Home News దివ్య సందేశాల రక్షాబంధన్‌

దివ్య సందేశాల రక్షాబంధన్‌

0
SHARE

– ఏలె శ్యాంకుమార్‌


ఏటా శ్రావణ పౌర్ణమి రోజున  హిందూ సమాజం సంప్రదాయబద్ధంగా రక్షాబంధన్‌ ‌పండుగ జరుపుకుంటుంది. పండుగ అంటే కేవలం కొత్త బట్టలు ధరించడం, సినిమాలు, షికార్లకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడపడం మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుక ఒక ఉద్దేశం, ఒక సందేశం, సమాజానికి దిశానిర్దేశాలు ఉంటాయి. అందుకే ఈ పండుగలన్నీ వాటికి అనుగుణంగానే రూపుదిద్దుకున్నాయి.

రక్షాబంధన్‌ ఇచ్చే సందేశం- సోదరభావన. మనందరం ఒకే సమాజ పురుషుని అవయవాలం, ఈ విరాట్‌ ‌సమాజ పురుషునిలో విడదీయరాని భాగమనే భావన. మనం ఒకే తల్లి సంతానం. మనందరి తల్లి భారతమాత. కాబట్టి మనందరం అన్నాదమ్ములం, అక్కా చెల్లెళ్లమనే భావన. మన వృత్తులు, ప్రవృత్తులు, వేష, భాష, ప్రాంతం, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు వేరైనా అందరం ఒకే సమాజం అనే భావన ఈ పండుగ ద్వారా నిర్మాణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అది లోపించిన ఏ సమాజ మైనా కనుమరుగైపోతుంది. ఈ భావన కాలక్రమంలో లుప్తమైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ మన సమాజాన్ని కాపాడుకోవాలి. మన పెద్దలు పండుగలను రూపొందించడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే.

ఒక సోదరి సోదరుడికి రాఖీ కట్టి సోదర భావన వ్యక్తపరుస్తుంది. ఇవాళ ఈ పండుగలో ఆమె తన రక్షణ కోరడం వరకు మాత్రమే పరిమితమైంది. దీని అంతరార్థాన్ని గ్రహించి, హిందూ సమాజాన్ని ఒక శక్తిమంతమైనదిగా నిలబెట్టడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఈ ఉత్సవాన్ని సామూహి కంగా, సామాజికోత్సవంగా నిర్వహిస్తోంది.

నేటి సమాజంలో మనమంతా ఒక్కటేననే, ఒకే సమాజ పురుషుని వారసులమనే భావన అడుగంటి కులం, భాష, ప్రాంతాల పేరుతో కొట్లాడు కుంటున్నాము.

ఎక్కువ తక్కువ అనే భేదభావాలు, అంటరాని తనం పేరుతో కొంతమంది మన సోదరులనే దూరం పెడుతున్నారు. వాస్తవానికి మన శాస్త్రాలలో, గ్రంథాలలో ఎక్కడా అంటరానితనం గురించి చెప్ప లేదు. మధ్యయుగంలో అనేక విదేశీ దురాక్రమణల పర్యవసానంగా కాలక్రమంలో ఈ దురాచారం మన సమాజంలో చొరబడింది. దాన్ని దూరం చేసి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది.

మన దేశంలోని తిరుపతి, శ్రీశైలం, అయోధ్య, మధుర, కాశీ లాంటి దేవస్థానాలలో అంటరానితనం లేదు. అందరికి ప్రవేశం ఉంది. అంటే మన శాస్త్రాలలో, మన వ్యవహా రంలో దానికి స్థానం లేదని అర్థం అవుతుంది. కానీ, చిన్న గ్రామంలోని చిన్న ఆలయంలో ఈ వివక్ష కొనసాగడమంటే అది దురాచారమే.

ఏ సమాజంలోనైనా కాలక్రమంలో ఇలాంటి దురాచారాలు వస్తాయి. అయితే, వాటిని విమర్శిస్తూ కూర్చోవడం, లేదా పరస్పర ఆరోపణలు చేసుకోవడం కంటే అన్ని వర్గాలు కలసి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే, ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరం రాఖీలు కట్టుకుంటూ రక్షగా నిలబడదాం. భారతమాతను, ఈ ధర్మాన్ని, సంస్కృతిని రక్షిస్తామంటూ కంకణబద్ధులమవుదాం.

ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని రక్షించడమంటే ఇక్కడి జీవన విలువల్ని రక్షించడమే. అనేకమంది రుషులు, మునులు, పూర్వికులు వేల సంవత్సరాల నుండి మనవైన జీవన విలువలను నిర్మాణం చేశారు. జన్మనిచ్చిన తల్లి దేవతతో సమానం కాబట్టి ‘మాతృ దేవోభవ’ అని పూజించాలి, సేవించాలి. తల్లినే కాదు. మనల్ని పోషించే తల్లులైన భూమాత, గంగామాత, గోమాత, తులసీమాత.. అందరిని పూజించాలి, రక్షించాలి. సేవించాలి. జన్మనిచ్చిన తండ్రి భగవంతు నితో సమాన (పితృదేవోభవ) పూజనీయుడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవ మన కర్తవ్యం.

‘ఆచార్యదేవోభవ’..తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే, ఈ జన్మకు సార్థకత కల్పించేందుకు జ్ఞానాన్ని ఇచ్చేది గురువు, కాబట్టి పూజనీయుడు.

‘అతిథి దేవోభవ’.. ఇది హిందూ సంస్కృతి విశిష్టత. అతిథిని సాక్షాత్తు భగవంతునిగా భావించే సంస్కృతి మనది. స్వామి వివేకానంద చెప్పిన ‘దరిద్ర దేవోభవ’… అంటే దారిద్య్రంలో ఉన్నవారు కూడా భగవంతునితో సమానమని, సేవ చేయడం మన కర్తవ్యమని భావం. అలాగే ‘మూర్ఖదేవోభవ’ అన్నారు స్వామీజీ. అంటే మూర్ఖత్వంలో, అజ్ఞానంలో ఉన్నవారు కూడా భగవంతునితో సమానం. వారిని కూడా సేవించడం మన కర్తవ్యం. ‘మాతృవత్‌ ‌పరదారేషు’ పర స్త్రీని తల్లిగా భావించడం మన సంస్కృతి. ‘పర ద్రవ్యాణి లోష్ఠవత్‌’.. ‌పరుల డబ్బు కూడా మట్టితో సమానం కాబట్టి మనది కానిది తీసుకోవడం పాపం.

‘ఆత్మావత్‌ ‌సర్వభూతేషు’ అన్ని జీవులలో/ప్రాణులలో ఒకే పరమాత్మ స్వరూపం ఉంది కనుక అన్నింటిని గౌరవించాలి. వాటి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు, రక్షించాలి.

ప్రకృతిని పూజించడం-ప్రకృతి తల్లిలాంటిది. ప్రకృతిలో రాయి, రప్ప, చెట్టు, చేమ, నది, సముద్రం, పర్వతం, కొండ, కోన, అన్ని ప్రాణులు.. అంటే చరాచార సృష్టిని రక్షించే బాధ్యత మనది. ఇలాంటి అనేక విలువలను కాపాడడం మన కర్తవ్యం అనే భావన సమాజంలో నిర్మాణం చేయడం కోసమే. ఈ కంకణం (రాఖీ).

‘ఏకం సత్‌ ‌విప్రాః బహుదా వదన్తి’… సత్యం ఒక్కటే, విద్వాంసులు దాన్ని అనేక విధాలుగా చెప్పారు. కానీ ప్రపంచంలో అన్ని దేశాలలో, మతాలలో కేవలం ‘మాది మాత్రమే సత్యం. ఇతరాలన్నీ అసత్యాలు. అందుకే మా మార్గంలోకి రండి. మా మతం ద్వారా మాత్రమే స్వర్గానికి వెళ్తారు. మోక్షం లభిస్తుంది’ అని బలవంతం పెట్టడం, మతం మార్చడం లాంటి ధోరణి ప్రబలుతోంది. ‘మా మతంలోకి రాకపోతే దౌర్జన్యంతోనైనా తీసుకెళ్తాం. లేదా చంపేస్తాం’ అనే జిహాదీ పోకడలనూ చూస్తున్నాం.

