Home Telugu Articles రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి సవరించిన తీరు

రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి సవరించిన తీరు

0
SHARE

కె. శ్యామ్ ప్రసాద్

పెరియార్‌ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో, హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించారు. వారి సామాజిక అసమానతల నిర్మూలన ఉద్యమం ‘హిందూమత వ్యతిరేక ఉద్యమదిశలో నడిచింది. వారిపై కమ్యూనిస్టు నాయకుల ప్రభావం కూడా ఉంది. 1956లో మద్రాస్ నగర వీధులలో శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాలవేసి అవమానపరుస్తూ ఊరేగింపు నిర్వహించారు. హిందూ సమాజం దేశవ్యాప్తంగా విస్తుపోయింది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితికి గుర‌య్యింది.

పెద్దజీయర్ స్వామిగా పిలుబడేవారు అప్పటికి ఇంకా సన్యాస దీక్షను స్వీకరించలేదు. అప్పటికి వారు గృహస్థు బాధ్యతలు ఇంకా కొన్ని నిర్వహించాల్సినవి ఉన్నాయి. ఆ బాధ్యతలను రెండు సంవత్సరాల్లో పూర్తిచేసుకొని సన్యాసం స్వీకరించి, పెద్దజీయ‌ర్‌ స్వామి అయ్యారు. మద్రాస్ నగర వీధులలో జరిగిన రామాపచారాన్ని తొలగించే కార్యాచరణకు ఉపక్రమించారు.

రామాపచారం జరిగిన చోటే శ్రీరామ క్రతువు:
చెన్నై నగరంలో ఏయే వీధుల గుండా శ్రీరాముని చిత్రపటానికి అవమానం జరిగిందో అదే వీధులలో 28 రోజుల శ్రీరామ పూజా కార్యక్రమం నిర్ణయం చేశారు. పూజ నిర్వహణకు వేద పండితులను రప్పించారు. ఆ వేద పండితులకు ఆశ్రయం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఆ వేద పండితులు రోడ్డుప్రక్కన ఫుట్ పాత్ పైన కొన్ని రాత్రులు పడుకున్నారు. ఇదిచూసి మూడు, నాలుగు  రోజులకే స్థానికులు ఆ వేద పండితులకు ఆశ్రయం ఇవ్వడానికి ధైర్యం వచ్చింది. స్థానిక ప్రజలు శ్రీరామ పూజలో పెద్దఎత్తున పాల్గొనడం, అన్ని విధాలా సహకరించడం ప్రారంభమైంది. స్థానిక ప్రజల్లో అంతరంగంగా ఉన్న రామభక్తి బయటకు వ్యక్తం కావడం ప్రారంభమైంది. పూజ చివరినాటికి ప్రజలు అందరూ శ్రీరామ భక్తి ప్రవాహంలో మునిగి తేలారు. నగరమంతా రామమయం అయింది. ఈ రామ భక్తి ప్రభావం మొత్తం తమిళనాడుకు విస్తరించి సాగింది. ఈ రామభక్తి సాగరాన్ని దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దజీయర్ స్వామి.

ఇంటింటా రామకోటి :
“ఇంటింటా శ్రీ రామాన్ని కొటిసార్లు రాయాలి” అని వారు పిలుపు ఇచ్చారు. అలా రామకోటి వ్రాసినవారు ఆ పుస్తకాలతో శ్రీరామ క్రతువుకు రావాలి. 28 రోజులపాటు శ్రీరామ క్రతువు జరుగుతుంది. చివరలో అక్కడ శ్రీరామ క్రతువు జరిగినట్లుగా శ్రీరామ జప స్తంభం నిర్మాణం ప్రారంభం అవుతుంది. దాని ఖర్చు ఎట్లా? ఒకరో, ఇద్దరో ధనవంతులు ఇవ్వడం కాదు. అందరి రామభక్తుల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి రామ భక్తుడు శ్రీరామ స్తంభం నిర్మాణానికి తెప్పించిన 10వేల ఇటుకులపై ఒక భక్తుడు శ్రీరామ అని వ్రాసి, ఒక ఇటుకపై ఒక రూపాయి సమర్పించాలి. ఆ విధంగా వచ్చిన 10వేల రూపాయలు, ఆ పదివేల ఇటుకలతో శ్రీరామ జప‌స్తంభం నిర్మాణం అవుతుంది

