Home News “గర్భంలోనే శిశువుకి సంస్కారం”

“గర్భంలోనే శిశువుకి సంస్కారం”

0
SHARE

ప్రతి మగువకూ తల్లికావడం అనే ఆనందానికి మించిన మరో ఆనందం ఇంకోటి ఉండదు. పుట్టే బిడ్డ మంచి ఆరోగ్యంగా పుట్టాలనీ, వాళ్లు గొప్ప వ్యక్తులు కావాలనీ ప్రతి తల్లి కోరకుంటుంది. బిడ్డ ఆరోగ్యం కోసం తను శారీరకంగానూ, మానసికంగానూ సిద్ధమవుతుంది. తమ పిల్లలకు మంచి సంస్కారం అందించాలని, వారు గొప్ప వ్యక్తులుగా సమాజంలో స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తగినట్లే వారు పుట్టినప్పటి నుంచే వారిని ఎలా పెంచాలి అనే విషయంపై తెగ ఆలోచిస్తుంటారు.

ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థ అయిన సంవర్ధినీ న్యాస్ గర్భ సంస్కార్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. అంటే బిడ్డ పుట్టక ముందే వారికి మంచి సంస్కృతీ విలువలను నేర్పడం అన్నమాట. అదే విషయాన్ని ఆ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠీ ఇటీవల చెప్పారు.

గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో పాటు గర్భధారణ సమయంలో గీతాపఠనం, రామాయణం, యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాలను ఈ సంస్థ ప్ర‌ణాళిక చేస్తోంది. ఈ కార్యక్రమాలను మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు అందించనున్నారు. అయితే ఈ విషయంపై చాలామంది రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. గర్భస్థ శిశువుకు నేర్పించడం ఏంటి అంటూ ప‌లువు ఎద్దేవా చేస్తున్నారు.

పిల్లలకు ఏ వయసులో ఏం నేర్పితే వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలం అని తల్లిదండ్రుల మదిలో నిరంతరం మెదిలే ప్రశ్న. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే కాదు. గర్భంలో ఉన్నప్పటి నుంచే వారికి సంస్కారం నేర్పించగలం. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మనం మహాభారత కాలం నుంచీ చూడగలం.

మహాభారతంలోని అభిమన్యుడి కథ మనందరికీ తెలిసిందే…తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే తండ్రి అర్జునిడి ద్వారా పద్మవ్యూహ విద్యను గురించి నేర్చుకున్నాడు. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షి గురించి కూడా మరొకకథ ఉంది. ఇతడు రాసిన అష్టావక్ర సంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం చాలా ప్రాశస్తి పొందింది. ఇతని తండ్రి పేరు కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి, తాతలు వేదాలని వల్లెవేయడాన్ని విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికాడట. ఆ విషయాన్ని అష్టావక్రుడు సూచించగా… దాన్ని అవమానంగా భావించన తండ్రి ఎనిమిది వంకరలతో పుట్టమని శపిస్తాడు. ఆ కారణంగానే ఎనిమిది అంటే అష్ట వంకరలతో పుట్టడం వల్ల అతన్ని అష్టావక్రుడు అంటాం. కాలక్రమేణ అతను గొప్ప పండితుడు కావడం, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడని సుదీర్ఘమైన కథ కూడా మన భారతంలో ఉంది.
ఇక మనందరికీ తెలిసిన మరో పురాణ గాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిర్యణకశిపుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణుభక్తిని గురించి గాథలు విన్న అతను పుట్టాక గొప్ప విష్ణుభక్తుడయ్యాడని భాగవతంలో వివరించి ఉంది. ఇలాగే పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక కథ కూడా మార్కండేయ పురాణంలో మదాలస దేవి కథ (అధ్యాయం 21, 22)లలో ఉంది.

ఇలా పురాణాల్లోనే కాదు శాస్త్రీయ విషయాల్లో కూడా ఈ విషయాన్ని పొందుపర్చారు. భాగవతంలో కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసే సందర్భంలో జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఈ విషయాలే మళ్లీ గర్భోపనిషత్తు అనే ఉపషత్తులో రాసి ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల్లో కూడా గర్భ సంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైనా అధ్యయాల్లో కాబోయే తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై వివరంగా రాసి ఉంది. లలితా సహస్రనామాల్లో కూడా ఈ వివరణ ఉంది.

స్వామివివేకానంద, శివాజీ మహారాజ్ లాంటి వీరుల విషయంలో కూడా ఇలానే జరిగింది. తాజా పరిశోధనలు కూడా ఈ విషయం నిజమని రుజువు చేస్తున్నాయి. దీన్నే ఇప్పుడు ప్రినేటల్ లర్నింగ్ అంటున్నాం. దీన్ని నేర్పించడానికి అనేక సంస్థలు కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నివేదిక ప్రకారం శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి మాట్లాడే భాషను గ్రహించగలరని వారి అధ్యయనంలో పేర్కొన్నారు. గర్భధారణ వయసు 30 వారాలు వచ్చిప్పుడు శిశువు వినే విధంగా ఇంద్రియాలు, మెదడులోని నాడీకణాలు అభివృద్ధి చెందుతాయని వారి పరిశోధనల్లో తేలింది. దీంతో గర్భంలోని శిశువుకు తల్లి ఏది చెబితే బయటక వచ్చాక కూడా అలాగే ప్రవర్తిస్తారని తేలింది. అంతేకాకుండా బిగ్గరగా వచ్చే శబ్దాలను తల్లిగర్భంలోని శిశువు ఆసక్తిగా వింటుందనీ, పిల్లల తీరును ప్రభావితం చేయడంలో తల్లిదే మొదటి ప్రాధాన్యత అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లోని ఇన్సిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సస్ రచయిత, కో డైరక్టర్ ప్రాట్రిసియా కుహ్ల్ పేర్కొంది. ఈ విషయాన్ని వారి వెబ్ సైట్ లో కూడా ప్రచురించారు .