Home News స్వర్గస్తులైన జ్యేష్ట ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ శ్రీ ఎం. సి జయదేవ్‌ జీ

స్వర్గస్తులైన జ్యేష్ట ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ శ్రీ ఎం. సి జయదేవ్‌ జీ

0
SHARE

జ్యేష్ట ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారక్‌ శ్రీ ఎం.సి జయదేవ్‌ జీ సోమవారం (20-ఫిబ్రవరి-2017)  ఉదయం బెంగళూరులోని   సాగర్‌ ఆస్పత్రిలో స్వర్గస్థులయ్యారు. 85 ఏళ్ళ జయదేవ్‌జీ కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతిమ దర్శనం కోసం ఆయన భౌతిక కాయాన్ని బెంగళూరు కార్యాలయం కేశవకృపలో ఉంచారు. మంగళవారం మైసూర్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయి.

18, ఫిబ్రవరి 1932న మైసూర్‌ లో జన్మించిన చెన్నబసప్ప జయదేవ్‌ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత న్యాయవాద విద్య అభ్యసిస్తున్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ లో స్వయంసేవక్‌గా మారారు.

చదువు పూర్తయిన తరువాత జయదేవ్‌ జీ బెంగళూరులోని ప్రముఖ హిందుస్థాన్‌ గ్యారేజ్‌ మోటార్స్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. 1960-75 వరకు బెంగళూరు మహానగర్‌ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు. బెంగళూరు మహానగర్‌లో ఎక్కువకాలం  కార్యవాహ బాధ్యత నిర్వర్తించినవారిలో వారు కూడా ఒకరు. 1975 లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న జయదేవ్‌జీ జైలు శిక్ష సైతం అనుభవించారు.  ఎమర్జెన్సీ అనతరం జ్యేష్ట ప్రచారక్‌ యాదవ్‌రావ్‌ జోషితోపాటు 1977లో జైలు నుండి విడుదలయ్యారు.

కర్ణాటకలోనే ప్రముఖ సేవా సంస్థగా మన్నను పొందిన ‘రాష్ట్రోత్థాన పరిషత్‌’కు 1965లో జయదేవ్‌జీ ఊపిరిపోశారు. వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఆయన 31 ఏళ్ళపాటు ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ కాలంలోనే రాష్ట్రోత్థాన పరిషత్‌ విద్య, ఆర్యోగం, సాహిత్యం, సేవ మొదలైన అనేక రంగాల్లో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు  చేపట్టింది.  దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖల  జీవితాలను వివరించే ‘భారత భారతి’ పుస్తకాల సంకలనం ఆ ప్రాజెక్ట్‌ల్లో ఒకటి. ఈ పుస్తకాల సంకలనం కన్నడ సాహిత్య రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించింది. అలాగే రాష్ట్రోత్థాన పరిషత్‌ నిర్వహిస్తున్న ‘రక్తనిధి కేంద్రం’ రాష్ట్రంలోని అతి పెద్ద కేంద్రాల్లో ఒకటి.  రాష్ట్రోత్థాన ప్రచురణ విభాగం కూడా రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించింది.

1995లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ అయినప్పటి నుండి జయదేవ్‌జీ వివిధ భాద్యతలు నిర్వర్తించారు. 2002లో సహక్షేత్ర ప్రచారక్‌గా బాధ్యత చేపట్టిన ఆయన 2004లో క్షేత్ర (కర్ణాటక, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్) ప్రచారక్‌ అయ్యారు. 2012లో అఖిభారత కార్యకారిణి సభ్యుడు గా కూడా ఉన్నారు.

గిరిజన సంక్షేమం కోసం పనిచేసే వనవాసీ కళ్యాణాశ్రమం వంటి సామాజిక సంస్థకు జయదేవ్‌జీ మార్గదర్శనం లభించింది. మిథిక్‌ సొసైటీ, అనాథ శిశు నివాస, ఆబాలాశ్రమ, గోఖలే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ మొదలైన సంస్థల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు.

అత్యంత కార్యనిర్వహణ కుశలత కలిగిన జయదేవ్‌జీ సామాజిక సేవ, విద్య, రాజకీయ, సినిమా, వ్యాపార, ఆరోగ్య, సాహిత్య రంగాల్లో అనేక మంది ప్రముఖుతో కలిసి పనిచేశారు.

ఎం.సి జయదేవ్‌ జీ మృతిపట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌జీ, సర్‌కార్యవాహ శ్రీ సురేష్‌ జోషి (భయ్యాజీ), సహసర్‌కార్యవాహు శ్రీ సురేష్‌ సోని జీ, శ్రీ దత్తాత్రేయ హోసబళే జీ, డా.కృష్ణగోపాల్‌, శ్రీ భాగయ్య జీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఇతర సీనియర్‌లు అయిన కజంపాడి సుబ్రమణ్య భట్‌, మంగేష్‌ భేండే, సిఆర్‌ ముకుంద, క్షేత్ర సంఘచాలక్‌ శ్రీ వి. నాగరాజు కూడా సంతాపం ప్రకటించారు.