Home News రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

0
SHARE
శబరిమల వ్యవహారం, కుటుంబ వ్యవస్థ పరిరక్షణ అంశాలపై తీర్మానాలు
గ్వాలియర్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో శబరిమల దేవస్థానం విషయంలో ధార్మిక పరంపర, దైవభక్తుల పట్ల కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరి, ఆధునిక, భౌతికవాద కాలంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం గురించి కూలంకషమైన చర్చ జరుగుతుంది. తరువాత ఈ అంశాలపైనే తీర్మానాలు కూడా ఆమోదిస్తారు. గ్వాలియర్ లోని కేదార్ ధాం లోని సరస్వతి శిశుమందిర్ ఆడిటోరియంలో భారతమాత పటానికి పూలమాల సమర్పించిన సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి లు సమావేశాలను ప్రారంభించారు.
సమావేశాల్లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చను గురించి సహ సర్ కార్యవాహ్ డా. మన్మోహన్ వైద్య పత్రికా ప్రతినిధులకు వివరించారు. శబరిమల దేవస్థాన వ్యవహారం పురాతన కాలానికి చెందిన ధార్మిక పరంపరతో ముడిపడినదని, సుప్రీం కోర్ట్ తీర్పును సాకుగా చూపి కేరళ ప్రభుత్వం హిందూ భక్తులతో అనుచితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ విషయమై సమావేశాల్లో తీర్మానం ఆమోదిస్తారని ఆయన తెలియజేశారు. అలాగే వర్తమాన పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను గురించి కూడా చర్చించడం జరుగుతుందని డా. మన్మోహన్ వైద్య తెలియజేశారు. ఈ విషయంలో `వ్యష్టి నుండి సమిష్టి వైపు’ తీసుకువెళ్ళే భారతీయ దృష్టిని అనుసరించి సంఘం పనిచేస్తుంది.
సంఘ కార్యంలో నిర్ణయాలు తీసుకునే ఉన్నత వ్యవస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ అని డా. మన్మోహన్ వైద్య వెల్లడించారు. ఈ సమావేశాలు సంవత్సరంలో ఒకసారి జరుగుతాయి. ఇవి ఒక ఏడాది దక్షిణ ప్రాంతంలో, ఒకసారి ఉత్తర ప్రాంతంలో జరుగుతాయి. ఆ తరువాత మూడవ సంవత్సరం నాగపుర్ లో నిర్వహిస్తారు. రెండువేలమంది స్వయంసేవకులకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఈ సమావేశాల్లో సంఘటన కార్యపు విస్తరణ, దృఢీకరణ గురించి చర్చ, వివిధ ప్రాంతాల్లో జరిగిన విశేష కార్యక్రమాల సమీక్ష జరుగుతాయి. సమాజ కార్యంలో ఉన్న 35 సంస్థల నివేదిక కూడా ఇక్కడ సమర్పిస్తారు. అలాగే సంఘ శిక్షవర్గ ప్రయత్నాలు, వచ్చే సంవత్సరపు కార్య యోజన గురించి కూడా ఇక్కడ చర్చిస్తారు.
రామమందిరం గురించి పత్రికా ప్రతినిధులు కొందరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ డా. మన్మోహన్ వైద్య సంబంధిత కక్షిదారులు న్యాయస్థానంలో తమ వాదన ఇప్పటికే వినిపించారని అన్నారు. ఇప్పుడు ఇక సుప్రీం కోర్ట్ ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలియజేశారు. ప్రతినిధి సభ సమావేశాల్లో రాబోయే లోక్ సభ ఎన్నికల గురించి చర్చ జరుగుతుందా అని ప్రశ్నించినప్పుడు ఎన్నికల రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగదని, అయితే అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, 100శాతం ఓటింగ్ జరిగే విధంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వయంసేవకులు జనజాగరణ చేపడతారని ఆయన తెలియజేశారు.
ప్రయాగరాజ్ కుంభ్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ ప్రభుత్వం, వివిధ పీఠాల సహకారంతో అనేక కొత్త ప్రయోగాలు చేయడం జరిగిందని, అవి మంచి ఫలితాలనిచ్చాయని సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య అన్నారు. వీటిలో యువ కుంభ, మాతృశక్తి కుంభ, సమరసత కుంభ, పర్యావరణ కుంభ మొదలైన కార్యక్రమాల వల్ల అనేక కొత్త ఆలోచనలు ప్రచార, ప్రసారం జరిగిందని ఆయన తెలియజేశారు. సక్షం సంస్థ ద్వారా ఈ ఏడాది శారీరిక, మానసిక వికలాంగుల కోసం అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన నేత్రా కుంభలో 800మందికి పైగా డాక్టర్లు 2 లక్షలమందికి పైగా వ్యక్తులకు నేత్రపరీక్ష నిర్వహించారు. ఇది ఒక కొత్త రికార్డ్. దీనితోపాటు లక్షన్నరమందికి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.
సంఘ కార్య విస్తరణ, నైపుణ్యాలను పెంచే దృష్టితో 6గురు సహ సర్ కార్యవాహలు 43 ప్రాంతాల్లో 12వేల కార్యకర్తలకు ప్రత్యేక ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని డా. వైద్య తెలియజేశారు.
భారతీయ గోవుల సంరక్షణ, గో ఉత్పత్తుల వాడకాన్ని పెంచడం సంఘ కార్య యోజనలో విశేషమైన అంశం. అలాగే కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించి అందరూ కుటుంబ విలువలను కాపాడుకోవాలని ప్రోత్సహించడం కోసం కుటుంబ ప్రబోధన్ కార్యక్రమం సాగుతోంది.
పర్యావరణ, జల సంరక్షణ పట్ల అవగాహన పెంచడం కోసం కార్య యోజనలో కొత్త గతివిధిని చేర్చడం జరిగింది.
యువతలో సంఘ కార్యం పట్ల ఆసక్తి బాగా పెరిగింది.
– సంఘ శాఖల్లో బాల, కళాశాల విద్యార్థుల సంఖ్య 62 శాతం ఉంది.
– ప్రతి సంవత్సరం 14 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 1లక్ష మందికి ప్రశిక్షణ.
– 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 1లక్ష మందికి పైగా యువకులు ప్రతి ఏడాది సంఘ కార్యంలోకి వస్తున్నారు.
– దేశ వ్యాప్తంగా ఖండ స్థాయిలో 63,367 శాఖల ద్వారా 88 శాతం ఖండలలో సంఘ కార్యం.
– 54,472 మండలాల్లో సంఘ కార్యం.
– దైనిక శాఖల సంఖ్య 59,266 .