Home Rashtriya Swayamsevak Sangh రాడికల్‌ శక్తులు పెరిగితే ప్రజాస్వామ్యానికి హాని! – ఆర్.ఎస్ఎ.స్

రాడికల్‌ శక్తులు పెరిగితే ప్రజాస్వామ్యానికి హాని! – ఆర్.ఎస్ఎ.స్

0
SHARE

ధార్వాడ్‌(కర్ణాటక): బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ కార్యకారి మండలి(ఏబీకేఎం) తన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ను మరింత ఇస్లామీకరణ చేయడానికి జిహాదీ ముఠాలు చేసిన పెద్ద కుట్రలో భాగమైన అక్కడి హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న దాడులను ఖండిస్తున్నట్టు ఏబీకేఎం స్పష్టం చేసింది. ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో రెండో రోజు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశంలో భాగంగా ఒక‌ తీర్మానాన్ని ఆమోదించింది.

హిందువులపై ఆగని దాడులు
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, హిందూ దేవాలయాలపై హింసాత్మక దాడుల పరంపర కొనసాగుతూనే ఉందని, పవిత్రమైన దుర్గాపూజ పండుగ సందర్భంగా చెలరేగిన మత హింసలో అనేక మంది అమాయక హిందువులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారని ఏబీకేఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే దుర్ఘటనలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, హిందూ సమాజానికి చెందిన అనేక మంది బాలికలు, మహిళలపై దాడి జరిగిందని, రెండు వారాల వ్యవధిలో దేవాలయాలు, దుర్గాపూజ పందిళ్ళను దుండగలు ధ్వంసం చేసింద‌ని ఏబీకేఎం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

రాడికల్‌ ఇస్లామిస్టుల పక్కా కుట్ర
సమాజంలో మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన నిందితుల్లో కొందరిని అరెస్టు చేయడం వల్ల ఈ దాడులు రాడికల్‌ ఇస్లామిస్టుల పక్కా కుట్రగా వెలుగులోకి వచ్చిందని అభిప్రాయ‌ప‌డింది. భారత్‌ విభజన జరిగినప్పటి నుండి జనాభా బాగా క్షీణిస్తున్న హిందూ మైనారిటీలను నిర్మూలించడానికి, లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ దాడుల వల్ల స్పష్టమవుతోందని మండ‌లి ఆందోళన వ్యక్తం చేసింది.

8 శాతానికి పడిపోయిన హిందూ జనాభా…
విభజన సమయంలో తూర్పు బెంగాల్‌ జనాభాలో దాదాపు 28 శాతం మంది హిందువులుగా ఉండేవారు… అది ఇప్పుడు ఎనిమిది శాతానికి తగ్గిపోయింది… జమాత్‌-ఎ-ఇస్లామీ(బంగ్లాదేశ్‌) వంటి రాడికల్‌ ఇస్లామిస్ట్‌ గ్రూపుల దురాగతాల ఫలితంగా విభజన తర్వాత, ప్రత్యేకంగా 1971 యుద్ధం సమయంలో హిందువులు పెద్ద ఎత్తున భారత్‌లోకి వలస వచ్చార‌ని ఏబీకేఎం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ జనాభాలో అభద్రతాభావాన్ని సృష్టిస్తూ, మత సామరస్యాన్ని ఇప్పటికీ ఆ సంస్థలు నాశనం చేస్తూనే ఉన్నాయని పేర్కొంది.

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తమ దేశంలో మైనారిటీలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏబీకేఎం అభిప్రాయప‌డింది. బంగ్లాదేశ్‌లో హిందువులు తమ హక్కులను పొందుతూ వారి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం గురించి హామీ ఇవ్వడానికి, హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఏబీకేఎం డిమాండ్‌ చేసింది.

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై నిత్యం మారణకాండ జరుగుతున్నా ప్రపంచ మానవ హక్కుల నిఘా సంస్థలు, యుఎన్‌ అనుబంధ సంస్థలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించ‌డాన్ని మండలి తప్పు పట్టింది. బంగ్లాదేశ్‌లోని హింసను ఖండించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, బంగ్లాదేశ్‌ హిందూ, బౌద్ధ, ఇతర మైనారిటీల భద్రత కోసం తమ గొంతును వినిపించాలని అఖిల భారతీయ కార్యకారి మండలి పిలుపునిచ్చింది.

రాడికల్‌ శక్తులు పెరిగితే ప్రజాస్వామ్యానికి హాని!
బంగ్లాదేశ్‌లో లేదా ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలోనైనా రాడికల్‌ ఇస్లామిస్ట్‌ శక్తుల పెరుగుదల ప్రజాస్వామ్యానికి, ప్రపంచంలోని శాంతి-ప్రేమగల దేశాల ప్రజల మానవ హక్కులకు తీవ్రమైన ముప్పు అని కూడా మండలి హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధుల భద్రత కోసం, బంగ్లాదేశ్‌లో దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ హిందూ సమాజం, సంస్థల ఆందోళనలను బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి తెలియజేయడానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించాలని ఏబీకేఎం భారత్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది.

ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ సంఘ, వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలు, ఇస్లామిస్ట్‌ హింసాకాండ బాధితుల పక్షాన నిలబడి బంగ్లాదేశ్‌లోని హిందూ సోదరులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినందుకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మండలి ప్రకటించింది. ఈ సవాలు, క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు మొత్తం హిందూ సమాజంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ అండగా నిలుస్తోందని అఖిల భారతీయ కార్యకారి మండలి హామీ ఇచ్చింది.