Home News ఆంధ్రప్రదేశ్: మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్: మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు

0
SHARE
అక్రమ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే న్యాయపరమైన పోరాటం సాగిస్తామని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో చోటుచేసుకుంది.
బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం.. క‌ర్నూల్ జిల్లా నంద‌వ‌రం మండ‌లంలోని గుర‌జాల గ్రామంలో ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి అనుమ‌తులు తీసుకోకుండా 2018లో  ఐఎంబీ చర్చి పేరిట క్రైస్తవ ప్రార్ధనా మందిరం నిర్మించారు. అంతటితో ఊరుకోకుండా ఆ గ్రామంలో ఉండే ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను క్రైస్తవంలోకి మార్చడం మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల ఐఎంబీ చర్చి చుట్టూ ప్ర‌హ‌రీ గోడ నిర్మాణం చేపట్టేందుకు చర్చి పాస్టర్ ప్రయత్నించగా, దీని కారణంగా సమీపంలోని ప్రాచీన శివాలయం వద్ద జరిగే ఊరేగింపు ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతుంది అని, ఈ ప్రయత్నం విరమించుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్చి పాస్టర్ పట్టించుకోలేదు. దీంతో గ్రామస్థులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేయడంతో ఎంపీడీఓ ఫజల్ భాషా స్వయంగా విచారణ చేసి, నిర్మాణం చేసిన చర్చి గ్రామకంఠంలో ఉందని, ఇప్పుడు నిర్మించ తలపెట్టిన ప్రహారీ గోడ స్థలం కూడా గ్రామకంఠానిదే అని, దీని కారణంగా ప్రాచీన శివాలయంలో జరిగే ఉత్సవాలకు ఆటంకం కలుగుతుంది కనుక దీని నిర్మించకూడదు అని చర్చి యాజమాన్యానికి, గ్రామ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రహరీ గోడ నిర్మాణం ఆగిపోయింది.
తాజాగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను పనిలోకి రానివ్వడంలేదు అని, తమను వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపించిన బాధితులు, చర్చికి ప్రహారీ గోడ నిర్మాణం విషయంలో కూడా తమకు అడ్డుపడుతున్నారు అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామంలోని 12 మందితో పాటు మరికొందరి మందిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
తమపై అన్యాయంగా కేసు నమోదు చేసారు అని, తాము ఎస్సీల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని, కేవలం చర్చి ప్రహారీ గోడ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసు పెట్టినట్టు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి క్రైస్తవ సంప్రదాయాలను ఆచరిస్తాడని కూడా తెలిపారు.
దీంతో న్యాయపోరాటానికి చేయాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు జిల్లా కలెక్టరుతో పాటు ఏకంగా రాష్ట్రపతి దాకా తమ ఫిర్యాదు కాపీలను పంపించారు. గ్రామస్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
– 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం మొత్తం నందవరం మండలంలో క్రైస్త‌వుల జ‌నాభా 59 మాత్ర‌మే.. ఈ లెక్కన నందవరం మండలంలోని గురజాల గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేనప్పటికీ ఎవరి కోసం చర్చిని నిర్మాణం చేశారు?
– జీవో నెంబర్ 376 ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ పంచాయ‌తీ ల్యాండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌(లేఅవుట్ & బిల్డిండ్‌) రూల్స్ – 2002 లోని రూల్ నెంబర్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి స్థలంలోనూ మతపరమైన కట్టడాలు నిర్మాణం చేయరాద‌ని నిబంధ‌న‌లు ఉన్న‌ప‌టికీ గ్రామంలో చ‌ర్చి నిర్మాణం చేప‌ట్టి నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించారు. ఇప్పటి వరకు ఆ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– గ్రామంలోని ఎస్సీ కులానికి చెందినవారు క్రైస్తవులుగా మారి ఈ చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. The Constitutional (Scheduled Castes) Order 1950 ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇస్లాం లేదా  క్రెస్తవ మతానికి చెందిన ఆచారవ్యవహారాలు పాటిస్తూ, ఇస్లాం/క్రైస్తవ సంప్రదాయాలు పాటిస్తున్నట్లైతే అట్టి వారు షెడ్యూల్డ్ కుల హోదాకు అనర్హులవుతారు. కానీ గ్రామంలో అనేకమంది షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ కూడా ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివున్నారు. ఇది పూర్తిగా చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది.
–  క్రైస్తవులుగా మారి కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్న వ్యక్తులు ఐఎంబీ చర్చివారి ప్రోద్బలంతో, దురుద్దేశపూర్వకంగా అక్రమ కాంపౌండ్ గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామంలోని ఇతర కులాలకు చెందిన వ్యక్తులపై ఎస్సీ – ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు పెడుతూ, వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ గ్రామంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కలిగిస్తున్నారు.
– క్రైస్తవులుగా మారి, క్రైస్తవ సంప్రదాయం పాటిస్తున్న వ్యక్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడం నేరం అని, అట్టి అధికారులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, మరియు ఇతర సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని 1989లో కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
 గ్రామస్థులు తమ ఫిర్యాదులో కోరిన చర్యలు:
కలెక్టర్ నుండి రాష్ట్రపతి భవన్ దాకా వివిధ శాఖలకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు, తమ ఫిర్యాదులో పేర్కొన్న విష‌యాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ క్రింది విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు:
  • త‌మ‌ గ్రామంలో గ్రామకంఠం స్థలంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చిని తొలగించాలి.
  • చర్చికి వెళ్తూ, క్రైస్తవ సంప్రదాయాలు పాటిస్తున్న వారందరినీ రెవెన్యూ అధికారిక రికార్డుల్లో క్రైస్తవులుగా నమోదు చేయాలి.
  • క్రైస్తవులుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలను రద్దు చేసి వారికి బీసీ-సీ సర్టిఫికెట్లు కేటాయించాలి.
  • సరైన విచారణ జరపకుండా, ప్రలోభాలకు గురై, మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధం అని గ్రామ‌స్తులు తమ ఫిర్యాదులో తెలియజేశారు.

Source : NIJAM TODAY