‘ఆనోభదాక్రతవో యంతు విశ్వతః’- ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించు లాంటి శ్రేష్ఠమైన గుణాలు హిందుత్వంలో ఉన్నాయి.

హిందుత్వంలో ఇలాంటి శ్రేష్ఠమైన విలువల కారణంగానే ప్రపంచంలోని అన్ని జాతులను, అన్ని మతాలను ఆదరించాం. ఎవరినీ ద్వేషించలేదు. ఎవరి మీదకు ఆక్రమణ చేయలేదు. ప్రపంచమంతా హిందూ సంస్కృతి విస్తరించింది, అయితే అది దౌర్జన్యం, హింస వల్ల కాదు. మతం మార్పిడివల్ల కానే కాదు. కానీ, కొన్ని మతాలు తమ మతంలో, తమ గ్రంథంలోనే మంచి ఉందని, మిగతా వాటిలో ఉన్నదంతా చెడే కాబట్టి తమనే అనుసరించాలని ప్రలోభ పెడుతున్నాయి.

అజ్ఞానం, అనాగరికంలో ఉన్న ప్రపంచజనులకు మన శ్రేష్ట జీవన విధానాన్ని- తెలియచెప్పేందుకు ఇక్కడి నుండి రుషులు, మునులు, సాధుసంతులు సహృదయత, సేవాభావం, స్నేహభావం, ప్రేమతో ప్రపంచ దేశాలకు వెళ్లారు. అక్కడివారికి ఈ శ్రేష్ఠమైన సభ్యత, నాగరికతను, మనిషి మనిషిలా జీవించడ మెలాగో నేర్పారు. అందుకే ఇవ్వాళ ప్రపంచ మంతటా హిందుత్వ చిహ్నాలు, పద్ధతులు కనిపిస్తాయి.

అంతేకాదు, మన దేశంలోకి వచ్చిన అనేక జాతులకు ఆశ్రయమిచ్చి ఆదుకొని ఆదరించాం. మంచి స్థానమిచ్చి గౌరవించాం.అరబ్బుల కారణంగా యూదులు తమ దేశం నుండి ప్రపంచ దేశాలకు వలసదారి పట్టినప్పుడు వారికి అన్ని చోట్ల ఎదురు దెబ్బలు, అవమానాలు ఎదురయ్యాయి. వారిపై హింస, దౌర్జన్యాలు జరిగాయి. వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. వారికి భారత్‌లో మాత్రమే ఆదరణ, గౌరవం లభించాయి. ఈ విషయాన్ని వారే తమ పుస్తకాలలో రాసుకున్నారు.

అలాగే, పర్షియా (ఇరాన్‌) ‌మీద ఆక్రమణ జరిగినప్పుడు పర్షియన్లు అనేక దేశాలకు పారి పోయారు. భారత్‌కు కూడా వచ్చారు. అన్ని దేశాలలో వారి మీద హింస, దౌర్జన్యాలు జరగగా, మన దేశమే వారికి సముచిత స్థానమిచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడా కూడా పార్శీలు లేరు. వారి మాతృదేశమైన పర్షియాలో కూడా ఒక్క పార్శీ కన్పించడు. కానీ భారత్‌లో మాత్రమే పార్శీలు అన్ని రంగాలలో ఉన్నతమైన, గౌరవప్రదమైన స్థానాలలో ఉన్నారు. ఇది భారత్‌ ‌శ్రేష్ఠత్వం.

అయితే, భారత్‌పై దుర్బుద్ధితో ఆక్రమణ చేసిన ఏ ఒక్క విదేశస్థుడిని వదిలి పెట్టలేదు. భారత్‌ను కబళించాలని వచ్చిన గ్రీకులు ఓటమితో పరారయ్యారు. మిగిలిన వారు ఇక్కడి సమాజంలో విలీనమయ్యారు. మిని యాండర్‌ అనే గ్రీకురాజు భారత్‌ ‌వచ్చి ఇక్కడ బౌద్ధ గురువులతో చర్చిస్తూ, చర్చిస్తూ బౌద్ధుడై మిళింద్‌ అనే పేరుతో బౌద్ధభిక్షువు అయ్యాడు.

