Home News ఢిల్లీ: జేఎన్‌యూ అల్ల‌ర్ల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు

ఢిల్లీ: జేఎన్‌యూ అల్ల‌ర్ల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు

0
SHARE

నిందితులు కమ్యూనిస్ట్ సంఘానికి చెందినవారని గుర్తించిన డిల్లీ పోలీసులు

జనవరి 5న ఢిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన అల్లర్లకు ప్రధాన కారణం వివిధ కమ్యూనిస్ట్ విద్యార్ధి సంఘాలేనని డిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఆనాటి సీసీటీవీ చిత్రాల ఆధారంగా పోలీసులు అల్లర్లకు కారణమైనవారిని గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా మొత్తం తొమ్మిదిమంది  పేర్లను బయటపెట్టారు. పోలీసులు బయటపెట్టిన పేర్లు:

1. చుంచున్ కుమార్ ( జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి)

2. పంకజ్ మిశ్రా

3. భాస్కర్ విజయ్

4. ఆయిషి ఘోష్

5. సుచేత తలుక్ దర్

6. ప్రియా రంజన్

7. యోగేంద్ర భరద్వాజ్

8. డోలన్ సమంతా

9. వికాస్ పటేల్

పైన పేర్కొన్న నిందితుల్లో ఏడుగురు వివిధ కమ్యూనిస్టు విద్యార్ధి సంఘాలకు చెందినవారున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ అధ్యక్షురాలు అయిషి ఘోష్ కు ఈ అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘంలో SFI, AISA, AISF, DSF వంటి కమ్యూనిస్ట్ సంస్థలే ఉన్నాయి. ఈ సంస్థలకు చెందినవారే క్యాంపస్ లో అల్లర్లకు, దాడులకు పాల్పడ్డారని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు.

 శీతాకాలపు కోర్స్ కు జరుగుతున్న రిజిస్ట్రేషన్ ల గురించి ఈ అల్లర్లు చెలరేగాయి. రిజిస్ట్రేషన్ లను అడ్డుకునేందుకు కమ్యూనిస్ట్ విద్యార్ధి సంఘాల కార్యకర్తలు ప్రయత్నించారు. విశ్వవిద్యాలయానికి చెందిన సర్వర్ ను ధ్వంసం చేయడానికి, రిజిస్ట్రేషన్ లను నిలిపివేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తమ చర్యలను ప్రశ్నించిన అధ్యాపకులు, ఇతర విద్యార్ధి సంఘాలకు చెందిన కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ముఖానికి ముసుగులు ధరించి చేతిలో ఇనుప రాడ్లు, కర్రలు పట్టుకుని వీరు క్యాంపస్ లో భయావహమైన వాతావరణం సృష్టించారు. సబర్మతి, పెరియార్ హాస్టళ్ల పై దాడులు చేసిన వీరు ప్రత్యర్ధి విద్యార్ధి సంఘ కార్యకర్ట్లున్న గదులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇతర విద్యార్ధులను కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వీరి దాడుల్లో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఇంతలా అరాచకం సృష్టించి, దాడులకు పాల్పడిన కమ్యూనిస్ట్ కార్యకర్తలు తమపైనే దాడి జరిగిందంటూ గగ్గోలు పెట్టారు. శాంతి ర్యాలీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు.  ఆ విధంగా తాము సృష్టించిన అరాచకం బయటపడకుండా చూసుకునేందుకు ప్రయత్నించారు.