుకుని సంస్కృత కుటుంబాలుగా మారిపోతున్నాయి.

విదేశాలలో కూడా సంస్కృతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. అనేక ఆన్‌లైన్ మాధ్యమాలు సంస్కృతంలోని వివిధ అంశాలను వీక్షకులకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా సంస్కృతానికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. సంస్కృత రంగంలో అద్భుతమైన పరిశోధనలు, గణనపై భాషాశాస్త్రంలో  కొన్ని విశ్వవిద్యాలయాలు,సంస్థలలో గుణాత్మక పనులు జరుగుతున్నాయి. సంస్కృతంలో గుణాత్మక పిల్లల సాహిత్యాన్ని సృష్టించడం, మూల్యాంకనం చేయడం, ప్రచారం చేయడం కోసం పూర్తిగా నిబద్దతతో  ప్రపంచంలో పని చేస్తున్న ఏకైక సంస్థ  ‘సంస్కృత బాలసాహిత్య పరిషత్’. ఈ సంస్థలో భారతదేశంలోని ఇరవై ఐదు వేల మంది ప్రజలు తమ మాతృభాషగా సంస్కృతాన్ని నమోదు చేసుకున్నారు. చాలా మంది సంస్కృతంలో సంభాషిస్తున్నారు, సంస్కృతంలో బ్లాగ్ లు  నిర్వహిస్తున్నారు, సంస్కృతంలో ఇమెయిల్, సంస్కృతంలో ట్వీట్లు , వారి వాట్సాప్ గ్రూపులలో సంస్కృతంలో పోస్ట్ చేస్తున్నారు. సంస్కృత సమావేశాలలో, మొత్తం సంభాషణలు, చర్చలు, ప్రదర్శనలు సంస్కృతంలో ఉంటున్నాయి.

భారత రాజ్యాంగం ప్రకారం సంస్కృతం అధికారిక భాషలలో ఒకటి. దేశంలో సాధారణంగా మాట్లాడే భాష సంస్కృతం కానప్పటికీ, అన్ని భారతీయ భాషల/మాండలికాల పదజాలం సంస్కృత మూలాల నుండి వచ్చినదే.

సంస్కృతంలో అనేక భాషా గణన సాధనాను అభివృద్ధి చేయడంతో ఈ భాషపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా భాషా బోధన రోజురోజుకు పెరుగుతోంది. ఈ భాషను నేర్చుకోవడం ద్వారా భారతదేశంతోనే కాకుండా మొత్తం ప్రపంచంతో సామాజికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా,మత,ఆధ్యాత్మిక మూలాలతో అనుసంధానం కావచ్చని  చాలా మంది భావిస్తున్నారు.

సంస్కృతం ఒక భాష మాత్రమే కాదు, ప్రాచీన భారతదేశం అభ్యాసాన్ని ప్రతిబింబించే సంపూర్ణ  జ్ఞాన వ్యవస్థ. ప్రపంచలోని పేరొందిన  శాస్త్రీయ సాహిత్యంలో  సంస్కృతం కూడా అపారమైన జ్ఞాన నిధి. ఆ క్రమలో మనం తప్పిపోయిన లింకులను అందించి  అంతర్-క్రమశిక్షణా విధానాలను ప్రోత్సహించి, సంస్కృతంలో ప్రస్తుతం ఉన్న జ్ఞాన వ్యవస్థలను సుసంపన్నం చేసే  సామర్థ్యాన్ని పెంచితే , ముఖ్యంగా అది అన్ని భారతీయ భాషల సుసంపన్నతకు చాలా దోహదం చేస్తుంది.

సంస్కృతం నేర్చుకోవడంలో ఆచరణాత్మక విషయం ఏమిటంటే, మనసును తార్కికంగా ఆలోచించడానికి శిక్షణ ఇవ్వడం, స్పష్టంగా వ్యక్తీకరించడం, మేధో బలాన్ని అభివృద్ధి చేయడం, పదాల అర్థాలపై తీవ్రమైన అవగాహన కల్పించడం అనే వాటిపై అది ఆధారపడి ఉంటుంది. సంస్కృత ఉచ్చారణలో నాణ్యత, మెదడు పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచడంలో  సహాయపడుతుంది. అంతేకాక, సంస్కృత ఉచ్చారణ  చైతన్యశక్తిని పెంచుతూ, వ్యక్తిత్వంలో అద్బుతమైన పరివర్తన తీసుకురావడంలో భాష విస్తారమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ భావన  నిజమైన ఆనందానికి దారితీయడమే కాక హృదయాన్ని, మనస్సును అమరత్వం అనే సంపూర్ణ భావనతో నింపుతుంది. భాషలోని  స్వచ్ఛత మనలను ఆకర్షిస్తుంది, ప్రేరేపిస్తుంది. మన జీవితంలోని నిజమైన లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది, మనలోని సత్యాన్ని మనకు స్పృహ కలిగిస్తుంది. సంస్కృతభాష  లయ సౌందర్యం, శ్రావ్యత, దాని శబ్ద ప్రకంపనాల స్వచ్ఛత, శబ్ద నాణ్యత గొప్పతనం, మూలశబ్దాల పారదర్శకత,  పదజాలం, విషయాల గొప్పతనం ఇవన్నీ సంస్కృత భాషను సమాజంలో గర్వపడేలా చేసాయి.

వ్యాసకర్త:  డైరెక్టర్,  శ్రీ అరబిందో ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ (SAFIC), శ్రీ అరబిందో సొసైటీ, పుదుచ్చేరి.