విదిశలో క్రీస్తుపూర్వం 175 సంవత్సరం నాటి  ప్రాచీన రాతిస్తంభం పైన ‘హైలియోడోరస్‌’ అనే గ్రీకురాజు రాయబారి ‘‘నేను గ్రీకు రాజు రాయ బారిని, ఇక్కడికి వచ్చి, కుటుంబంతో సహ భాగవత్‌ ‌వైష్ణవుణ్ణి అయ్యాను’’ అని రాసుకున్నాడు.

శకులు-ఉజ్జయినిని గెలుచుకున్నారు, కాని తర్వాత వీరందరు శైవులైపోయారు.

కుషాణులు – కనిష్కుడు కుషాణు వంశపు రాజు. బౌద్ధభిక్షువు అయ్యాడు.

హూణులు – మిహిరకులుడు అనే రాజు కాశ్మీర్‌లో శైవమందిరాలను నిర్మించాడు.

థాయిలాండ్‌ ‌నుండి అహోమ్‌ ‌జాతి అస్సాంలోకి వచ్చింది. వారి రాజు ‘సుకుఫా’. వారంతా హిందువు లైపోయారు. రాజభాషగా సంస్కృతాన్ని స్వీకరించారు. అస్సాంలో వేదపాఠశాలలు ప్రారంభించారు.

అలా దుర్బుద్ధితో వచ్చిన అనేక జాతులను తరిమివేశాం, లేదా విలీనం చేసుకున్నాం. కానీ తర్వాత వచ్చిన ఇస్లాం, క్రైస్తవం- ఈ దేశం మీద ఆక్రమణ చేసి, ఇక్కడి వారి మతంమార్చి ఈ దేశాన్ని ఇస్లాం / క్రైస్తవం చేయాలనే తీవ్ర ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. వీరికి ముందు వచ్చిన ఆక్రమణ దారులుగా వీరికి బౌద్ధిక స్వచ్ఛత లేదు. సైద్ధాంతిక ప్రామాణికత లేదు. మొండితనం, క్రూరత్వంతో పాటు చర్చల మీద వారికి విశ్వాసం లేదు. మొత్తం ప్రపంచాన్ని ఏదోరకంగా ఇస్లాంగానో, క్రైస్తవంగానో చేయాలనే సంకల్పంతో భారత్‌ ఆ‌క్రమణకు వచ్చారు.

అయితే 1300 సంవత్సరాల నుండి ఇస్లాంతో  సుమారుగా 400 సంవత్సరాల నుండి క్రైస్తవంతో పోరాడుతూ, మన సమాజాన్ని కాపాడుకుంటున్నాం. ప్రపంచంలో అనేక దేశాల మీద ఈ రెండు మతాలు ఆక్రమణ చేసి 10 లేదా 20 సంవత్సరాలలోనే ఆయా దేశాల మూల జాతిని, మూల సంస్కృతిని, మూల విలువలను ధ్వంసం చేసి ఇస్లాం లేదా క్రైస్తవ దేశాలుగా మార్చివేశాయి.

కాని ఈ దేశంలో దేవల మహర్షి నుండి మొదలు కొని గురు అర్జున్‌దేవ్‌, ‌రామానుజాచార్యులవారు  పునరాగమన పక్రియను ప్రారంభించారు.

కాశీలో సంత్‌ ‌రామానందులవారు మతం మారినవారిని పెద్ద ఎత్తున పునర్‌ ‌దీక్షితులను చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి హిందువు లుగా మార్చండి అన్న నినాదం ఇచ్చారు. మెడలో తులసిమాల వేసి, రామనామం చెప్పించడం, తులసి దళం నోట్లో పెట్టుకోవడం ద్వారా హిందువులుగా మార్చారు.

