Home News పీఎస్ఎల్‌వీ- సీ51 విజ‌య‌వంతం… నింగిలోకి భ‌గ‌వ‌ద్గీత‌

పీఎస్ఎల్‌వీ- సీ51 విజ‌య‌వంతం… నింగిలోకి భ‌గ‌వ‌ద్గీత‌

0
SHARE

భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో చాటి చెప్పేలా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి బ్రెజిల్ ఉపగ్రహం అమెజోనియాతో పాటు మ‌రో 18 ఇతర సహ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో 5 భార‌త్‌కు చెందిన‌వి కాగా మ‌రో 13 యూఎస్ కు చెందిన‌వి. భారతదేశం నుండి ప్రయోగించిన మొట్టమొదటి బ్రెజిలియన్ ఉపగ్రహంగా అవతరించిన 637 కిలోల అమెజోనియా -1, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INPE)కి చెందిన ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం, ఇది అటవీ నిర్మూలనను పర్యవేక్షించి రిమోట్ సెన్సింగ్ ద్వారా స‌మాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది.

ఈ మిష‌న్‌లో భగవద్గీత కాపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, పేరు, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు సహా 25 వేల పేర్లను నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో విదేశాలకు చెందిన వెయ్యి మంది, చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లు సైతం ఉన్నాయి. భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆలోచనను స్పేస్ కిడ్స్ ఇండియా సీఈఓ డాక్టర్ కేసన్ సూచించారు. ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యకలాపాలలో బైబిల్ వంటి పవిత్ర పుస్తకాలను తీసుకువెళ్ళే ధోరణి ఉన్నందున.. అలాంటి విధానాన్ని మనం ఎందుకు చేపట్టకూడదనే భావనతోనే భగవద్గీతను అంతరిక్షంలోకి పంపామని డాక్టర్‌ కేసన్‌ తెలిపారు. ఇది భారతదేశంలో కొత్త చరిత్రను సృష్టించింది. అలాగే స్వావలంబన చొరవకు సంఘీభావం ప్రదర్శించేందుకు. ప్రైవేటు కంపెనీలు అంతరిక్షానికి మార్గం తెరవడానికి తీసుకున్న నిర్ణయానికి అభినందనగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫోటోను రాకెట్‌ పై ప్యానెల్‌లో ఫిక్స్‌ చేశారు.

ఈ ఉపగ్రహాన్ని ఇస్రో కోసం స్పేస్ కిడ్స్ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో రేడియేషన్‌పై స్పేస్ కిడ్స్ ఇండియా పరిశోధనలు చేస్తుంది. భూపర్యవేక్షణకు అమోజోనియా-1 శాటిలైట్‌ కీలకం కానుంది. శ్రీహరికోటలోని షార్​ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలిప్రయోగం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ మిషన్ ప్రత్యేకమైనద‌ని, భారత ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌‌ కొత్త అంతరిక్ష సంస్కరణల‌ ప్ర‌కారం ఈ ఐదు భారతీయ ఉపగ్రహాలు రూపొందించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ సంవత్సరం చివ‌రిలోగా ఇస్రోలో 14 మిషన్లు ప్రణాళిక చేయబడ్డాయ‌ని అందులో మొదటి మానవరహిత మిషన్ కూడా ఉంద‌ని తెలిపారు.

అమెజోనియా -1 మిషన్ మొట్టమొదటి వాణిజ్య ప్రయోగం విజయవంతం అయినందుకు అంతరిక్ష సంస్థను మోడీ అభినందించారు. “ఇది దేశంలో అంతరిక్ష సంస్కరణల కొత్త శకానికి దారితీసింది. 18 ఉప‌గ్ర‌హాల‌తో మ‌రో నాలుగు చిన్న ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లాయ‌ని, ఇవి మన యువత చైతన్యాన్ని, ఆవిష్కరణలు ప్ర‌పంచానికి చాటి చెబుతాయి” అని మోడీ అన్నారు. బ్రెజిల్ సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ సీజర్ పోంటెస్ కూడా ఇస్రో బృందాన్ని అభినందించారు, అమెజోనియా -1 బ్రెజిల్ కు ఒక ప్ర‌తిష్టా‌త్మ‌క‌మైన మిష‌న్ అని, ఇది ఉపగ్రహ అభివృద్ధికి కొత్త శకానికి నాంది పలికింది అని ఆయ‌న అన్నారు.