Home News “పేదల పాలిట పెన్నిధి సేవా భారతి”

“పేదల పాలిట పెన్నిధి సేవా భారతి”

0
SHARE

పేద, అట్టడుగు వర్గాల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా భారతి చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పుల్లయ్య స్మారక భవనంలో సేవాభారతి వారిచే నిర్మించిన శ్రీ వివేకానంద వైద్యశాలను జూన్ 24 శుక్రవారం శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా సమయంలో, ఇతర సమయాల్లోనూ సేవా భారతి చేసిన సేవలను కొనియాడారు. 1974 లోనే ఆసుపత్రికి డాక్టర్ శ్రీ పోటు పుల్లయ్య గారు అందించిన సేవలు మరువలేనివ‌న్నారు. పేదలకు సేవ చేసిన మహానుభావులను గుర్తుంచుకొని భావితరాలకు తెలియజేయాలని సూచించారు. సేవా భారతి ఇలాంటి మారుమూల గ్రామాలలో సేవా కార్యక్రమాలను చేయటం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే కొక్కిరేణి రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆస్పత్రికి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ వాసు ఉసులుమర్తి గారు మాట్లాడుతూ 1974లో అప్పట్లో ప్రచారక్‌గా పనిచేసిన శ్రీ ఈసీ రామ్మూర్తి గారు ప్రోద్బలంతో డాక్టర్ పోటు పుల్లయ్య గారి కృషితో శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ ఆస్పత్రి ప్రారంభించార‌ని గుర్తు చేశారు. ఈ ఆస్ప‌త్రి 1994 వరకు ప్రజలకు సేవలు అందించింద‌ని తెలిపారు. కొక్కిరేణి చుట్టుప్రక్కల 25 నుంచి 30 గ్రామాలకు సరైన వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న కారణంగా సేవా భారతి రూ.65 లక్షలతో సువ్యవస్థం చేసి పునఃప్రారంభించారని తెలిపారు. ఈ వివేకానంద వైద్యశాలలో అనుభవం కలిగిన ఇద్దరు డాక్టర్లు అందులో ఒకరు మహిళ డాక్టరు వీరు 24/7 సేవలందిస్తారని తెలిపారు. ఇందులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ, జనరల్ సర్జరీస్, ప్రసూతి సదుపాయాలతో పాటు పైధలజీ ల్యాబ్, ఫార్మసీ ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కేంద్రం ఆధారంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వైద్యంతో పాటు పేద విద్యార్థులకు విలువలతో కూడుకున్న విద్య అలాగే యువకులకు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ప్రారంభించనున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పోటు పుల్లయ్య గారి కుమారుడు పోటు రాజేంద్ర గారు డాక్టర్ పోటు పుల్లయ్య గారి జీవిత విశేషాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధ్య‌క్ష‌త వ‌హించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సూర్యాపేట నగర సంఘ చాలకులు డాక్టర్ సుధీర్ గారు మాట్లాడుతూ రాబోయే రోజులలో ఈ ఆస్పత్రిలో అవసరమైన స్పెషలైజేషన్ చికిత్స కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సూర్యాపేట జిల్లా మాననీయ సంఘ చాలకులు శ్రీ అప్పయ్య గారు, డి. ఎమ్.హెచ్. ఓ శ్రీ కోటా చలం, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ శ్రీ హర్ష వర్ధన, గ్రామ సర్పంచ్ శ్రీమతి కామెర్ల బుచ్చమ్మ, ఆసుపత్రి సంస్థాగత సభ్యులు కొండ రామకృష్ణారెడ్డి గారు, సేవాభారతి తెలంగాణ ప్రాంత సభ్యులు శ్రీ పోటు శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్స‌వం కంటే ముందు వాస్తు పూజ, గణపతి హోమం నిర్వహించారు. అనంత‌రం కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన పెద్దలు మొక్కలు నాటారు.