అయోధ్యలో ముస్లింలుగా మారిన సుమారు 35,000 మంది రాజపుత్రులను మళ్లీ హిందువు లుగా మార్చారు. ముస్లింల నుండి అనేక బెదిరింపులు వచ్చినా భయపడలేదు. వారు కులపరమైన భేదాలను కూడా వ్యతిరేకించారు.

గురునానక్‌, ‌వల్లభాచార్య, చైతన్య మహాప్రభుల అనేకమంది శిష్యులు కూడా హిందువులుగా మారారు. విద్యారణ్యస్వామి శిష్యులు హరిహర రాయలు, బుక్కరాయలు హిందువులుగా మారి విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. సావర్కర్‌, ‌మసూర్కర్‌, ‌పండిత మదనమోహన మాలవ్యా, అనీబిసెంట్‌, ‌శారదామాత, నారాయణగురు, స్వామి ప్రణవానంద, లాలా లాజ్‌పత్‌రాయ్‌ అం‌దరూ శుద్ధి ఉద్యమంతో అనేకమంది మహమ్మదీయులను హిందువులుగా మార్చారు.

శివాజీ, శంభాజీ మహారాజ్‌ అనేకమంది ముస్లింలతోపాటు, గోవాలో క్రైస్తవులను కూడా పునరాగమనం చేయించారు. పీష్వాబాజీరావు కూడా గోవాలో అనేక మంది క్రైస్తవులను పునరాగమనం చేయించారు. శుద్ధీకరణకు  19వ శతాబ్దంలో అనేక సంస్థలు ఉద్భవించాయి. అందులో ఆర్య సమాజం  ప్రముఖమైనది. స్వామి దయానంద సరస్వతి, పండిత లేఖరామ్‌ – ‌పెద్ద ఎత్తున పునరాగమనం జరిపారు. స్వామి శ్రద్ధానంద వేలాదిమంది మహమ్మదీయులను హిందువులుగా మార్చారు. అందువల్ల మొదట పండిత లేఖరామ్‌ను, తర్వాత స్వామి శ్రద్ధానందను మహమ్మదీయులు హత్య చేశారు.

కేవలం శుద్ధి ద్వారా 1923-31 లోపల, సుమారు 1,83,342 మంది ముస్లింలకు శుద్ధీకరణ చేశారు. సుమారుగా 60వేల మందిని  ఇస్లాంలోకి మారకుండా నిలువరించారు.

ఇటీవలి కాలంలో ఒరిస్సాలో స్వామి లక్ష్మణా నంద సరస్వతి క్రైస్తవులుగా మారిన వేలాది గిరిజను లను హిందువులుగా మార్చారు. అందుకే క్రైస్తవులు ఆయన ఆశ్రమంలోకి జొరబడి హత్య చేశారు.

1931 జులై నాగపూర్‌లో జరిగిన చాలా శుద్ధి కార్యక్రమాలకు పూజనీయ డాక్టర్జీ సహకారం, ప్రోత్సాహం అందించారు.

కాబట్టి ఇవాళ మనమందరం ధర్మరక్షా కంకణం ధరించి, ‘ఈ దేశంలో మతం మార్పిడులను ఆపుదాం. పునరాగమనం చేయిద్దాం!’ అని సంకల్పిద్దాం.

ఇవాళ కొన్ని విదేశీశక్తులు హిందూ సమాజంలో విభేదాలు సృష్టించి, విడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు హిందువులు కారనే తప్పుడు సిద్ధాంతాలు చెబుతూ, హిందూ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నాయి. ‘జై భీం, జై మీం’ అనే నినాదాలు ఇస్తున్నారు. బీఫ్‌ ‌ఫెస్టివల్‌, ‌మహిషాసురుణ్ణి పూజించడం, రావణాసురుడు తమ పూర్వికుడని సామాన్యులలో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది.