108 చోట్ల శ్రీరామ క్రతువులు :
ఒకచోట 28 రోజుల శ్రీరామ క్రతువు పూర్తి అయిన వెంటనే ముందస్తు యోజనతో పెద్ద జీయర్ స్వామి మరొక స్థలంలో శ్రీరామ క్రతువు ప్రారంభించేందుకు వెళ్ళేవారు. ఈ విధంగా నేపాల్ తో సహా దేశవ్యాప్తంగా 107 చోట్ల శ్రీరామ క్రతువులు, శ్రీరామ జప స్తంభాల నిర్మాణం చేపట్టారు. ఈ శ్రీరామ ధర్మ ప్రచారం ఉద్యమం ఏకబిగిన 10 సంవత్సరాలు చేశారు. 108వ శ్రీరామ క్రతువు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల దివ్య క్షత్రంలో చేశారు.
ప్రతి ఇంటా శ్రీరామ కోటి వ్రాయడం, అలా 10వేల మందితో 28 రోజుల శ్రీరామ క్రతువు, ఆ 10వేల మంది రామభక్తుల రూపాయి, రూపాయి ద్వారా శ్రీరామ జపస్తంభ నిర్మాణం, ఈ విధంగా దేశవ్యాప్తంగా 108 చోట్ల నిర్వహణ, ప్రతిచోట, ప్రతి అడుగులో సామాన్య రామభక్తుల భాగస్వామ్యం. ఇది శ్రీరామ జపయజ్ఞ ఉద్యమ చరిత్ర. దీనితోనే కథ పూర్తికాలేదు

రామస్వామి నాయ‌క‌ర్‌తో పెద్ద జీయర్ స్వామి ముఖాముఖి :
 దేశవ్యాప్తంగా 108 చోట్ల కార్యక్రమాలు పూర్తిచేసుకొని 1972లో పెద్ద జీయర్ ‌స్వామి శ్రీరామస్వామి నాయకర్ ను ట్రిచిలో కలిశారు. వీరి రాకతో పెరియార్ ఆశ్చర్యపోయారు. తన స్వీయ అనుభవాలను పెరియార్ వివరించారు. “నా తండ్రి శ్రీరామ భక్తుడు. అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. ఒకరోజు శ్రీరాముని విగ్రహంపై సాలెపురుగు ప్రాకడం చూసాను. తనపై సాలెపురుగు ప్రాకుతున్నా ఏమి చేయలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అని హిందూ మత వ్యతిరేకి అయ్యాను”అని వివరించారు

పెద్ద జీయ‌ర్‌ స్వామి సమాధానం ఇస్తూ, “మీరు మీ అబ్బాయిని తలపైకి ఎక్కించుకోరు. మీ ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. మీ మనవడిని అయితే భుజంపై ఎక్కించుకుంటారు. మీ ముని మనవడిని అయితే తల పైకి ఎక్కించుకుంటారు. అంతేకదా! ఇది సహజం అలాగే భగవంతుడు ఆ అల్పప్రాణి సాలె పురుగు తన పైన ప్రాకుతూ ఉంటే ఎందుకు తోసేస్తాడు? మనలాగా మరింతగా ఆనందించడా దేవునికి మనుషుల పట్లేకాదు, అన్ని జీవులపట్ల ఎంతో ప్రేమ, వాత్సల్యం ఉంటుంది” అని వివరించారు

నాడు నేను ఈరకంగా ఆలోచించలేకపోయాను” అని రామస్వామి నాయకర్ ఆ 93వ ఏట వివరించారు. పెద్దజియర్ స్వామి లేచి “నాకంటే మీరు పెద్ద రామభక్తులు. మీ అమ్మ., నాన్న మీకు పెట్టిన పేరు రామస్వామీ నాయకర్. మీ 93 ఏళ్ళ దీర్ఘ జీవనంలో మీ పేరుతో సంతకాన్ని లక్షలసార్లు పెట్టారు. కనుక మీరు పెద్ద రామభక్తులే. నమస్కారం” అని శెలవు పుచ్చుకుని వచ్చేశారు.

రామస్వామి నాయకర్ చకితులై మౌనం వహించారు. ఆ మౌనం వెనుక ఎన్ని అర్థాలో..

–  ర‌చ‌యిత‌ సామాజిక స‌మ‌ర‌స‌తా జాతీయ క‌న్వీన‌ర్‌