Home News పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన

పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన

0
SHARE
దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి పట్ల శనివారం  సాధువులు నిరసన వ్యక్తం చేశారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.
           స్థానిక బిజెపి ఎంపీ రామ్ కదమ్ మాట్లాడుతూ యూపీలో ఇటీవల ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు పూజారి మృతి  పట్ల కనీసం స్పందించకపోవడాన్ని తీవ్రంగా  తప్పుబట్టారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు చేసే ఆందోళనలు బాధితుడి కులం, మతం లేదా రాష్ట్ర రాజకీయాల్ని బట్టి మారుతాయా అని కదమ్ ప్రశ్నించాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  స్థానిక కలెక్టర్, ఎస్పీని  ఎంపీ కదమ్ కోరారు. కానీ నిందితులకు స్థానిక  ఎమ్మెల్యే(కాంగ్రెస్) సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
          దేవాలయ భూమిని కబ్జాకు గురవ్వకుండా అడ్డుకున్న ఒక పూజారిని ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణమైన సంఘటన శుక్రవారం రాజస్థాన్ లోని కరౌళి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ లోని కరౌలి జిల్లాలోని బక్నా గ్రామానికి చెందిన బాబూలాల్ వైష్ణవ్ స్థానిక దేవాలయంలో పూజారిగా పని చేస్తూ, దేవాలయానికి సంబంధించిన కొంత భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ భూమి తనదేనంటూ గ్రామానికి చెందిన కైలాష్ మీనా అనే వ్యక్తి కబ్జాకు యత్నించగా పూజారి అడ్డుకున్నాడు.  ఇదే విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా పూజారి కే భూమి చెందుతుందని తీర్పు వచ్చింది. అయినప్పటికీ  కైలాస్ దేవాలయ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో పూజారికి అతనికి గొడవ జరిగింది. గురువారం  దేవాలయ స్థలంలో గుడిసెను నిర్మించడానికి కైలాష్ ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. దీంతో కైలాస్ తో వచ్చిన అతని అనుచరులు ఆరుగురు పూజారి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలతో పూజారి జైపూర్ లోని ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తున్న పూజారి బాధను వీడియోలో చూడవచ్చు. తను మరణించే ముందే తనకు నిప్పంటించిన ఆరుగురు వ్యక్తుల పై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు.
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న పూజారి బాబులాల్ వైష్ణవ్  ( ఫైల్  )  
 ఈ ఘటనను స్థానిక హిందూ సంఘ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. 50 ఏళ్ల ఒక పూజారి పెట్రోల్ పోసి చంపడం దారుణమని, ఈ ఘటన పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తొందని మండి పడ్డారు.  భీం సైన్యం కారణంగా ఈ ప్రాంతంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోయారు.  దళితులను రెచ్చగొడుతూ, అధికార పార్టీ నాయకులు హిందువుల్లో చీలిక తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. కాగా శనివారం సాయంత్రం రాజస్థాన్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించింది.
పూజారి కుటుంబానికి అండగా రూ. 25 లక్షల విరాళం సేకరించిన బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా 
దుండగుల చేతిలో దారుణంగా  హత్య చేయబడ్డ పూజారి కుటుంబానికి సాయం చేయడానికి బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా  ముందుకు వచ్చారు.  దాతల  సహకారంతో రూ .25 లక్షల విరాళాన్ని సేకరించారు. “పూజారి కుటుంబానికి సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా దాతలను కోరగా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందించి విరాళాలు అందించారు. మొత్తం రూ.25 లక్షలు జమయ్యాయి. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తాం” అని ఆదివారం ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు
Source : OPINDIA