విద్వాంసులను తయారుచేసి, దేశప్రగతికి దోహదపడవలసిన విశ్వవిద్యాలయాల్లో దేశద్రోహ కార్యకలాపాలు సాగుతూ ‘భారత్‌ను ముక్కలు చేస్తాం’ అనే అనే నినాదాలు మార్మొగుతున్నాయి. దేశహితం కోసం చేస్తున్న అనేక చట్టాలను వ్యతిరేకిస్తూ వాటిపట్ల ప్రజలలో ఒక రకమైన గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్తాన్‌లలోని మైనారిటీలైన హిందువులు హింస, దౌర్జన్యాల•, అత్యాచారాలను తట్టుకోలేక స్వదేశం తిరిగివస్తే, వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన  సి.ఎ.ఎ. బిల్లును కూడా వ్యతిరేకించడం శోచనీయం. వాస్తవాలు మాట్లాడిన నుపూర్‌ ‌శర్మ వ్యాఖ్యలపై రభస సృష్టించి హిందువులపై దాడులు చేసి, భయానకంగా తలలు నరికి చంపేశారు. ఇవ్వన్నీ విదేశీశక్తుల ప్రేరణతో, ఇక్కడ కొన ఊపిరితో ఉన్న చివరి దశలో ఉన్న దేశ వ్యతిరేక శక్తుల సిద్ధాంతాలను రక్షించు కోవడం కోసం ఈ జరుగుతున్న ప్రయత్నాలు. ఇలాంటి శక్తులను, సిద్ధాంతాలను ఈ దేశం నుండి తరిమికొట్టడానికి హిందూ సమాజం కంకణబద్ధం (దీక్ష) కావాలి.

సమాజంలో సామరస్యత నిర్మాణం కోసం.. మనలో భేదభావాలు లేవని, మనం ఒకే తల్లి సంతానం అనే భావనను కల్పించడం, కుటుంబంలో అందరికి సంస్కారాలు అందించడం లాంటి విషయాలపై దృష్టిపెట్టవలసి ఉంది. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని నిషేధించడం, చెట్లను పెంచడం, నీటిని పొదుపుగా వాడడం వంటి అంశాల పట్ల రక్ష (కంకణం) ధరించి నిర్ణయం తీసుకుందాం. వీటన్నింటితోపాటు ప్రతి హిందువు మంచి పౌరునిగా తయారుకావాలి. ట్రాఫిక్‌ ‌రూల్స్‌ను పాటించడం, సీట్‌ ‌బెల్ట్, ‌హెల్మెట్‌ ‌ధారణవంటి నియమాలను సైతం గౌరవించాలి. రహదారులపై పరిశుభ్రతను పాటించాలి. విదేశాలకు వెళ్లినప్పుడు ఈ నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించిన వారే స్వదేశానికి  వచ్చిన తరవాత పట్టించుకోరు. ఆచార వ్యవహారాలు పాటిస్తూ, పండుగలు, జన్మదినం, పెండ్లిరోజు వంటివి హిందూ పద్ధతులలో జరుపుకోవాలి. ప్రతి హిందువు దేశభక్తుడు కావాలి. దేశ ప్రగతికి సంబంధించిన ప్రతి విషయంలోనూ స్పందించాలి. సందర్భమొచ్చినపుడు మాత్రమే కాదు, నిత్య జీవితంలో అనుక్షణం దేశభక్తి వ్యక్తం కావాలి. స్వదేశీ వస్తువులను వాడాలి. వేష, భాషలు, సదాచారం (అంటే మన పద్ధతులు, సంస్కృతిని పాటించడం) పట్ల ఆచరణాత్మకంగా ఉండాలి.

వేష భాష సదాచారం, రక్షణీయం ఇదంత్రయం

అంధానుకరణ మన్యేషాం, అకీర్తికరముచ్యతే

వేషం, భాష, సదాచారం – ఈ మూడింటిని రక్షించుకోవాలి. ఇతరులను అంధానుకరణ వలన కీడు కలుగుతోంది. వీటి సంరక్షణతోనే దేశ రక్షణ సాధ్యం. కనుక వీటి కోసం కంకణధారణ చేద్దాం, తద్వారా మన దేశాన్నీ, ధర్మాన్నీ రక్షించుకుందాం.

సర్వేజనాః సుఖినోభవంతు

వ్యాస‌క‌ర్త‌ : అఖిల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్‌

జాగృతి సౌజ‌న్యంతో…